- సియాచిన్ కొండల్లో లోడర్ల అదృశ్య గాథ
- మంచులో దేశభక్తి.. చావుతో కుస్తీ!
- 18 వేల రూపాయల కోసం అగ్నిపరీక్ష
- సైనికుడి ఆకలి తీర్చే సామాన్యుడు
- కళ్లు తెరిపించిన సంభాషణ
లడఖ్ మంచుకొండల్లో సాగుతున్న ప్రయాణం అది. ఢిల్లీలో 50 లక్షల ప్యాకేజీ తీసుకునే ఒక కంపెనీ మేనేజర్, అతని కారు నడిపే 28 ఏళ్ల స్థానిక యువకుడి మధ్య జరిగిన మాటలు నా గుండెను పిండేశాయి. పక్కా ఏసీ గదుల్లో బతికే పర్యాటకుడు ఒకవైపు, దేశం కోసం చావును ముద్దాడే డ్రైవర్ మరోవైపు. ఆ ఇద్దరి మధ్య జరిగిన అసలు సిసలు సంభాషణ ఆసక్తికరం.
నిశ్శబ్దాన్ని చీల్చిన ప్రయాణం…
పర్యాటకుడికి డ్రైవరుకు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఇక్కడ సీజన్ అయిపోయాక నువ్వు ఎక్కడికి వెళ్తావు? గోవాకు గానీ ఢిల్లీకి గానీ హోటల్ పనులకు వెళ్తావా అని ఆ పర్యాటకుడు డ్రైవర్ను అడిగాడు. దానికి ఆ యువకుడు ‘నేను ఎక్కడికీ వెళ్లను సార్ ఇక్కడే ఉంటాను’ అని చెప్పాడు. శీతాకాలం భయంకరంగా ఉంటుంది కదా అప్పుడు ఏం చేస్తావని అడిగితే.. నేను సియాచిన్ వెళ్తాను అని డ్రైవర్ బదులిచ్చాడు. ఆ మాట వినగానే ఆ మేనేజర్ కళ్లు తేలేశాడు. అక్కడ ఇక్కడికంటే చలి తీవ్రత ఎక్కువ ఉంటుంది కదా అని ఆశ్చర్యపోయాడు.

సైన్యంలో బరువులు మోసే పని…
అవును సార్ అక్కడ చలి చాలా తీవ్రంగా ఉంటుంది. నేను అక్కడ లోడర్గా పని చేస్తానని ఆ యువకుడు చెప్పాడు. ఇది కాంట్రాక్ట్ ఉద్యోగం. ఇక్కడి నుండి 250 కిలోమీటర్లు నడిచి వెళ్లాలి. దానికి 15 రోజులు పడుతుంది. అక్కడ వైద్య పరీక్షలు చేస్తారు. పాస్ అయితే యూనిఫామ్, హెల్మెట్ ఇస్తారు. అలా అక్కడ మూడు నాలుగు నెలలు పని చేయాలి. అక్కడ ఏం పని చేస్తావని అడిగితే… సైన్యం జారవిడిచే సామాగ్రిని మోస్తాం అని సమాధానం ఇచ్చాడు.
మైనస్ 50 డిగ్రీల చలిలో అర్ధరాత్రి 2…
అక్కడ ట్రక్కులు వెళ్లలేవు.. స్నో స్కూటర్లు వాడితే వాటి శబ్దంతో శత్రువు కనిపెడతాడు. అందుకే మేము అర్ధరాత్రి 2 గంటలకు బయలుదేరుతాం. టార్చ్ లైట్లు వాడకూడదు. నిశ్శబ్దంగా చీకటిలో నడవాలి. అక్కడ మైనస్ 50 డిగ్రీల చలి ఉంటుంది. 18,000 అడుగుల ఎత్తున ఏ జంతువు ప్రాణాలతో ఉండలేదు. అక్కడ గుర్రాలు గాడిదలు కూడా బతకలేవు అని ఆ డ్రైవర్ చెబుతుంటే నా రక్తం గడ్డకట్టింది. గాలి ఆడని చోట బరువులు మోయడం ఎంత నరకం!
మరణం అనివార్యమైన చోట…
ఆక్సిజన్ తక్కువ కాబట్టి 15 కేజీల కంటే ఎక్కువ బరువు ఇవ్వరని డ్రైవర్ చెప్పాడు. రోజుకు కేవలం 2 గంటలు మాత్రమే పని చేస్తారట. మిగిలిన సమయం శరీరాన్ని ప్రాణాలతో ఉంచుకోవడానికే సరిపోతుంది. ఇది ప్రాణాలతో చెలగాటం కదా అని పర్యాటకుడు అడిగితే.. ఆ యువకుడు కాసేపు మౌనంగా ఉన్నాడు. నా స్నేహితులు చాలా మంది తిరిగి రాలేదు సార్.. కొందరు లోయల్లో పడిపోతే మరికొందరు ఫ్రాస్ట్ బైట్తో చనిపోయారు. అక్కడ మరణం అనివార్యం సార్ అని నిట్టూర్చాడు.
ప్రాణంతో చెలగాటానికి 18 వేల జీతం
అంత కష్టానికి జీతం బాగా ఇస్తారా అని పర్యాటకుడు అడిగితే… నెలకు 18,000 రూపాయలు వస్తాయి సార్ అని డ్రైవర్ చెప్పాడు. మూడు నాలుగు నెలల్లో 50 వేల వరకు దాచుకోవచ్చు. నా కుటుంబం గడవడానికి అది చాలు. అన్నిటికంటే మించి దేశం కోసం ఏదో చేశామన్న తృప్తి మిగులుతుంది సార్ అన్నాడు. ఆ మాట వినగానే 50 లక్షల ప్యాకేజీ తీసుకునే ఆ మేనేజర్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ యువకుడి ముందు తను ఎంత చిన్నవాడో అతనికి అర్థమైపోయింది.
అసలైన వెన్నెముక ఎవరు?
మనం సుఖంగా పడుకున్నామంటే అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఆ గడ్డకట్టే మంచులో ఎవరో భారాన్ని మోస్తున్నారని గుర్తుంచుకోవాలి. దేశభక్తి అంటే కేవలం నినాదాలు కాదు.. అది త్యాగం. సైన్యం కోసం ఆకలిని భరిస్తూ బరువులు మోసే ఆ యువకుడే ఈ దేశానికి వెన్నెముక. వారు ఉన్నారు కాబట్టే మనం ఉన్నాం. ఆ యువకుడి త్యాగం ముందు తల వంచడం తప్ప నేనేం చేయలేకపోయాను.
