డయాబెటిస్… డోంట్ వర్రీస్ – అనవసర అపోహలతో ఆరోగ్య సమస్యలు

Diabetes
  • పంచదార వల్లే షుగర్ వస్తుందనేది అపోహే
  • షుగర్-ఫ్రీ అంటే సేఫ్ అనుకోవద్దు
  • ఇన్సులిన్ అంటే అంత్య దశ కాదు..
  • యాపిల్స్, బెర్రీలు, జామ, నారింజ తినొచ్చు

సహనం వందే, హైదరాబాద్:

డయాబెటిస్ అంటేనే చాలామంది భయపడే పరిస్థితి. ముఖ్యంగా దీని చుట్టూ అల్లుకున్న అపోహలు మరింత గందరగోళానికి గురిచేస్తాయి. ‘పంచదార తింటేనే డయాబెటిస్ వస్తుంది’ అనేది చాలా మందిలో ఉన్న బలమైన నమ్మకం. నిజానికి ఇది పూర్తి నిజం కాదు. టైప్-2 డయాబెటిస్ అనేది జన్యువులు, ఇన్సులిన్ నిరోధకత, అధిక బరువు, వ్యాయామం లేకపోవడం వంటి వాటి కలయిక వల్ల వస్తుంది. చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలు నేరుగా డయాబెటిస్‌ను కలిగించకపోయినా… అవి బరువు పెరగడానికి కారణమై అప్పటికే ఇన్సులిన్ నిరోధకత ఉన్నవారిలో ముప్పును పెంచుతాయి. అప్పుడప్పుడు స్వీట్లు తినడం సమస్య కాదు కానీ మొత్తం ఆహారపు అలవాట్లు, జీవనశైలే కీలకం.

షుగర్-ఫ్రీ అంటే సేఫ్ కాదు!
‘షుగర్-ఫ్రీ’ అనే లేబుల్ ఉన్న ఉత్పత్తులు సురక్షితమైనవనే భ్రమ చాలామందికి ఉంటుంది. కానీ ఆ ప్యాకేజ్డ్ స్నాక్స్‌లో శుద్ధి చేసిన పిండి, అధిక స్టార్చ్, సోడియం, అనారోగ్యకరమైన ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి కూడా రక్తంలో చక్కెర స్థాయిలను పెంచగలవు. వీటిని ఎక్కువగా తీసుకుంటే బరువు పెరగడానికి కూడా దోహదపడతాయి. చక్కెర ప్రత్యామ్నాయాలు (షుగర్ సబ్‌స్టిట్యూట్స్) కూడా కొన్నిసార్లు తీపి కోరికలను పెంచవచ్చు. అందుకే కేవలం ప్యాకేజ్డ్ డైట్ ఉత్పత్తులపై ఆధారపడకుండా, పోషక లేబుల్‌లను జాగ్రత్తగా చదివి పీచు, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే సమతుల్య ఆహారంపై దృష్టి పెట్టడం ముఖ్యం.

ఇన్సులిన్ అంటే అంత్య దశ కాదు…
ఇన్సులిన్ థెరపీని తీసుకోవడం అంటే డయాబెటిస్ చివరి దశకు చేరుకుందని చాలామంది భావిస్తారు. ఇది పూర్తిగా అపోహే. ఇన్సులిన్ అనేది గ్లూకోజ్‌ను నియంత్రించడానికి శరీరానికి అవసరమైన సహజ హార్మోన్. ఇన్సులిన్ తీసుకోవడం మొదలుపెట్టడం అనేది వ్యాధి తీవ్రత పెరిగిందనడానికి లేదా మీరు విఫలమయ్యారనడానికి సంకేతం కాదు. కొందరికి ఇన్ఫెక్షన్లు, ఆపరేషన్లు, గర్భధారణ లేదా తీవ్రమైన ఒత్తిడి వంటి సమయాల్లో తాత్కాలికంగా ఇన్సులిన్ అవసరం కావచ్చు. సరైన సమయంలో ఇన్సులిన్ తీసుకోవడం అనేది పాంక్రియాస్‌ను రక్షించడానికి, దీర్ఘకాలిక సమస్యలను నివారించడానికి తీసుకునే ఒక ముందస్తు నిర్ణయం మాత్రమే.

పండ్లు తినకూడదా?
డయాబెటిస్
ఉన్నవారు పండ్లు తినకూడదు అనేది మరొక తప్పుడు అభిప్రాయం. పండ్లు విటమిన్లు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే పోషక నిలయాలు. అయితే జ్యూసుల కంటే పొట్టు తీయని పండ్లను తినడం, పరిమాణం నియంత్రించడం కీలకం. యాపిల్స్, బెర్రీలు, జామ, నారింజ వంటి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న పండ్లను సమతుల్య ఆహారంలో చేర్చుకోవచ్చు. ఇక డయాబెటిస్ వృద్ధులకే వస్తుందనేది పాత మాట. అధిక బరువు, టీవీ, మొబైల్ తెరలకు అతుక్కుపోవడం, వ్యాయామం లేకపోవడం, ప్రాసెస్డ్ ఫుడ్స్ అందుబాటులో ఉండటం వల్ల యుక్తవయస్కులు, యువతలో కూడా టైప్-2 డయాబెటిస్ కేసులు పెరుగుతున్నాయి. చిన్నప్పటి నుంచే ఆరోగ్యకరమైన అలవాట్లు, చురుకైన జీవనశైలిని ప్రోత్సహించడం ద్వారా దీర్ఘకాలిక ముప్పును తగ్గించవచ్చు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *