పేదల ఇళ్లు కూల్చొద్దు!

  • నా కళ్ల ముందే రాష్ట్రం అధోగతి
  • రాష్ట్ర ప్రభుత్వంపై కేసీఆర్ ఫైర్
  • కగార్ ఆపరేషన్ ఆపాలని కేంద్రానికి డిమాండ్

‘హైడ్రా పేరు చెప్పి పేదల ఇళ్లు కూలగొడుతున్నారు. తెలంగాణను నెంబర్‌వన్‌ స్థానంలో నిలబెడితే, ఇప్పుడు 14వ స్థానానికి తీసుకెళ్లిపోయారు. నా కళ్ల ముందు తెలంగాణ పరిస్థితి ఇలా అవుతుంటే బాధ కలుగుతోంది. మరో రెండున్నరేళ్లలో ఇక ఏమీ చేయగలుగుతార’ని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం వరంగల్ జిల్లా ఎల్కతుర్తి సభలో తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత దుస్థితిపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం, వెనుకబాటు తీరుపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, ‘నా కళ్ల ముందే తెలంగాణ ఇలా కావడం నాకు దుఃఖం కలిగిస్తోంద’న్నారు. పేదల ఇళ్లు కూల్చొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

కగార్ ఆపరేషన్ పై మండిపాటు..‌
ఛత్తీస్‌గఢ్‌లో జరుగుతున్న ‘కగార్’ ఆపరేషన్‌పై కేసీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. ‘కగార్ అనే ఆపరేషన్‌తో ఛత్తీస్‌గఢ్‌లో యువకులను ఊచకోత కోస్తున్నారు. ఈ ఆపరేషన్‌ను వెంటనే ఆపేయాలి. మావోయిస్టులతో ప్రభుత్వం చర్చలు జరపాల’ని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

కేసీఆర్ కిట్స్ నిలిపివేతపై ఆగ్రహం…
‘కేసీఆర్ కిట్స్‌ను ఎందుకు బంద్ చేశారు? ఎవరైనా వాటిని ఆపుతారా? వైఎస్సార్ ఆరోగ్యశ్రీని తీసుకొచ్చారు. అది మంచి పథకమని నేను కొనసాగించాను. ఆరోగ్యశ్రీ పథకం పేరు కూడా మార్చకుండా మేం కొనసాగించాం. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని చూస్తున్నారు. ఇది సాధ్యమా?’ అని కేసీఆర్ ప్రశ్నించారు.

తెలంగాణను ఆగమాగం చేశారు…

‘తెలంగాణలో ఆర్థిక పరిస్థితిని పూర్తిగా దెబ్బతీశారు. పరిపాలన చేయడం రాక రాష్ట్రాన్ని ఆగమాగం చేశారు. బీఆర్ఎస్ హయాంలో భూముల ధరలు ఎలా ఉండేవి? ఇప్పుడు భూముల ధరలు ఎక్కడికి పోయాయి? ఎందుకు కొనుక్కోవడం లేదు? ఒక్క ఏడాదిలో ఇంతలా మారిపోయిందా?” అని ప్రశ్నించారు. ‘పవర్ కట్స్, మోటర్లు కాలిపోతున్నాయి. లంచాలు పెరుగుతున్నాయి. ఐదేళ్లలో ప్రతి ఇంటికి నల్లా రాకపోతే తర్వాతి ఎన్నికల్లో పోటీ చేయమని చెప్పి చేసి చూపించాం. మంచినీళ్లు, కరెంట్ పోతున్నాయి. వడ్లు కొనే దిక్కు లేదు. 2014 కంటే ముందు పరిస్థితులు వస్తున్నాయి. ఇది కాంగ్రెస్ అసమర్థత కాదా?’ అని కేసీఆర్ నిలదీశారు.

కాంగ్రెస్ హామీలపై ఎద్దేవా…
‘లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో ఉన్న దేవుళ్లందరిపైనా ఒట్లు వేశారు. మహిళలే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం వద్దని అంటున్నారు. మాట్లాడితే కేసీఆర్ పై నిందలు వేస్తున్నారు. ఆశపడి కాంగ్రెస్ ను నమ్మి ప్రజలు మోసపోయారు. మమ్మల్ని ఎవరూ నమ్మడం లేదు. అప్పు పుట్టడం లేదని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్లు అంటున్నార’ని కేసీఆర్ ఎద్దేవా చేశారు. ‘ఏడాదిన్నరగా కాంగ్రెస్ ఎన్ని హామీలు ఇచ్చింది? ఏమి చేసింది? గోల్ మాల్ చేయడంలో కాంగ్రెస్ ను మించినవాళ్లు లేరు. ఇక్కడ ఉన్నవాళ్లు చాలరని ఢిల్లీ నుంచి గాంధీలు వచ్చి డ్యాన్స్ లు చేసి హామీలు ఇచ్చారు. పెన్షన్లు పెంచుతామన్నారు. స్కూటీలు కొనిస్తామన్నారు. జాబ్ కార్డులు ఇస్తామన్నారు. ఇచ్చారా? కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చింది. అవన్నీ చేసిందా? 420 హామీలు ఇచ్చారు. కళ్యాణ లక్ష్మీకి కేసీఆర్ లక్ష రూపాయలే ఇస్తున్నారు. మేము వస్తే తులం బంగారం కూడా ఇస్తామన్నారు. ఏమైంది?’ అని కేసీఆర్ ప్రశ్నించారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *