పార్లమెంట్ భవనాన్ని మూసేయాలా?

సుప్రీంకోర్టుపైన, ప్రధాన న్యాయమూర్తి పైన బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు చట్టాలు చేస్తే, ఇక పార్లమెంటు ఎందుకని ఆయన మండిపడ్డారు‌. భారతదేశంలో జరుగుతున్న అంతర్యుద్ధాలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సంజీవ్ ఖన్నా బాధ్యత వహించాలని దుబే సంచలన ఆరోపణలు చేశారు. సుప్రీంకోర్టు తన పరిధిని దాటి మతపరమైన యుద్ధాలను రెచ్చగొడుతోందని తీవ్రంగా విమర్శించారు. ఈ వ్యాఖ్యలు దేశ రాజకీయ, న్యాయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ‘సుప్రీంకోర్టు చట్టాలు చేస్తే, పార్లమెంట్ భవనాన్ని మూసివేయాలా’ అని ఆయన ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. అలాగే ఆయన ఈ మేరకు శనివారం ఢిల్లీలో మాట్లాడారు.

మొన్న ఉపరాష్ట్రపతి… నేడు ఎంపీ
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ సుప్రీంకోర్టు తీర్పులను విమర్శించిన కొద్ది రోజుల తర్వాత నిశికాంత్ దుబే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ధన్‌ఖడ్ కూడా రాష్ట్రపతి విధులపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంపై ప్రశ్నలు లేవనెత్తారు. ‘అన్నీ సుప్రీంకోర్టులోనే నిర్ణయిస్తే పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీలను ఎందుకు నడపాలి?’ అని నిశికాంత్ దుబే ప్రశ్నించారు. రాష్ట్రపతి, గవర్నర్‌లకు సంబంధించి సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పులను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రాష్ట్రపతి బిల్లులపై నిర్ణయం తీసుకోవడానికి సమయ పరిమితి విధించాలని సుప్రీంకోర్టు సూచించడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్టికల్ 377, వక్ఫ్ చట్టం వంటి కొన్ని విషయాల్లో సుప్రీంకోర్టు తన అధికారాన్ని అతిక్రమించిందని దుబే ఆరోపించారు.

దుబే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం లేపాయి. ముఖ్యంగా ఎక్స్ వేదికగా తీవ్రమైన స్పందనలు వచ్చాయి. కొందరు ఆయన వాదనను సమర్థిస్తూ, ‘పార్లమెంట్ సర్వోన్నతమైనది. న్యాయస్థానాలు తమ పరిధిని మించకూడద’ని పేర్కొన్నారు. మరికొందరు ఈ వ్యాఖ్యలను వివాదాస్పదంగా భావిస్తూ, ‘సీజేఐని అంతర్యుద్ధాలకు బాధ్యత వహించమనడం అతిశయోక్తి’అని విమర్శించారు. ఈ వివాదం న్యాయవ్యవస్థ, శాసన వ్యవస్థ మధ్య అగాధాన్ని మరింత పెంచింది

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *