సహనం వందే, ఢిల్లీ:
కమ్యూనిస్టు నేత పుచ్చలపల్లి సుందరయ్య 1952 ప్రాంతంలో పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. అంతేకాదు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. అంతటి కీలక స్థానంలో ఉన్న సుందరయ్య నిరాడంబరంగా సామాన్యుడి సైకిల్ పై పార్లమెంటుకు వెళ్లేవారు. తన ఫైల్స్ ను సైకిల్ పై పెట్టుకొని వెళ్లడం అనేక మందిని ఆశ్చర్యపరిచింది. అచ్చం అలాగే ప్రస్తుత తెలుగుదేశం పార్టీకి చెందిన విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కూడా సైకిల్ పై పార్లమెంటుకు వెళుతుండడం అత్యంత ఆసక్తికరంగా మారింది.

పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైనప్పటినుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని సమావేశాలకు ఆయన సైకిల్ పైనే వెళ్లడం విశేషం. నాడు పుచ్చలపల్లి సుందరయ్య… నేడు అప్పలనాయుడు సైకిల్ పై వెళ్లడం సామాన్యుల పట్ల వాళ్ల సానుకూలత తెలియజేస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇటీవల సినీ నటుడు బాలకృష్ణ పార్లమెంటుకు వెళ్లినప్పుడు ఆ సైకిల్ ను చూసి ఎంతో అబ్బురపడ్డారు. అప్పలనాయుడు ఏ ఒక్క రోజు కూడా పార్లమెంటు సమావేశాలకు గైర్హాజర్ కాలేదు. సమావేశాల పట్ల ఆయన అత్యంత అంకితభావంతో ఉన్నారు. మరోవైపు అనేక అంశాలపై పార్లమెంటులో ప్రశ్నలు అడగడం విశేషం. తెలుగుదేశం పార్టీ ఎంపీలతో పోలిస్తే ఆయన హాజరు… ప్రశ్నలు అధికంగా ఉన్నట్లు చెప్తున్నారు.