- పరీక్షల అక్రమాలపై రగిలిపోతున్న జార్ఖండ్
- నిరుద్యోగ వ్యతిరేక పోరులో కాక్రోచ్ పార్టీ
- ఢిల్లీ దీక్ష ముగింపు తర్వాత కొత్త కార్యాచరణ
- దేశంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు
సహనం వందే, మహారాష్ట్ర:
దేశవ్యాప్తంగా పరీక్షల పేపర్ లీకేజీలపై విద్యార్థులు ఆగ్రహంతో రగులుతున్న వేళ సరికొత్త రాజకీయ సమీకరణాలు తెరపైకి వచ్చాయి. విద్యా వ్యవస్థ వైఫల్యాలను ఎలుగెత్తి చాటుతూ యువతను ఏకం చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు జార్ఖండ్ గడ్డపై అడుగుపెట్టడానికి సిద్ధమైంది. వ్యవస్థలను ప్రశ్నించే శక్తిగా మారుతున్న ఈ యువ ఉద్యమం సరికొత్త రాజకీయ వాతావరణాన్ని సృష్టిస్తోంది.
పరీక్షల అక్రమాలపై గళం…
జార్ఖండ్లో ప్రభుత్వ నియామక పరీక్షల అక్రమాలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇతర రిక్రూట్మెంట్ పరీక్షలలో జరిగిన అవకతవకలపై రాంచీలోని జైపాల్ సింగ్ ముండా స్టేడియంలో జూలై 29 నుంచి నిరుద్యోగ అభ్యర్థులు నిరవధిక దీక్షను ప్రారంభించారు. ఈ ఆందోళనకు మద్దతుగా కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే జార్ఖండ్కు వెళ్లనున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర వెలుపల ఉన్న హైకోర్టు రిటైర్డ్ జడ్జీలతో కూడిన స్వతంత్ర కమిటీ చేత ఈ అక్రమాలపై విచారణ జరిపించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.

యువ ఉద్యమం ఒక ప్రెషర్ గ్రూప్
మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్లో జరిగిన కోర్ కమిటీ సమావేశానికి ముందు బుధవారం అభిజీత్ దీప్కే మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం రాజకీయ పార్టీల పరిస్థితి చాలా క్షీణించిందని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఉదయం ఒక వైపు ఓటేస్తే సాయంత్రానికి ఎవరో ఒకరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. ప్రజలకు న్యాయవ్యవస్థ, రాజకీయాలు, మీడియా, ఎన్నికల సంఘంపై నమ్మకం సడలిపోయిందని స్పష్టం చేశారు. ఈ దేశానికి ఇప్పుడు రాజకీయ పార్టీల కంటే ఒక శక్తివంతమైన ప్రజా ఒత్తిడి బృందం చాలా అవసరమని అభిప్రాయపడ్డారు.
ఉద్యమంపై పోలీసుల ఉక్కుపాదం
దేశ రాజధానితో పాటు ముంబై, కోల్కతా మరియు బిహార్లో జరిగిన నిరసన ప్రదర్శనలు హింసాత్మకంగా మారాయి. ఈ ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై పోలీసులు కేసులు నమోదు చేసి నిర్బంధించారు. కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ స్పోక్స్పర్సన్ సౌరవ్ దాస్ మాట్లాడుతూ, విద్యార్థులపై పెట్టిన పోలీసు కేసులను బేషరతుగా ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ప్రతినిధులతో ఈ అంశంపై చర్చలు జరుపుతున్నామని, దేశవ్యాప్తంగా గాయపడిన ఆందోళనకారులకు చట్టపరమైన మరియు వైద్యపరమైన సహాయాన్ని అందిస్తున్నామని వెల్లడించారు.
సంస్థాగత విస్తరణకు రోడ్మ్యాప్
జంతర్ మంతర్ ఆందోళనకు ఊహించని విధంగా దేశవ్యాప్తంగా స్పందన రావడంతో పార్టీపై బాధ్యతలు మరింత పెరిగాయని నేతలు తెలిపారు. ఛత్రపతి సంభాజీనగర్లో ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ కోర్ కమిటీ సమావేశం రెండు రోజుల పాటు కొనసాగనుంది. ఈ సమావేశంలో సోనం వాంగ్చుక్ను తమ మార్గదర్శకుడిగా కొనసాగించాలని, ఆయన సలహాలు తీసుకోవాలని నిర్ణయించారు. సంస్థను మరింత విస్తరించడానికి భవిష్యత్తు రోడ్మ్యాప్ను రూపొందిస్తున్నట్లు దీప్కే వెల్లడించారు.
ప్రజా సమస్యలపై పోరాటం…
కేవలం విద్యా రంగానికి మాత్రమే పరిమితం కాకుండా ప్రజా సమస్యలపై తమ పోరాటాన్ని విస్తరించాలని కాక్రోచ్ జనతా పార్టీ భావిస్తోంది. ప్రస్తుత కోర్ కమిటీ సమావేశంలో మీడియా, న్యాయవ్యవస్థపై ప్రజలకు తగ్గుతున్న విశ్వాసం గురించి ప్రధానంగా చర్చిస్తున్నారు. అలాగే ఇథనాల్తో కలిపిన ఇంధనం, పెరుగుతున్న నిరుద్యోగం వంటి కీలక అంశాలను కూడా ఎజెండాలో చేర్చారు. ఈ సమావేశంలో అభిజీత్ దీప్కేతో పాటు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా, రత్న సింగ్ తదితరులు పాల్గొన్నారు.