- ముఖ గుర్తింపు యాప్తో గోల
- రూ. 7000కే ఇంటి నుంచి హాజరు!
సహనం వందే, హైదరాబాద్:
మెడికల్ కాలేజీల్లో అధ్యాపకుల హాజరు విషయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) చెబుతోంది. అయితే ఈ చర్యలను ఛేదించే విధంగా కొన్ని కంపెనీలు కొత్త యాప్లతో ముందుకొచ్చాయి. ఇంటి నుంచే ముఖ గుర్తింపు ద్వారా హాజరు వేసుకునే సౌలభ్యాన్ని కేవలం రూ.7000కే అందిస్తున్నాయి. ఈ విషయం ఇప్పుడు వైద్య విద్యా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
బొటనవేలు నుంచి ముఖ గుర్తింపు వరకు
వైద్య కళాశాలల్లో అధ్యాపకుల హాజరు కోసం గతంలో బొటనవేలు గుర్తుల విధానాన్ని ఎన్ఎంసీ అమలు చేసింది. కానీ ఈ విధానంలో లోపాలు బయటపడ్డాయి. కొందరు కాలేజీకి రాకుండానే హాజరు వేసుకున్న సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఈ లోటుపాట్లను అరికట్టేందుకు ఎన్ఎంసీ ముఖ గుర్తింపు విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానం ద్వారా తప్పనిసరిగా కళాశాలకు వచ్చి హాజరు వేయాలని భావించారు. అయితే ఈ కొత్త విధానాన్ని కూడా కొన్ని కంపెనీలు సవాలుగా తీసుకున్నాయి. కొత్త యాప్ తో వైద్య విద్యా వ్యవస్థలో సవాళ్లను తెచ్చిపెట్టింది. ఎన్ఎంసీ ఈ యాప్ను గుర్తించి దాన్ని నియంత్రించేందుకు ఏం చర్యలు తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.