ఉగ్రదాడికి స్థానికుల సహకారం

Share

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన భీకర ఉగ్రదాడి వెనుక 15 మంది స్థానికులు టెర్రరిస్టులకు సహకరించినట్లు విచారణలో వెల్లడైంది. టెర్రరిస్టులకు పథకం రూపొందించడంలోనూ, అమలు చేయడంలోనూ స్థానిక ఓవర్‌గ్రౌండ్ వర్కర్స్ కీలక పాత్ర పోషించినట్లు అధికారులు గుర్తించారు. ఈ దాడిలో పాకిస్థాన్ ఉగ్రవాదులు ఏకే-47, ఎం4 రైఫిళ్లతో దాడి చేసి అనేక మంది పౌరులను, భద్రతా సిబ్బందిని హతమార్చారు. ఈ దాడి స్థానిక సహకారం లేకుండా సాధ్యం కాదని విచారణలో వెల్లడైంది. ఎలక్ట్రానిక్ సర్వైలెన్స్ ఆధారంగా దక్షిణ కాశ్మీర్‌కు చెందిన 15 మంది స్థానికులు ఈ దాడికి సంబంధించిన ప్రధాన సూత్రధారులని తేలింది. వీరిలో ఐదుగురు ప్రధాన నిందితులుగా ఉన్నారు, మరో పదిమందిని ప్రశ్నిస్తున్నారు.

ఆయుధాలు… ఆశ్రయంలో సహకారం
విచారణలో బయటపడిన వివరాల ప్రకారం… ఈ 15 మంది స్థానికులు ఉగ్రవాదులకు ఆయుధాలు, ఆశ్రయం ఇతరత్రా సాయం అందించారు. దాడికి ముందు ఒక వారం పాటు పాకిస్థాన్ ఉగ్రవాదులకు సహకరించినట్లు తెలిసింది. దాడి సమయంలో వీరి ఫోన్‌లు ఆ స్థలంలో యాక్టివ్‌గా ఉన్నట్లు గుర్తించారు. ఒక చోట పాకిస్తాన్ ఉగ్రవాదులకు సాయం చేసినట్లు స్పష్టమైన సమాచారం లభించింది.

మేం చేయలేదు…
ఈ దాడి బాధ్యతను మొదట ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) స్వీకరించినప్పటికీ, తర్వాత వారు ఈ ప్రకటనను భారత్ రూపొందించిన సైబర్ దాడిగా పేర్కొంటూ వెనక్కి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో భారత భద్రతా బలగాలు 175 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని, ఉగ్రవాద నిరోధక చర్యలను తీవ్రతరం చేశాయి. కాగా, ఈ ఘటన తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో ఉద్రిక్తతలు పెరిగాయి. స్థానిక ప్రజలు, పర్యాటకులు భయాందోళనకు గురవుతున్నారు. పహల్గామ్ నుంచి పర్యాటకులను సురక్షితంగా తరలించేందుకు అదనపు విమాన సర్వీసులను ఏర్పాటు చేయాలని విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ అయ్యాయి.


Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *