కార్టూన్లతో ఎన్’కౌంటర్’ – ‘ఈనాడు’ శ్రీధర్ బొమ్మల్లో బాంబులే

Cartoonist Eenadu Sreedhar
  • సామాన్యుడి గొంతుకగా కార్టూన్లు
  • రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు
  • దశాబ్దాలపాటు సాగిన అప్రతిహత ప్రయాణం
  • ఆయన సేవలను గుర్తించిన సీఎం చంద్రబాబు
  • రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియామకం
  • సౌతిండియా మీడియా అసోసియేషన్ హర్షం

సహనం వందే, హైదరాబాద్:

తెలుగు పత్రికా రంగంలో కార్టూన్ అంటే శ్రీధర్… శ్రీధర్ అంటే కార్టూన్ అన్నట్లుగా ఆయన ముద్ర పడింది. కొన్ని దశాబ్దాల పాటు ఈనాడు పత్రికలో ఆయన గీసిన గీతలు రాజకీయ దిగ్గజాలను సైతం ఆలోచింపజేశాయి. గీతలతోనే లోకాన్ని చదివిన అరుదైన కళాకారుడు శ్రీధర్.

ఏపీ ప్రభుత్వ సలహాదారుగా నియామకం
ఈనాడు నుంచి రిటైర్ అయిన తర్వాత ఆయన బొమ్మలు గీస్తూనే ఉన్నారు. ఆయనను గౌరవించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా అధికార హోదా ఇవ్వడం సముచితం. ఇది జర్నలిస్టు లోకానికి ఎంతో గర్వకారణం. ఆయనకు ఈ పదవి ఇవ్వడం పట్ల జర్నలిస్టు సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సౌత్ ఇండియా మీడియా అసోసియేషన్ (సైమా) అధ్యక్షులు రవి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు.

Sreedhar Cartoon

బాల్యంలోనే పడిన బీజం
శ్రీధర్ చిన్నతనం అంతా చిత్రకళతోనే ముడిపడి ఉంది. తన తండ్రి నుంచి ఆయనకు ఈ కళ అబ్బింది. ఆయన తండ్రి కూడా గొప్ప కళాకారుడు కావడంతో ఇంట్లో బొమ్మలు గీయడం అనేది సాధారణ విషయంగా ఉండేది. ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలోనే ఆయనలో చిత్రకళ పట్ల ఆసక్తి పెరిగింది. సాధారణ విద్యార్థిలాగే ఇంజనీర్ కావాలని అనుకున్నా విధి మాత్రం ఆయనను కుంచె వైపు నడిపించింది. ఆ గీతలే ఆయన భవిష్యత్తును మార్చేశాయి.

ఈనాడు ప్రయాణం ప్రారంభం…
చదువు పూర్తయ్యాక ఉద్యోగ వేటలో ఉన్నప్పుడు ఆయనకు ఈనాడు అధినేత రామోజీరావు నుంచి పిలుపు వచ్చింది. ఉస్మానియా ఆసుపత్రి సమీపంలో అప్పట్లో పరీక్షలు నిర్వహించారు. మొదటి రోజే ఆయన ప్రతిభను గుర్తించిన రామోజీరావు ఉద్యోగం ఇచ్చారు. ఆ సమయంలో తనకు వచ్చిన మొదటి జీతం ఎంతో ఇప్పటికీ ఆయనకు గుర్తుంది‌. ఆ జీతంతో ఇంట్లో వాళ్లకు బట్టలు కొనిచ్చిన ఆ జ్ఞాపకం ఆయన మనసులో చెదరలేదు. అలా మొదలైన ప్రయాణం కొన్ని దశాబ్దాల పాటు నిర్విరామంగా సాగింది.

sreedhar Cartoon

రాజకీయ వ్యంగ్యాస్త్రాలు…
రాజకీయ కార్టూన్ అనేది ఒక కత్తి మీద సాము లాంటిదని శ్రీధర్ అంటారు. ఏ విషయాన్ని అయినా సూటిగా చెప్పడంతో పాటు అందులో వ్యంగ్యం ఉండాలి. సమాజంలో జరుగుతున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని ఆయన చెప్తారు. రాజకీయ నాయకుల తీరును ఎండగట్టడంలో ఆయన ఎప్పుడూ వెనకాడలేదు. అందుకే ఆయన కార్టూన్లు అంత ప్రాచుర్యం పొందాయి. రాజకీయాల్లోని లోటుపాట్లను ఎత్తిచూపడం ద్వారా సామాన్యుడికి అవగాహన కల్పించేవారు.

కుంచె వెనుక లోతైన జ్ఞానం…
కేవలం బొమ్మ గీయడం మాత్రమే కార్టూనిస్ట్ పని కాదు. లోతైన విజ్ఞానం ఉండాలని ఆయన నమ్ముతారు. చరిత్ర, రాజకీయం, సామాజిక అంశాల మీద పట్టు ఉండాలి. ఇందిరా గాంధీ కాలం నుంచి నేటి రాజకీయాల వరకు ఆయన ఎన్నో మార్పులను చూశారు. ప్రపంచ దేశాల్లోని పరిస్థితులను కూడా గమనిస్తూ ఉండేవారు. నిరంతరం ఏదో ఒకటి నేర్చుకుంటేనే మంచి కార్టూన్ పుడుతుందని ఆయన భావన.

వివాదాలు… విమర్శలు
ఒక కార్టూనిస్ట్ గా పనిచేస్తున్నప్పుడు విమర్శలు రావడం సహజం. ఆయన గీసిన కొన్ని కార్టూన్లు అప్పట్లో పెద్ద చర్చకు దారితీశాయి. ప్రధాన మంత్రుల నుంచి సామాన్యుల వరకు అందరినీ తన కార్టూన్లతో పలకరించారు. కొన్నిసార్లు బెదిరింపులు వచ్చినా తన వృత్తి ధర్మాన్ని మాత్రం విడవలేదు. తన పనిని తాను నిజాయితీగా చేసుకుంటూ వెళ్లడం వల్లే అంతటి గుర్తింపు వచ్చిందని శ్రీధర్ వివరిస్తారు.

నేటి తరానికి స్ఫూర్తి
నేటి కాలంలో టెక్నాలజీ పెరిగినా మనిషి ఆలోచనకే ప్రాధాన్యత ఉంటుందని ఆయన నమ్ముతారు. కార్టూన్ అనేది ఒక భావం, అది గుండెల్లో నుంచి రావాలి. ప్రతి రోజూ కొత్తగా ఆలోచించడం అనేది ఒక సవాలుతో కూడుకున్న పని. అంకితభావం ఉండాలని సూచిస్తారు. తన జీవితాంతం గీతలతోనే కుస్తీ పడుతూ గడిపిన శ్రీధర్ ప్రతి ఒక్కరికీ ఒక నిలువెత్తు స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *