బార్ కౌన్సిల్ బరితెగింపు! – నల్సార్ వర్సిటీ లా విద్యార్థులపై ఉక్కుపాదం

Nalsar University Students Issue
  • న్యాయ విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ పై నిషేధం
  • బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఫాసిస్ట్ నిర్ణయం
  • సీజేఐ ఆహ్వాన రగడే అందుకు కారణం
  • వ్యతిరేకత రావడంతో తోకముడిచిన బార్

సహనం వందే, హైదరాబాద్:

భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్ ని స్నాతకోత్సవానికి ఆహ్వానించే విషయంలో హైదరాబాద్‌లోని నల్సార్ లా యూనివర్సిటీలో చెలరేగిన వివాదం వ్యవస్థల ఫాసిస్ట్ పోకడలను బట్టబయలు చేసింది. ప్రశ్నించే గొంతుకలపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏకపక్షంగా రాజ్యాంగ విలువలకు తూట్లు పొడిచిన వైనం, చివరికి తీవ్ర ప్రజా వ్యతిరేకతతో తోకముడిచిన దయనీయ స్థితిపై కథనం ఇది.

బార్ కౌన్సిల్ హుకుం
నల్సార్ యూనివర్సిటీ నుంచి పట్టభద్రులయ్యే విద్యార్థులను తదుపరి ఆదేశాలు వచ్చేవరకు న్యాయవాదులుగా నమోదు చేయవద్దంటూ రాష్ట్ర బార్ కౌన్సిళ్లకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా హుటాహుటిన దుర్మార్గపు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఈ ప్రచారం వెనుక ఎవరున్నారో గుర్తిస్తూ నివేదిక సమర్పించాలని, ఈ నెల 19న దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని కౌన్సిల్ స్పష్టం చేసింది. వందలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేలా వ్యవహరించిన ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

Bar Council of India cancelled the enrollments to Nalsar Lawa Students

ప్రశ్నకు పడిన శిక్ష
హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీలో త్వరలో జరగబోయే స్నాతకోత్సవ వేడుకలకు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ముఖ్య అతిథిగా హాజరుకావాల్సి ఉండగా, ఈ ఆహ్వానంపై విద్యార్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ జులై 23న వర్సిటీ వైస్ చాన్సలర్ శ్రీకృష్ణదేవ రావు, రిజిస్ట్రార్ ఎన్.వాసంతికి ఈమెయిల్ ద్వారా వినతిపత్రం సమర్పించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ పిలుపు మేరకు జరిగిన ఆందోళనల్లో విద్యార్థులపై పోలీసులు జరిపిన అరాచక దాడులను తప్పుపడుతూ దాఖలైన పిటిషన్‌ను విచారిస్తున్న సమయంలో సీజేఐ చేసిన వ్యాఖ్యలు అత్యంత వివాదాస్పదమయ్యాయి. పిటిషనర్లను ఉద్దేశించి సమయాన్ని వృథా చేసుకోవద్దంటూ ఆయన చేసిన బాధ్యతారహితమైన వ్యాఖ్యలు పోలీసుల దౌర్జన్యాలను వెనకేసుకొచ్చేలా ఉన్నాయని, అలాంటి సంస్కారహీనుడి చేతుల మీదుగా పట్టాలు అందుకోవడం తమ బోధనా విలువలకు పూర్తిగా విరుద్ధమని విద్యార్థులు ఆ ఈమెయిల్‌లో నిర్భయంగా నిలదీశారు. దీంతో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చర్యలకు ఉపక్రమించింది.

వ్యవస్థల అహంకారం
భవిష్యత్తులో న్యాయవాదులుగా దేశంలో అడుగుపెట్టాల్సిన విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ను అడ్డుకోవడం ఫాసిస్ట్ పోకడలను తలపించిందని విద్యార్థి సంఘాలు, మేధావులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేవలం ఒక ఆహ్వానాన్ని పునఃపరిశీలించాలని కోరినందుకు విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెట్టి బ్లాక్‌మెయిల్ చేయడం న్యాయ వ్యవస్థల దుందుడుకు ధోరణికి పరాకాష్టగా నిలిచింది. దేశవ్యాప్తంగా నల్సార్ విద్యార్థులకు మద్దతు పెరగడంతో బార్ కౌన్సిల్ కుట్రపూరిత నిర్ణయంపై వ్యతిరేకత అగ్నిలా పెల్లుబికింది.

దిగివచ్చిన పెద్దలు
అయితే ఈ నిర్ణయం తమ పరువును బజారుకీడ్చుతుందని గుర్తించిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తోకముడవక తప్పలేదు. నల్సార్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్‌కు, రాష్ట్ర బార్ కౌన్సిళ్ల కార్యదర్శులకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ జారీ చేసిన ఆదేశాలను వెనక్కు తీసుకుంది. నల్సార్ 2026 బ్యాచ్ విద్యార్థుల్లో ఎక్కువమంది నిర్దోషులని, వారు ఎలాంటి అవమానకరమైన ప్రచారంలో పాల్గొనే ఉద్దేశంలో లేరని యూటర్న్ తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర బార్ కౌన్సిళ్లలో నల్సార్ విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌పై విధించిన నిషేధానికి సంబంధించిన ఆదేశాన్ని కౌన్సిల్ బేషరతుగా సవరిస్తూ దిక్కులేక అధికారిక ప్రకటన విడుదల చేసింది.

నైతిక సంక్షోభం
ఈ మొత్తం దారుణ ఉదంతంలో విద్యార్థులు, వర్సిటీ యంత్రాంగం, బార్ కౌన్సిల్ మధ్య నడిచిన రాక్షస క్రీడ భారతీయ విద్యా వ్యవస్థల్లో నెలకొన్న అత్యంత భయానక వాతావరణాన్ని కళ్లకు కట్టింది. రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం గొంతెత్తాల్సిన న్యాయ విద్యార్థులు తమ సొంత వర్సిటీలో వేడుకల అతిథుల ఎంపికను ప్రశ్నించడమే నేరంగా పరిగణించే దుస్థితి రావడం ఈ దేశం సిగ్గుపడాల్సిన విషయం. విద్యార్థులు చేసిన ఈమెయిల్ విజ్ఞప్తిని కనీసం గౌరవించాల్సింది పోయి, దానిని ఒక దేశద్రోహ నేరంగా చిత్రించి ఏకంగా వారి జీవితాలను కాలరాసే ప్రయత్నం చేయడం న్యాయ రంగంలో మాయనిమచ్చ.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *