ఉమర్ బెయిల్… చంద్రచూడ్ డిబేట్ – ఉమర్ ఖలీద్ కేసుపై మాజీ సీజేఐ సంచలనం

ఉమర్ బెయిల్... చంద్రచూడ్ డిబేట్
  • ఏళ్ల తరబడి జైలు ఉంచడం శిక్షతో సమానం
  • విచారణలో జాప్యం రాజ్యాంగ ఉల్లంఘన
  • నిందితులకు వేగవంతమైన విచారణ దక్కాలి
  • కఠిన రూల్స్ రాజ్యాంగం కంటే ఎక్కువ కాదు
  • చంద్రచూడ్ వ్యాఖ్యలపై దేశవ్యాప్త చర్చ

సహనం వందే, జైపూర్:

నిందితులకు బెయిల్ ఇవ్వడమే నిబంధన అని… నిరాకరించడం కేవలం మినహాయింపు మాత్రమేనని సుప్రీం కోర్ట్ మాజీ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ స్పష్టం చేశారు. ఐదేళ్లుగా జైల్లో ఉన్న ఉమర్ ఖలీద్ కేసును ప్రస్తావిస్తూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. విచారణ పూర్తికాకుండానే ఒక వ్యక్తిని ఏళ్ల తరబడి కటకటాల వెనక ఉంచడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన తేల్చి చెప్పారు.

విచారణే శిక్ష కావద్దు
జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్‌లో ఆదివారం చంద్రచూడ్ మాట్లాడారు. విచారణలో జరిగే జాప్యం నిందితుడికి శిక్షగా మారకూడదని ఆయన అన్నారు. ఒక వ్యక్తిని విచారణ లేకుండా నిర్బంధించడం వల్ల రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ వేగంగా పూర్తి చేయలేనప్పుడు నిందితుడికి బెయిల్ మంజూరు చేయడమే సరైన పద్ధతి అని ఆయన స్పష్టం చేశారు.

రాజ్యాంగం కల్పించిన హక్కు
జీవించే హక్కులో భాగంగానే వేగవంతమైన విచారణ పొందే హక్కు కూడా ఉందని చంద్రచూడ్ గుర్తు చేశారు. ఆర్టికల్ 21 ప్రకారం ఈ హక్కును ఎవరూ కాదనలేరని చెప్పారు. బెయిల్ ఇవ్వకుండా అడ్డుకునే చట్టాలు ఏవైనా సరే రాజ్యాంగం కంటే పైన ఉండవని ఆయన కుండబద్దలు కొట్టారు. పరిస్థితులు అనుకూలించనప్పుడు బెయిల్ ఇవ్వడమే న్యాయమని ఆయన వివరించారు.

నిబంధనల దుర్వినియోగం వద్దు
బెయిల్ ఇచ్చే సమయంలో కొన్ని నిబంధనలు విధించవచ్చని ఆయన చెప్పారు. నిందితుడు మళ్లీ నేరం చేయకుండా, సాక్ష్యాలను తారుమారు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జాతీయ భద్రత పేరు చెప్పగానే న్యాయస్థానాలు గుడ్డిగా వెళ్లకూడదని చంద్రచూడ్ హెచ్చరించారు. ఆరోపణల్లో వాస్తవం ఉందో లేదో కోర్టులు నిశితంగా పరిశీలించాలని ఆయన కోరారు.

న్యాయమూర్తుల బాధ్యత
న్యాయమూర్తులు కేవలం ఆధారాల ప్రకారమే నడుచుకోవాలని ఆయన హితవు పలికారు. ప్రజల భావోద్వేగాలకు లోబడి తీర్పులు ఇవ్వకూడదని చెప్పారు. తన హయాంలో సుప్రీంకోర్టు 21 వేల బెయిల్ దరఖాస్తులను పరిష్కరించిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కోర్టుల పనితీరు రాజ్యాంగ సమతుల్యతను కాపాడటమేనని ఆయన స్పష్టం చేశారు.

మూడు మినహాయింపులు
బెయిల్ నిరాకరించడానికి కేవలం మూడు కారణాలు ఉండాలని చంద్రచూడ్ వివరించారు. నిందితుడు పారిపోయే అవకాశం ఉండటం, సాక్షులను బెదిరించడం లేదా తిరిగి నేరాలకు పాల్పడటం వంటివి ఉంటేనే బెయిల్ ఆపాలని చెప్పారు. ఈ మూడు కారణాలు లేనప్పుడు నిందితుడు స్వేచ్ఛగా బయట ఉండే హక్కు కలిగి ఉంటాడని ఆయన తేల్చి చెప్పారు.

వ్యవస్థపై నమ్మకం
బెయిల్ నిర్ణయాలను శిక్షగా మార్చడం వల్ల న్యాయ వ్యవస్థపై విశ్వసనీయత తగ్గుతుందని చంద్రచూడ్ హెచ్చరించారు. నిందితులను ఏళ్ల తరబడి విచారణ లేకుండా ఉంచడం వల్ల సామాజికంగా కూడా నష్టం జరుగుతుందని అన్నారు. రాజ్యాంగ బద్ధమైన విలువలను కాపాడటమే న్యాయస్థానాల అంతిమ లక్ష్యం కావాలని చంద్రచూడ్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *