హిందువులంతా మైనారిటీలే – మెజారిటీ అనేది కేవలం భ్రమ

Moulana Sajjad Nomani Comments
  • మౌలానా సజ్జాద్ నోమానీ సంచలనం
  • రాజకీయాల్లో పెను ప్రకంపనలు
  • కులాలతో కూడిన సమూహాలేనని వ్యాఖ్య
  • రాజకీయ వ్యూహమా? సామాజిక వాస్తవమా?

సహనం వందే, హైదరాబాద్:

దేశంలో మెజారిటీ ఎవరంటే టక్కున వచ్చే సమాధానం హిందువులు. కానీ ఈ నమ్మకాన్ని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ సభ్యుడు మౌలానా సజ్జాద్ నోమానీ తన మాటలతో బద్దలు కొట్టారు. హిందువులు మెజారిటీ కాదు, వారు కూడా మైనారిటీలే అని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ఆయన చేసిన ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న లోతైన కోణాలను ఇప్పుడు చూద్దాం.

రాజకీయ వ్యూహమా? సామాజిక వాస్తవమా?
హిందూ మతం ఒక్కటి కాదని… అది వేలకొద్దీ కులాలు, తెగలు, విభిన్న విశ్వాసాల సమాహారమని మౌలానా సజ్జాద్ నోమానీ వాదిస్తున్నారు. అడవిలోని గిరిజన ఆచారం, పట్టణాల్లోని దళిత విశ్వాసం, వేరే ప్రాంతపు కుల సంప్రదాయాలకు అసలు సంబంధమే ఉండకపోవచ్చు. ఈ చిన్న చిన్న సమూహాలన్నింటినీ కలిపి ఒకే మెజారిటీగా చూపడం కేవలం రాజకీయ వ్యూహం తప్ప సామాజిక వాస్తవం కాదని ఆయన విశ్లేషిస్తున్నారు. తమిళులు, ఎస్సీలు, ఆదివాసీలు, సిక్కులు, బౌద్ధులు, లింగాయతులతో సహా పలు వర్గాలను హిందువులుగా పరిగణించకూడదని ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని పెంచాయి.

30 ఏళ్ల క్షేత్రస్థాయి పరిశీలన
నోమానీకి ఈ నమ్మకం ఎలా కలిగిందంటే ఆయన గత 30 ఏళ్లుగా దేశవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించారట. కేవలం కాగితాల మీద ఉన్న గణాంకాలు కాకుండా ప్రజల ఆచారాలు, వారి తెగ గుర్తింపులను దగ్గరుండి గమనించారు. ఏ ఒక్క కులమైనా సరే జనాభాలో మెజారిటీ మార్కును అందుకోలేదని ఆయన తేల్చి చెప్పారు. హిందువులందరూ మైనారిటీ సమూహాల కలయికేనని తన అధ్యయనం ద్వారా ఆయన చెబుతున్నారు.

పవిత్రమైన కాబాపై ప్రమాణం
ఈ ప్రకటన తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఆయన ఏకంగా కాబా కవర్ మీద చేయి వేసి ప్రమాణం చేశారు. తన 30 ఏళ్ల అధ్యయనం ద్వారా తాను తెలుసుకున్న నిజమని చెప్పడానికి ఆయన మతపరమైన ప్రమాణాన్ని వాడారు. ఒక వ్యక్తి అంతటి పవిత్రమైన స్థలం మీద ప్రమాణం చేసి ఇలా అనడంతో ఈ చర్చ అత్యంత సీరియస్ స్థాయికి చేరింది.

భిన్నత్వంలో ఏకత్వం ప్రశ్నార్థకమా
అయితే విశ్లేషకులు ఒక ప్రశ్న వేస్తున్నారు. భిన్నత్వం ఉన్నంత మాత్రాన వారందరూ హిందువులు కాకుండా పోతారా అని ప్రశ్నిస్తున్నారు. వేల కులాలున్నా అవన్నీ ఒకే సంస్కృతి, ఒకే మూల సిద్ధాంతంతో అనుసంధానమై ఉన్నాయని మెజారిటీ పండితులు వాదిస్తున్నారు. కులాల విభజనను చూపిస్తూ హిందూ మెజారిటీ అనే కవచాన్ని తొలగించడంలో ఉన్న రాజకీయ ఆంతర్యం ఏమిటనేది ఇప్పుడు అసలు పాయింట్.

ఓటు బ్యాంకు రాజకీయాల పాచిక
రాజకీయ కోణంలో ఇది కొత్త పాచిక అని విశ్లేషకులు భావిస్తున్నారు. హిందువులను చిన్న చిన్న ముక్కలుగా వర్గీకరించడం ద్వారా ఓటు బ్యాంకును కులాల వారీగా చీల్చే ప్రయత్నం జరుగుతోందా అనే అనుమానాలు వస్తున్నాయి. దీని వల్ల రాజకీయ పార్టీలు తమ పబ్బం గడుపుకోవడానికి సామాజిక ఐక్యతను దెబ్బతీసే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

సామాజిక సామరస్యానికి సవాల్
ఈ వాదనల వల్ల సమాజంలో సామరస్యం తగ్గి అనవసరమైన విభేదాలు పెరిగే ప్రమాదం ఉంది. ప్రజలు తమ అస్తిత్వాన్ని కులంతోనే చూసుకునేలా చేసి దేశ ఐక్యతకు చిచ్చు పెట్టే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కులాల ప్రభావం ఎక్కువగా ఉన్న రాజకీయాల్లో ఈ వాదన తోడైతే ఎన్నికల లెక్కలు పూర్తిగా మారవచ్చు. ఇలాంటి విభజనలు సమాజంలో అనిశ్చితిని పెంచి అభివృద్ధిని మందగింపజేయవచ్చు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *