- ప్రతిపక్షాలే టార్గెట్… కేసుల ఉచ్చు
- ఏపీలో జగన్… తెలంగాణలో కేసీఆర్
- ఒకే సమయంలో ప్రతిపక్షాలపై ఉక్కుపాదం
- దీంతో ఎవరికి ప్రయోజనం అన్న చర్చ
సహనం వందే, హైదరాబాద్/అమరావతి:
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు సెగలు పుట్టిస్తున్నాయి. అభివృద్ధి మాట దేవుడెరుగు కానీ కక్ష సాధింపులు మాత్రం పీక్స్కు వెళ్లాయి. అటు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ సెగలు… ఇటు ఏపీలో వరుస కేసులు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. సమస్యలను గాలికొదిలేసి ప్రత్యర్థులను అణచివేయడమే లక్ష్యంగా పాలన సాగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రాజకీయ చదరంగం ఇప్పుడు సామాన్య ప్రజల్లో కొత్త చర్చకు తెరలేపింది.
తెలంగాణలో ట్యాపింగ్ గుబులు
తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ ఫోన్ ట్యాపింగ్ కేసును అస్త్రంగా వాడుతోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా కేటీఆర్, హరీష్ రావుల చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. ఇప్పటికే పలువురు పోలీసు అధికారులను విచారించిన ప్రభుత్వం కీలక నేతల వైపు అడుగులు వేస్తోంది. సంతోష్ కుమార్కు నోటీసులు ఇస్తూ ప్రతిపక్షాన్ని ఆత్మరక్షణలో పడేసేందుకు ప్రయత్నిస్తోంది. అయితే విచారణలు తప్ప అరెస్టులు లేకపోవడంపై అనేక అనుమానాలు ప్రజల్లో మొదలయ్యాయి.
ఏపీలో కేసుల పర్వం…
ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం జగన్ అనుచరులను టార్గెట్ చేసింది. మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పాటు పలువురు వైసీపీ నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. సోషల్ మీడియా పోస్టుల నుంచి పాత ఫైళ్ల వరకు అన్నింటినీ తిరగదోడుతున్నారు. అధికారం మారగానే పాత కక్షలను తీర్చుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ చర్యలతో ప్రతిపక్షం ఉక్కిరిబిక్కిరి అవుతున్నా అది ప్రజల్లో సానుభూతిగా మారుతోందనేది విశ్లేషకుల మాట.
సమస్యలు పక్కదారి…
ప్రభుత్వాలు ప్రతిపక్షాలపై పడుతుంటే ప్రజా సమస్యలు అటకెక్కాయి. నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి కీలక అంశాలపై చర్చ జరగడం లేదు. పథకాల అమలులో వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఈ కేసుల డ్రామా ఆడుతున్నారనే విమర్శలున్నాయి. పాలనపై దృష్టి పెట్టాల్సిన పాలకులు ప్రత్యర్థులను ఎలా ఇబ్బంది పెట్టాలనే అంశంపైనే ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారు. ఇది రెండు రాష్ట్రాల అభివృద్ధిని కుంటుపరుస్తోంది.
సానుభూతి రాజకీయాలు
అతిగా కేసులు పెట్టడం వల్ల ప్రతిపక్షాలకు లాభం చేకూరుతోంది. కేసీఆర్ లేదా జగన్ బాధితులుగా ప్రచారం చేసుకునే అవకాశం దక్కుతోంది. ప్రజల్లో సానుభూతి పెరిగితే అది అధికార పార్టీలకు ముప్పుగా మారుతుంది. గతంలో ఇలాంటి కక్ష సాధింపులు ఎదుర్కొన్న వారే మళ్లీ అధికారంలోకి వచ్చిన దాఖలాలు ఉన్నాయి. అయినప్పటికీ పాలకులు అదే పాత బాటలో పయనిస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు.
విచారణల వింత పోకడ
కేసుల విచారణ తీరుపై కూడా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గంటల తరబడి విచారిస్తున్నా కీలకమైన సాక్ష్యాలను ఎందుకు బయటపెట్టడం లేదనేది మిస్టరీగా మారింది. కేవలం మీడియా హైప్ కోసమే ఈ తతంగం నడుపుతున్నారనే విమర్శ ఉంది. దోషులపై కఠిన చర్యలు తీసుకోవడంలో జాప్యం చేస్తే ప్రభుత్వాల చిత్తశుద్ధిని ప్రజలు శంకిస్తారు. రాజకీయ లబ్ధి కోసమే ఈ కాలయాపన జరుగుతోందనే అభిప్రాయం బలపడుతోంది.
కేసులను చూసి ఓటు వేయరు
అంతిమంగా ఓటర్లు పాలనను చూసి ఓటేస్తారు తప్ప కేసులను చూసి కాదు. రెండు రాష్ట్రాల్లోనూ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. కానీ పాలకులు ఆ తీర్పును గౌరవించి హామీలు నెరవేర్చాల్సింది పోయి రాజకీయ యుద్ధాల్లో మునిగిపోయారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే త్వరలోనే ప్రజల నుంచి ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉంది. రాజకీయ పంతాల కంటే ప్రజా క్షేమమే ముఖ్యమని పాలకులు గుర్తించాలి.