- చరిత్ర తెలియక నవ్వుల పాలైన ట్రంప్
- 1947లో స్వాతంత్రం వస్తే.. వెయ్యేళ్ళు ఎలా?
- చరిత్ర పాఠాలు అవసరమంటూ కామెంట్స్
సహనం వందే వాషింగ్టన్:
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరోసారి వివాదాస్పదమయ్యాయి. భారత్, పాకిస్థాన్ మధ్య కాశ్మీర్ సమస్యపై ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిని ఆయన ఖండించారు. భారత్, పాకిస్థాన్లు కాశ్మీర్ కోసం “వెయ్యి సంవత్సరాలుగా” పోరాడుతున్నాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు చరిత్రాత్మకంగా తప్పుగా ఉన్నాయని, పాకిస్థాన్ 1947లోనే ఏర్పడిందని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.
భారత్-పాక్ గురించి తెలుసంటూ…
ట్రంప్ ఎయిర్ ఫోర్స్ వన్లో పాత్రికేయులతో మాట్లాడుతూ, “నేను భారత్కు, పాకిస్థాన్కు సంబంధించి అనేక విషయాలు నాకు తెలుసు. వారు కాశ్మీర్లో వెయ్యి సంవత్సరాలుగా పోరాడుతున్నారు. కాశ్మీర్ సమస్య వెయ్యి సంవత్సరాల కంటే ఎక్కువ కాలం నుండి కొనసాగుతోంది” అని అన్నారు. దీంతో ట్రంప్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాస్యాస్పదంగా మారాయి. ఒక ఎక్స్ యూజర్ ఇలా రాశారు, “పాకిస్థాన్ 1947కు ముందు ఉనికిలో లేదు, కాబట్టి వెయ్యి సంవత్సరాలుగా భారత్తో పోరాడటం సాధ్యం కాదు. ట్రంప్కు చరిత్ర పాఠాలు అవసరం.” పాకిస్థాన్ 78 సంవత్సరాల క్రితం ఏర్పడిన విషయాన్ని ఎత్తి చూపిస్తూ, కాశ్మీర్ వివాదం 1947లో బ్రిటిష్ భారతదేశ విభజన తర్వాతే ప్రారంభమైందని నెటిజన్లు వాదించారు. మరో యూజర్ ఇలా అన్నారు, “1500 సంవత్సరాల క్రితం గుప్తా సామ్రాజ్యం కాశ్మీర్ను పాలించింది. అప్పుడు ఇస్లాం కూడా లేదు, పాకిస్థాన్ గురించి మాట్లాడటం అసంబద్ధం.” ఈ వ్యాఖ్యలపై కొందరు ట్రంప్ను హాస్యాస్పదంగా వ్యాఖ్యానిస్తూ, “క్లాసిక్ ట్రంప్, ఎప్పుడూ వినోదాత్మకంగా ఉంటాడు” అని అన్నారు. మరికొందరు, “ఇది గ్లోబల్ రాజకీయాలకు సిగ్గుచేటు” అని విమర్శించారు. ఈ వివాదం ట్రంప్ చరిత్ర జ్ఞానంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చలకు దారితీసింది.