బరువుపై డాక్టర్ రెడ్డీస్ పోరు – బరువు, షుగర్ రెండింటికి చెక్కు పెట్టే మందు

Dr.Reddy's Medicine Ozempic for weight loss and Diabetes
  • ఇండియన్లకు అందుబాటులోకి ఓజెంపిక్
  • మార్చి నుంచి మార్కెట్లోకి డాక్టర్ రెడ్డీస్ ఔషధం
  • పేటెంట్ గడువు ముగియడంతో కొత్తగా రాక
  • సామాన్యుడికి సైతం సరసమైన ధరలకే

సహనం వందే, హైదరాబాద్:

మధుమేహం ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. దీనికి తోడు పెరిగిన బరువు ప్రాణాల మీదకు తెస్తోంది. ఈ రెండింటికీ చెక్ పెట్టే అద్భుత ఔషధం ఓజెంపిక్ కోసం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పోటీ పెరిగింది. విదేశీ కంపెనీల గుత్తాధిపత్యానికి తెరదించుతూ మన హైదరాబాద్ సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ఇప్పుడు సామాన్యుడికి ఈ సంజీవనిని చేరువ చేసేందుకు సిద్ధమైంది.

Medicine for Obesity

దేశీ మార్కెట్లో సరికొత్త విప్లవం
డయాబెటిస్ నియంత్రణలో ఓజెంపిక్ ఒక సంచలనం. దీనిని తయారు చేసే నోవో నార్డిస్క్ సంస్థ పేటెంట్ గడువు ముగియడంతో భారతీయ కంపెనీలకు లైన్ క్లియర్ అయింది. వచ్చే మార్చి నెలలో డాక్టర్ రెడ్డీస్ సంస్థ ఈ ఔషధానికి సంబంధించిన జెనరిక్ వెర్షన్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనివల్ల వేల రూపాయల ఖరీదు చేసే మందు అతి తక్కువ ధరకే లభించే అవకాశం ఉంది.

భారీగా తగ్గనున్న చికిత్స ఖర్చు
ప్రస్తుతం విదేశీ కంపెనీలు విక్రయించే ఈ మందు ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తులో ఉన్నాయి. ఒక్కో ఇంజెక్షన్ కోసం వేల రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. అయితే దేశీయంగా డాక్టర్ రెడ్డీస్ రంగంలోకి దిగడంతో ధరల యుద్ధం మొదలుకానుంది. ప్రస్తుత ధరతో పోలిస్తే కనీసం 50 నుంచి 70 శాతం తక్కువ ధరకే ఇది లభించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

పెరగనున్న కంపెనీ ఆదాయం
ఈ ఔషధ విక్రయాల ద్వారా డాక్టర్ రెడ్డీస్ భారీ లాభాలను ఆశిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా బరువు తగ్గించే మందుల మార్కెట్ విలువ దాదాపు 8.40 లక్షల కోట్ల రూపాయలకు చేరుతుందని అంచనా. ఇందులో సింహభాగం దక్కించుకోవాలని రెడ్డిస్ ప్లాన్ చేస్తోంది. కేవలం భారత్ లోనే కాకుండా ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలకు కూడా ఇక్కడి నుంచే ఎగుమతులు చేసే అవకాశం ఉంది.

పోటీలో మరిన్ని సంస్థలు
కేవలం డాక్టర్ రెడ్డీస్ మాత్రమే కాకుండా సన్ ఫార్మా, జైడస్ లైఫ్ సైన్సెస్ వంటి సంస్థలు కూడా ఈ రేసులో ఉన్నాయి. మార్చి నాటికి రెడ్డీస్ ల్యాబ్స్ ముందు వరుసలో నిలవనుంది. దీనివల్ల మార్కెట్లో పోటీ పెరిగి వినియోగదారులకు నాణ్యమైన మందులు తక్కువ ధరకే అందుతాయి. ఈ పోటీ వల్ల మన దేశం గ్లోబల్ హెల్త్ హబ్‌గా మరింత బలోపేతం కానుంది.

ఆరోగ్య రంగంలో పెను మార్పులు
అధిక బరువు, షుగర్ సమస్యలతో బాధపడే భారతీయుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. సుమారు 10 కోట్ల మందికి పైగా మధుమేహంతో సతమతమవుతున్నారు. ఇంతటి భారీ జనాభాకు ఓజెంపిక్ వంటి సమర్థవంతమైన మందులు అందుబాటులోకి వస్తే దేశ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముఖ్యంగా గుండె జబ్బుల ముప్పును తగ్గించడంలో ఈ ఔషధం కీలక పాత్ర పోషిస్తుంది.

నిపుణుల హర్షం
దేశీయంగా ఈ మందు తయారీని వైద్య నిపుణులు స్వాగతిస్తున్నారు. ఇప్పటివరకు దిగుమతులపై ఆధారపడటం వల్ల కొరత ఏర్పడేది. ఇకపై ఆ సమస్య ఉండదు. డాక్టర్ రెడ్డీస్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది మధ్యతరగతి రోగులకు ఉపశమనం లభిస్తుంది. మార్చి నెల కోసం రోగులతో పాటు ఫార్మా రంగం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *