- ఐదుగురు దాటితే నమోదు చేయరా?
- ఓటు హక్కుకు, పిల్లల సంఖ్యకు ముడెందుకు?
- తనకు ఆరుగురు పిల్లలు ఉన్నారని స్పష్ఠీకరణ
- మోడీ, అమిత్ షా, యోగీలనూ లాగిన ఓవైసీ
- హైదరాబాద్ వేదికగా ‘సర్’పై రచ్చ రచ్చ
సహనం వందే, హైదరాబాద్:
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఇప్పుడు హైదరాబాద్ వేదికగా సరికొత్త రాజకీయ దుమారానికి తెరలేపింది. ఐదుగురు పిల్లల పరిమితిపై అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. ఓటు హక్కుకు, పిల్లల సంఖ్యకు ముడిపెట్టే ప్రయత్నాలపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేశంలోని ప్రముఖుల కుటుంబాలనే ఉదాహరణగా చూపిస్తూ ఒవైసీ చేసిన విమర్శలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
వివాదానికి కారణం
తెలంగాణలో ప్రత్యేక సవరణ ప్రక్రియ (సర్) ఫారమ్లో పిల్లల వివరాల నమోదుకు ఒక పరిమితి విధించారు. ఈ ఫారమ్లో కేవలం ఐదుగురు పిల్లల వివరాలు మాత్రమే నమోదు చేసేందుకు అవకాశం కల్పించారు. దీనిపైనే ఎంఐఎం అధినేత, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. దేశంలో ఐదుగురి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న పౌరుల ఓటు హక్కును కాలరాయడానికి వీల్లేదని ఆయన స్పష్టం చేశారు. ఎక్కువ మంది పిల్లలు ఉన్నంత మాత్రాన ఓటు వేయకుండా అడ్డుకునే చట్టం ఏదీ భారతదేశంలో లేదని ఆయన గుర్తుచేశారు.

ప్రముఖుల ఇళ్లే సాక్ష్యం
ఈ నిబంధనను తప్పుబడుతూ ఒవైసీ ఏకంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కుటుంబాన్ని ఉదాహరణగా తీసుకున్నారు. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కుటుంబంలోనే ఆరుగురు తోబుట్టువులు ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. కేవలం ప్రధానమంత్రి మాత్రమే కాకుండా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పెద్ద కుటుంబం నుంచే వచ్చారని గుర్తుచేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కుటుంబంలో కూడా చాలా మంది సభ్యులు ఉన్నారని ఒవైసీ పేర్కొన్నారు. పెద్ద కుటుంబాలు ఉన్న ప్రముఖులందరినీ టార్గెట్ చేస్తూ ఆయన ఈ విమర్శలు గుప్పించారు.
తన కుటుంబమే ఉదాహరణగా…
ఈ సందర్భంగా ఒవైసీ తన సొంత కుటుంబాన్ని కూడా ఉదాహరణగా ప్రజల ముందు పెట్టారు. తనకు స్వయంగా ఆరుగురు పిల్లలు ఉన్నారని ఆయన బహిరంగంగా ప్రకటించారు. తనలాగే దేశంలో లక్షలాది మందికి ఐదుగురు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉండే అవకాశం ఉందని చెప్పారు. ఓటర్ల జాబితా సవరణ ఫారమ్లో కేవలం ఐదుగురు పిల్లలను మాత్రమే మ్యాప్ చేస్తామనడం సరైన పద్ధతి కాదని ఆక్షేపించారు. ఇలాంటి పరిమితులు పెట్టడం ద్వారా పెద్ద కుటుంబాల ఓటు హక్కును ఇబ్బందుల్లో పడేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పిలుపు…
హైదరాబాద్లో జరిగిన ఒక బహిరంగ సభలో ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. అధికారులు వివరాలు సేకరించడానికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ తమ వివరాలను ఖచ్చితంగా అందించాలని కోరారు. ఓటు హక్కు అనేది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని… దానికి ఇలాంటి ఫారమ్ల నిబంధనలతో అడ్డుకట్ట వేయలేరని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియను పకడ్బందీగా గమనించాలని తన శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.
రాజకీయ ఉత్కంఠ…
ఈ వివాదం రానున్న రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఎన్నికల సంఘం ఈ ఫారమ్ల నిబంధనలపై ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి. ఒవైసీ లేవనెత్తిన ఈ ఐదుగురు పిల్లల పరిమితి అంశంపై ప్రతిపక్షాలు, అధికార పక్షాల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరేలా కనిపిస్తోంది. ఓటు హక్కు పరిరక్షణ పేరిట హైదరాబాద్ వేదికగా మొదలైన ఈ లొల్లి ఢిల్లీ స్థాయికి చేరింది. రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితా చుట్టూ జరుగుతున్న ఈ రాజకీయం తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.