- ఆసుపత్రుల్లో భయం… డాక్టర్లకు ప్రాణగండం
- సేవకు ప్రతిఫలం.. దాడుల మరణహోమం!
- విచ్ఛిన్నమైన వ్యవస్థ… భయం నీడలో చికిత్స
- నేషనల్ మెడికల్ జర్నల్ ఆఫ్ ఇండియా వెల్లడి
సహనం వందే, హైదరాబాద్:
ప్రాణాలను కాపాడాల్సిన వైద్యులు నేడు ప్రాణరక్షణ కోసం పోరాడుతున్నారు. దేవుడితో సమానంగా చూసే వైద్య వృత్తిపై దాడులు పెచ్చరిల్లడం సమాజానికి చేటు తెస్తోంది. ఆసుపత్రులు ప్రాణదాతలకు వేదికలు కావాల్సింది పోయి, రణరంగాలుగా మారుతున్నాయి. వైద్యుల భయం, ఆందోళన చివరకు రోగులకే పెను శాపంగా పరిణమిస్తోంది. వైద్యులపై జరుగుతున్న దాడుల వెనుక ఉన్న భయంకరమైన వాస్తవాలు ఇప్పుడు నివ్వెరపరుస్తున్నాయి.
వైద్య వృత్తిపై పెరిగిన ముప్పు
దేశవ్యాప్తంగా 439 మంది వైద్యులపై నిర్వహించిన తాజా సర్వే వైద్య రంగంలో ఉన్న భయానక స్థితిని బయటపెట్టింది. నేషనల్ మెడికల్ జర్నల్ ఆఫ్ ఇండియా వెల్లడించిన ఈ నివేదిక ప్రకారం ఏకంగా 80.2 శాతం మంది వైద్యులు తమ పని ప్రదేశంలో హింసను అనుభవించారు. ప్రతి ఐదుగురు వైద్యులలో నలుగురు దాడులు లేదా వేధింపులకు గురవుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

మాటలతో మొదలై దాడుల వరకు
కేవలం శారీరక దాడులే కాదు మానసిక వేధింపులు కూడా మితిమీరిపోయాయి. రోగుల బంధువుల తిట్లతో 92.3 శాతం మంది వైద్యులు మానసిక వేదనకు గురవుతున్నారు. శారీరక దాడుల విషయానికి వస్తే 45.6 శాతం మంది వైద్యులు భౌతిక దాడులకు గురయ్యారు. 42.9 శాతం మంది వైద్యులు ఏదో ఒక రకమైన గాయాల బారిన పడ్డారు. దాదాపు 50 శాతం మంది వైద్యులు ఒకటి కంటే ఎక్కువసార్లు ఇలాంటి హింసను అనుభవించడం బాధాకరం.
ఎమర్జెన్సీ వార్డుల్లోనే అత్యధికం
ఎమర్జెన్సీ విభాగాలలో విధులు నిర్వర్తించే సమయంలోనే అత్యధికంగా 53.4 శాతం దాడులు జరుగుతున్నాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిని కాపాడేందుకు వైద్యులు కష్టపడుతుంటే, ఆ సమయాల్లోనే అటెండెంట్లు దాడులకు దిగుతున్నారు. బాధ్యతాయుతంగా ఉండాల్సిన రోగుల బంధువులు, సహాయకులే 92 శాతం మంది నేరస్తులుగా మారుతుండటం వైద్య రంగాన్ని కుదిపేస్తోంది.
పతనమవుతున్న మానసిక ఆరోగ్యం
ఈ నిరంతర భయం, ఆందోళన వల్ల 91 శాతం మంది వైద్యులు తీవ్ర మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రాణాలు కాపాడే చేతులు భయంతో వణుకుతుంటే సరైన చికిత్స ఎలా అందుతుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. చాలామంది వైద్యులు వృత్తిని వదిలేసే స్థాయికి చేరుకున్నారు. ఇది దేశ వైద్య వ్యవస్థకు, అభివృద్ధికి ఆటంకంగా మారుతోంది.
వ్యవస్థపై నమ్మకం లేని వాతావరణం
దాడులు జరిగినప్పుడు ఫిర్యాదు చేసేందుకు కూడా వైద్యులు ధైర్యం చేయలేకపోతున్నారు. 52.6 శాతం మంది వైద్యులు వ్యవస్థపై నమ్మకం లేక దాడులను రిపోర్ట్ చేయడం లేదు. ఫిర్యాదు చేసినా 51.2 శాతం కేసుల్లో ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం బాధితులకు మరింత నిరాశను మిగిల్చుతోంది. నేరస్తులకు శిక్ష పడకపోవడమే ఈ దాడుల పరంపర ఆగకపోవడానికి ప్రధాన కారణమవుతోంది.
సామాజిక మార్పు అవసరం…
మోహిత్ సైనీ, అంకిత తివారి రూపొందించిన ఈ అధ్యయనం ప్రాణదాతల రక్షణను ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని హెచ్చరిస్తోంది. చట్టాలు ఉన్నా అమలులో ఉన్న వైఫల్యాలు వైద్యులను బలిపశువులను చేస్తున్నాయి. మనుషులుగా మనం డాక్టర్ల పట్ల సానుభూతి, గౌరవం చూపకపోతే వైద్య వ్యవస్థ అంధకారంలోకి వెళ్లడం ఖాయం. ఆసుపత్రులు సురక్షితమైన ప్రదేశాలుగా మారనంత వరకు ఈ వేదనకు అంతం ఉండదు.