- అత్యంత తక్కువకు అమెరికాలో కొనొచ్చు
- అన్ని ఖర్చులు పోనూ 30 వేలు మిగులు
- దుబాయిలో కొన్నప్పటికీ తక్కువకే ఐఫోన్
- ఇండియాలో యాపిల్ మడత ఫోన్ మంటలు
సహనం వందే, హైదరాబాద్:
యాపిల్ కంపెనీ తన మొదటి ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ ఐఫోన్ డ్యూయోను మార్కెట్లోకి గ్రాండ్గా లాంచ్ చేసింది. ఫీచర్లు బాగానే ఉన్నా ఇండియాలో దీని ధర వింటే సామాన్యుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ ఫోన్ బేసిక్ మోడల్ ధర మన దేశంలో 3 లక్షల రూపాయలు ఉంది. ఇక టాప్ ఎండ్ మోడల్ అయితే ఏకంగా నాలుగున్నర లక్షల రూపాయల వరకు ఉంది. ఈ రేట్లు చూసి జనాలు షాక్ అవుతున్నారు. అందుకోసం అమెరికాకు వెళ్ళి కొనుక్కోవడమే బెటర్ అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
విచిత్రమైన ఐడియా
ఒక ఫోన్ కొనడానికి ఏకంగా అమెరికా దాకా విమానంలో వెళ్లి రావడం ఏంటని అనుకుంటున్నారా? అవును యాపిల్ కొత్తగా మార్కెట్లోకి తెచ్చిన ఫోన్ ధర వింటే ఎవరికైనా దిమ్మదిరిగిపోవాల్సిందే. మన దేశంలో ఆ ఫోన్ రేటు చూసి ఒకతనికి ఒక విచిత్రమైన ఐడియా వచ్చింది. ఇండియాలో ఫోన్ కొనేకంటే అమెరికాకు వెళ్లి, అటూ ఇటూ తిరిగేసి ఫోన్ కొనుక్కుని వచ్చినా కూడా డబ్బులు మిగులుతాయట. అసలు ఇందులో ఎంతవరకు ఎంత నిజం ఉందనేది ప్రశ్న.

అమెరికాలో 1.90 లక్షలే…
ఈ భారీ ధరలను చూసిన ఇషాన్ శర్మ అనే ఈ వ్యక్తి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. ఇండియాలో మూడు లక్షలు పెట్టి కొనేకంటే అమెరికా వెళ్లి రావడం నయమని లెక్కలు తీసి చూపించాడు. ముంబై నుంచి న్యూయార్క్కు రిటర్న్ ఫ్లైట్ టికెట్ ధర దాదాపు 80 వేల రూపాయలు పడుతుంది. అమెరికాలో ఈ ఫోన్ ధర భారత కరెన్సీలో దాదాపు 1.90 లక్షల రూపాయలు మాత్రమే. అంటే ఫ్లైట్ ఛార్జీలు, ఫోన్ ధర కలిపినా కూడా 2.70 లక్షల రూపాయల లోపే అవుతుంది.
30 వేల రూపాయలు మిగులుతాయట…
అమెరికాలో ఒరెగాన్, డెలావేర్ లాంటి రాష్ట్రాల్లో ఎలాంటి సేల్స్ టాక్స్ ఉండదు. కాబట్టి అక్కడ కొంటే పన్నుల భారం అసలే ఉండదు. ఈ లెక్కన ఇండియాలో మూడు లక్షలు పెట్టి కొనేకంటే, అమెరికా వెళ్లి ఐఫోన్ కొనుక్కుని వచ్చినా ఇంకా మీకు 30 వేల రూపాయలు మిగులుతాయని ఆయన పోస్ట్ చేశాడు. మరి మీరు కూడా ఈ పనిచేస్తారా అని నెటిజన్లను ప్రశ్నించాడు. దీంతో ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అయిపోయింది. యాపిల్ లవర్స్ అందరూ దీనిపై భిన్నంగా స్పందించడం మొదలుపెట్టారు.
దుబాయ్ వెళ్లొచ్చని మరికొందరు…
ఇక మరికొందరు నెటిజన్లు ఇంకా తెలివైన ప్లాన్లు చెప్పారు. అమెరికా దాకా పోవడం దేనికి, పక్కనే ఉన్న దుబాయ్ వెళ్లొచ్చు కదా అని సలహా ఇచ్చారు. దుబాయ్లో ఐఫోన్ డ్యూయో ప్రారంభ ధర దాదాపు రెండు లక్షల రూపాయలు మాత్రమే. విమాన ప్రయాణ సమయం కూడా తక్కువ, పైగా ఫ్లైట్ టికెట్ ఖర్చులు కూడా చాలా కలిసి వస్తాయి. కాబట్టి అమెరికా కంటే దుబాయ్ వెళ్లడమే బెస్ట్ ఆప్షన్ అని తేల్చేశారు.
భారీ ధరలపై నిరసన…
కంపెనీలు తమ ప్రాడక్ట్స్ ధరలను వేర్వేరు దేశాల్లో అక్కడి పన్నులు, దిగుమతి సుంకాలు, మార్కెట్ పరిస్థితులను బట్టి మారుస్తుంటాయి. అందుకే అమెరికా, దుబాయ్లతో పోలిస్తే మన దేశంలో దిగుమతి పన్నులు ఎక్కువ కావడం వల్ల ఐఫోన్ల ధరలు ఎప్పుడూ కాస్త ఎక్కువగానే ఉంటాయి. ప్రయాణ ఖర్చులు, పన్నులు అన్ని లెక్కలేసుకుంటే నిజంగా విదేశాలకు వెళ్లి ఫోన్ కొనుక్కోవడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. అయితే ఐఫోన్ ధరలు అంత దారుణంగా పెరిగాయని చెప్పడమే ఆయన ఉద్దేశంగా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సెటైరికల్ కామెంట్ తో ఆయన నిరసన వ్యక్తం చేస్తున్నాడని అర్థమవుతుంది.