- 1997-2012 మధ్య జన్మించిన వారిలో రాజకీయ ఆసక్తి అధికం
- వీరందరికీ సోషల్ మీడియా ద్వారానే రాజకీయ పరిజ్ఞానం…
- టిక్ టాక్ ద్వారా 50 శాతం మందిలో రాజకీయ అవగాహన
- టిక్టాక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి వేదికలే రాజకీయ పాఠాలు
- ఆన్లైన్ ద్వారా పోరాటాలకు మద్దతు తెలుపుతున్న జనరేషన్ జెడ్
- ఒక అంతర్జాతీయ అధ్యయన నివేదిక వెల్లడి
సహనం వందే, హైదరాబాద్:
డిజిటల్ ప్రపంచంలో సోషల్ మీడియా ఒక బలమైన శక్తిగా ఎదిగింది. మరీ ముఖ్యంగా 1997-2012 మధ్య జన్మించిన ‘జనరేషన్ జెడ్’ జీవితాల్లో ఇది ఒక అంతర్భాగమైపోయింది. ఈ తరం రాజకీయంగా అత్యంత అవగాహన కలిగినదిగా పేరు తెచ్చుకుంది. ఆన్లైన్ రాజకీయ చర్చల్లో వీరు మునిగిపోతున్నారని తాజా అధ్యయనాలు పేర్కొంటున్నాయి. టిక్టాక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి వేదికలు జనరేషన్ జెడ్ యువతకు రాజకీయాలపై జ్ఞానాన్ని అందిస్తున్నాయని అధ్యయన నివేదిక తెలుపుతుంది.
ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లోనే…

జనరేషన్ జెడ్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు, సామాజిక సమస్యలను సోషల్ మీడియా ద్వారా క్షణాల్లో తెలుసుకుంటోంది. ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’, ‘ఎండ్సార్స్’, ‘కంచ గచ్చిబౌలి’ వంటి ఉద్యమాల సమాచారాన్ని వేగంగా వ్యాప్తి చేయడంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషించింది. ఒక సర్వే ప్రకారం, 18-29 ఏళ్ల టిక్టాక్ వినియోగదారుల్లో దాదాపు సగం మంది రాజకీయ సమాచారం కోసం ఈ వేదికను ఉపయోగిస్తున్నారు. ఈ వేదికలు కేవలం సమాచారం ఇవ్వడమే కాకుండా, ఆన్లైన్ ఉద్యమాల ద్వారా తమ
అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి, పోరాటాలకు మద్దతు తెలపడానికి యువతను ప్రోత్సహిస్తున్నాయి. సీనియర్ ఐఐటీ పాట్నా విద్యార్థిని వందన మాటల్లో చెప్పాలంటే, ‘సోషల్ మీడియా అనేది వివిధ అంశాలపై చర్చించడానికి, ఆలోచనలు పంచుకోవడానికి అద్భుతమైన వేదిక. ఇది నాకు అనేక సమస్యలపై అవగాహన కల్పించింది. రాజకీయాల్లో మరింత చురుకుగా పాల్గొనేలా చేసింద’ని తెలిపారు. ఈ తరం దేశంలోని అసమానతలు, అన్యాయాల గురించి తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తోంది.
రాజకీయ వ్యవస్థపై అవిశ్వాసం…
అయితే రాజకీయ విషయాలపై నిరంతరం ఆన్లైన్లో ఉండటం యువతలో ఒత్తిడిని పెంచుతోంది. ఇది వారి మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కాగా, యువతలో ఈ ఒత్తిడికి అనేక కారణాలు ఉన్నాయి. వారి జీవితాల్లోని అనిశ్చితి… ఉద్యోగం, విద్య వంటి విషయాల్లో స్థిరత్వం లేకపోవడం రాజకీయ ఒత్తిడిని మరింత పెంచుతోంది. అంతేకాకుండా, గత తరాలతో పోలిస్తే జనరేషన్ జెడ్ రాజకీయంగా అస్థిరమైన కాలంలో పెరిగింది. ఇది వారిలో నిరాశను కలిగిస్తోంది. కొందరు రాజకీయ వ్యవస్థలపై నమ్మకం కోల్పోతున్నారు. తమ చర్యల వల్ల ఎలాంటి మార్పు రాదని భావిస్తున్నారు