- విద్యార్థులతో చిట్ చాట్ చేయాలని నిర్ణయం
- వారి మనసులో ఏముందో పసిగట్టే వ్యూహం
- నీట్ లీక్ రాజకీయ రగడతో మోడీ అలెర్ట్
సహనం వందే, న్యూఢిల్లీ:
దేశంలో పెరుగుతున్న విద్యార్థి అసంతృప్తిని చల్లార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక వినూత్న వ్యూహానికి తెరతీసింది. యూనివర్సిటీలే వేదికగా నేరుగా యువతను ప్రసన్నం చేసుకునేందుకు ఒక కేంద్ర మంత్రి ప్రతిరోజూ ఒక విశ్వవిద్యాలయాన్ని సందర్శించే భారీ రాజకీయ ప్రణాళికను సిద్ధం చేసింది.
క్యాంపస్ల బాటలో కేంద్ర మంత్రులు...
యువత ఆలోచనలను నేరుగా తెలుసుకునేందుకు మోదీ ప్రభుత్వం ఒక రోజు ఒక విశ్వవిద్యాలయం అనే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న యువతను ప్రసన్నం చేసుకునేందుకు ఈ ప్రణాళికను రూపొందించారు. దీని ద్వారా ప్రతిరోజూ ఒక కేంద్ర మంత్రి ఏదో ఒక యూనివర్సిటీకి వెళ్తారు. అక్కడ విద్యార్థులతో నేరుగా ముఖాముఖి చర్చలు జరుపుతారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై వారి అభిప్రాయాలను తెలుసుకుంటారు. అదే సమయంలో ప్రభుత్వ పథకాలను యువతకు వివరిస్తారు.
కేబినెట్ భేటీలో కీలక చర్చ
ఈ వ్యూహాత్మక ప్రణాళికపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇటీవల కేంద్ర కేబినెట్ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. దేశంలోని యువతను ప్రభుత్వానికి దగ్గర చేయడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. ఈ భారీ ప్రణాళికను అమలు చేసే బాధ్యతలను విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయలకు అప్పగించారు. వీరు ఇతర కేంద్ర మంత్రులతో సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నారు.
నీట్ రగడతో రగిలిన రాజకీయాలు
ఈ కార్యక్రమం వెనుక బలమైన రాజకీయ కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ అంశంపై విద్యార్థులు తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేపట్టారు. ఢిల్లీతో పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ నిరసనలు ఉధృతమయ్యాయి. ఈ ఆందోళనలు రాజకీయ వేడిని పెంచాయి. పార్లమెంటు సమావేశాలలోనూ ప్రతిపక్షాలు ఈ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశాయి. విద్యార్థుల ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో అప్పట్లో విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

1300 విశ్వవిద్యాలయాలు…
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అధికారిక లెక్కల ప్రకారం మన దేశంలో సుమారు 1300 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వీటిలో 57 కేంద్ర విశ్వవిద్యాలయాలు ఉండగా 522 రాష్ట్ర విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. మిగిలిన విద్యా సంస్థలు డీమ్డ్, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల పరిధిలోకి వస్తాయి. ఇంత భారీ సంఖ్యలో ఉన్న విద్యా సంస్థలన్నింటినీ కవర్ చేయడమే ఈ ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.
ప్రధాని మోదీ ప్రత్యేక ప్రకటనలు
విద్యార్థుల ఆగ్రహాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం సంక్షేమ ప్రకటనలపై దృష్టి పెట్టింది. ఇటీవలి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ విద్య, నైపుణ్యాలు, ఉపాధికి సంబంధించిన అనేక కీలక ప్రకటనలు చేశారు. ఉచిత ఆన్లైన్ కోచింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శిక్షణా కార్యక్రమాలను ప్రకటించారు. తయారీ రంగం, అంతరిక్షం, అణు శక్తి, సెమీకండక్టర్ల రంగాలలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు.
రాజకీయ వ్యూహానికి అసలు పరీక్ష…
దేశంలో నెలకొన్న రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఈ విశ్వవిద్యాలయాల పర్యటనలు ఎంతవరకు ఉపకరిస్తాయనేది ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియా ద్వారా ప్రధాని మోదీ చేసిన నేరుగా అప్పీళ్లు ఒకెత్తైతే, మంత్రులు స్వయంగా కాలేజీ క్యాంపస్లకు వెళ్లి విద్యార్థులను కలవడం మరోఎత్తు. విద్యార్థుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వారిని శాంతింపజేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సమగ్ర ప్రణాళిక ద్వారా యువతలో ఉన్న అసంతృప్తిని పూర్తిగా తొలగించి తమ వైపునకు తిప్పుకోవాలని అధికార పక్షం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.