- జిన్నాకు గాంధీ తలొగ్గాడా?
- చరణాల వెనుక తూటాలు
- పాత చరిత్ర కొత్త చిచ్చు
- చట్టంతో మారిన సమీకరణాలు
- వందేమాతరానికి పాత గాయాలు
సహనం వందే, హైదరాబాద్:
వందేమాతరం అనగానే మనలో చాలామందికి దేశభక్తి ఉప్పొంగుతుంది. కానీ అదే వందేమాతరం విషయంలో 89 ఏళ్ల క్రితం తీసుకున్న ఒక చిన్న నిర్ణయం… నేడు దేశంలో పెద్ద యుద్ధానికే దారి తీస్తుందని ఎవరైనా ఊహించారా? ఒక పాటలో అన్ని చరణాలు పాడాలా లేక రెండు చరణాలు మాత్రమే పాడాలా? అని తగువులాడుకోవడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి?
చరిత్ర పుటల్లో సంఘర్షణ…
1875లో బంకించంద్ర చటోపాధ్యాయ రచించిన వందేమాతరం గీతం తొలినాళ్లలో దేశ స్వాతంత్ర్య ఉద్యమానికి ఊపిరిపోసింది. 1905 నాటి వందేమాతరం ఉద్యమం సమయంలో ఇది దేశమంతటా మార్మోగింది. అయితే పాటలోని మూడో చరణం నుండి మాతృభూమిని హిందూ దేవతలతో పోల్చడంపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మతపరమైన విశ్వాసాల దృష్ట్యా ఇస్లామిక్ సూత్రాలకు ఇది భిన్నంగా ఉందని అప్పటి ముస్లిం నాయకులు భావించారు.

1937 నాటి చారిత్రక రాజీ…
1937 అక్టోబరులో ముహమ్మద్ అలీ జిన్నా ఈ గీతంపై తీవ్ర విమర్శలు చేయడంతో రాజకీయ వేడి పెరిగింది. అప్పట్లో కాంగ్రెస్ నాయకులు గాంధీజీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, రవీంద్రనాథ్ ఠాగూర్ చర్చించి ఒక నిర్ణయానికి వచ్చారు. ఠాగూర్ సూచనతో… తొలి రెండు చరణాలు దేశ సౌందర్యాన్ని వర్ణిస్తాయని భావించి జాతీయ వేదికలపై కేవలం వాటినే పాడాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానించింది. 1950 వరకు ఈ పద్ధతే కొనసాగింది.
నేటి కొత్త చట్టం వెనుక ఉన్న మర్మం…
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ గౌరవ పరిరక్షణ సవరణ చట్టం ద్వారా వందేమాతరానికి జాతీయ గీతంతో సమాన రక్షణ లభించింది. ఈ చట్టం ఎవరినీ పాడమని బలవంతం చేయదు… కానీ పాటను ఎవరైనా అడ్డుకుంటే 3 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. అయితే చట్టంలో ఎన్ని చరణాలు పాడాలనే స్పష్టత లేకపోవడంతో… హోంశాఖ ద్వారా ప్రత్యేక ప్రోటోకాల్ జారీ చేసి 6 చరణాలు పాడాలని ఆదేశించారు.
నెహ్రూ లేఖపై రాజకీయ దాడి…
పార్లమెంటు వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ… 1937లో జిన్నా ఒత్తిడికి తలొగ్గి కాంగ్రెస్ పాటను కత్తిరించిందని ఆరోపించారు. అందుకు నెహ్రూ రాసిన ఒక లేఖను సాక్ష్యంగా చూపుతూ… కాంగ్రెస్ నిర్ణయం అప్పుడే దేశ ఐక్యతకు భంగం కలిగించిందని విమర్శించారు. ఈ లేఖ ద్వారా కాంగ్రెస్ మతపరమైన బుజ్జగింపులకు నాడే పునాది వేసిందని బీజేపీ నేతలు వాదిస్తున్నారు.
ప్రియాంక గాంధీ కౌంటర్…
బీజేపీ ఆరోపణలను తిప్పికొడుతూ కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా పార్లమెంటులో నెహ్రూ రాసిన లేఖను పూర్తిస్థాయిలో చదివారు. మతతత్వవాదుల ఒత్తిడికి తలొగ్గకుండా, ప్రజల మనోభావాలను గౌరవిస్తూనే సమస్యను పరిష్కరించాలని నెహ్రూ ఆ లేఖలో ఆకాంక్షించారని ఆమె వివరించారు. కాంగ్రెస్ వైఖరి మత సామరస్యం కోసమే తప్ప విభజన కోసం కాదని ఆమె స్పష్టం చేశారు.
రాజకీయ విభిన్న వాదనలు
వందేమాతరం గౌరవం చట్టం ద్వారా పెరిగిందని ప్రభుత్వం అంటుంటే, స్వాతంత్ర్య సమరయోధుల రాజీని కాపాడటమే నిజమైన దేశభక్తి అని విపక్షాలు వాదిస్తున్నాయి. ఒకే పాటపై 89 ఏళ్ల క్రితం మొదలైన ఈ వివాదం 2026లో కూడా కొనసాగుతూంది. రాజకీయ ప్రయోజనాల కోసం చరిత్రను ఎలా వాడుకుంటున్నారో ఎత్తి చూపుతోంది. మతం, దేశభక్తి, రాజకీయం కలిసిన ఈ గీతం ఇప్పుడు దేశంలో ఒక తీవ్రమైన చర్చకు వేదికగా మారింది.