లోటెక్ పోస్టులకు బీటెక్ డిమాండ్ – ప్యూన్ పోస్టుల కోసం 25 లక్షల మంది పోటీ

  • రాజస్థాన్ లో 53 వేల పోస్టులకు ఆహ్వానం
  • 90 శాతం మంది ఉన్నత విద్యావంతులే అప్లై
  • పదో తరగతి పోస్టుకు… పీహెచ్ డీలు కూడా
  • యువత భవిష్యత్తుపై నిరుద్యోగపు దెబ్బ

సహనం వందే, రాజస్థాన్:
రాజస్థాన్‌లో 53 వేల ప్యూన్ పోస్టుల కోసం 25 లక్షల మంది అభ్యర్థులు పోటీ పడటం విస్మయం కలిగిస్తుంది. ఆ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉందో వెల్లడిస్తోంది. కేవలం పదో తరగతి అర్హతతో కూడిన ఈ పోస్టులకు 90 శాతం మంది డిగ్రీలు, బీటెక్, ఎంఎస్సీ, పీహెచ్ డీ వంటి ఉన్నత విద్యార్హతలు కలిగిన యువత పోటీ పడుతున్నారు. ఈ పరిస్థితి నిస్సందేహంగా యువత ఆకాంక్షలను అవమానపరిచేదిగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం కనీస అర్హత కూడా అవసరం లేని పోస్టులకు కూడా ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్హతలు కలిగిన యువత దరఖాస్తు చేసుకోవడం, వారి భవిష్యత్తు అంధకారంలో ఉందనే వాస్తవాన్ని చాటి చెబుతోంది. ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీలు కేవలం మాటలకే పరిమితం అయ్యాయని ఈ పోటీ నిరూపిస్తోంది.

ఓవర్‌ క్వాలిఫైడ్ యువత…
ఉన్నత విద్యను అభ్యసించిన యువతకు ప్యూన్ పోస్టులు దరఖాస్తు చేసుకోవడం ఒక అవమానం. ఉదాహరణకు గణితంలో ఎంఎస్సీ, బీఈడీ చేసిన నరేంద్ర బిజానియా వంటి వారు ఉపాధ్యాయులు కావాల్సిన ఉండగా ఇప్పుడు ప్యూన్ ఉద్యోగం కోసం పోటీ పడుతున్నారు. గతంలో పరీక్షా పేపర్లు లీక్ కావడంతో నిజమైన అభ్యర్థులు నష్టపోయారు. గ్రామీణ ప్రాంతాల్లో తమ పిల్లలు డిగ్రీలు చేశారని గర్వంగా చెప్పుకునే తల్లిదండ్రులు ఇప్పుడు వారి పిల్లలు ప్యూన్ పోస్టుల కోసం పోటీ పడుతున్నారని చెప్పుకోలేకపోతున్నారు. ఇది రాజస్థాన్ యువత ఆశలను దెబ్బతీస్తోంది.

పేపర్ లీకులతో ప్రభుత్వ వైఫల్యం…
రాజస్థాన్‌లో 30కి పైగా రిక్రూట్‌మెంట్ పరీక్షలు లీక్ కావడం ప్రభుత్వ అవినీతి, అసమర్థతకు నిదర్శనం. నిజమైన అభ్యర్థులకు అన్యాయం చేసి ప్రాక్సీలకు, నకిలీ సర్టిఫికేట్లకు అవకాశం కల్పించడం వల్ల యువత మరింత నిరాశకు గురవుతోంది. ఈసారి ప్యూన్ పరీక్షల్లో కూడా డూప్లికేట్ ఫోటోలతో వేల మంది పట్టుబడ్డారు. బూట్లు, ఆభరణాలు తొలగించి మోసాలను అడ్డుకునే ప్రయత్నాలు చేసినప్పటికీ పరీక్షా వ్యవస్థలోని లోపాలను ఈ సంఘటనలు తెలియజేస్తున్నాయి. ప్రభుత్వం ఈ పేపర్ లీకులను అరికట్టడంలో విఫలమవడం వల్ల యువతలో విశ్వాసం సన్నగిల్లుతోంది.

దేశంలో నిరుద్యోగ పరిస్థితికి నిదర్శనం…
ప్యూన్ పరీక్షకు ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నత విద్యార్హతలు కలిగిన వారు పోటీ పడటం దేశవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ సంక్షోభానికి ఒక ఉదాహరణ. డిగ్రీలు చదివినా ఉద్యోగాలు రావన్న వాస్తవాన్ని యువత గ్రహించారు. ప్రభుత్వాలు ఈ సమస్యకు తక్షణ పరిష్కారాలు చూపకపోతే ఈ నిరుద్యోగ సమస్య మరింత తీవ్రమవుతుంది. నిరుద్యోగ యువతలో పెరిగిన ఆగ్రహం రాజకీయాలకు కొత్త రంగులు అద్ది పాలకుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయవచ్చు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *