విద్యార్థి ప్రాణం… 262 కోట్ల పరిహారం – కర్నూలు కుటుంబానికి అమెరికా కోర్టు అండ

Kurnool Student Accident in America
  • పోలీస్ వాహనం ఢీకొని మన విద్యార్థి మృతి
  • 2023 నాటి ప్రమాదంపై అక్కడి కోర్ట్ సీరియస్
  • రికార్డుస్థాయి పరిహారంతో అంతర్జాతీయ చర్చ
  • ఇండియాలో ఈ పరిస్థితి ఊహించగలమా?
  • ఏమాత్రం విలువ లేని భారతీయుడి ప్రాణాలు

సహనం వందే, కర్నూలు:

అమెరికా వీధుల్లో పోలీసు వాహనం వేగానికి బలైపోయిన కర్నూలుకు చెందిన కందుల జాహ్నవి మరణం ప్రపంచవ్యాప్తంగా చట్టం ముందు సమానత్వాన్ని చాటిచెప్పింది. ఇది కేవలం ప్రమాదం కాదు… వ్యవస్థాగత నిర్లక్ష్యంతో చేసిన హత్యగా ప్రకటించారు. ప్రాణం విలువను కొలవలేకపోయినా… చేసిన తప్పుకు సియాటెల్ నగరం ప్రకటించిన రికార్డు స్థాయి పరిహారం ఇప్పుడు భారత్‌లోని ప్రాణాల విలువపై నిశిత విమర్శలకు తావిస్తోంది.

Seattle Road Accident - Rs. 262 Crores for a Life

ఖరీదైన ప్రాణం వర్సెస్ చౌక మరణం
కందుల జాహ్నవి మరణానికి సియాటెల్ నగరం 262 కోట్ల రూపాయల భారీ పరిహారం ప్రకటించింది. అమెరికాలో ఒక వ్యక్తి సంపాదన సామర్థ్యం, వయస్సును బట్టి పరిహారం నిర్ణయిస్తారు. కానీ భారతదేశంలో పరిస్థితి దీనికి పూర్తి భిన్నం. మన దేశంలో రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారికి ఇచ్చే పరిహారం సాధారణంగా లక్షల్లోనే ముగుస్తుంది. ఒక భారతీయ విద్యార్థిని మరణానికి అమెరికాలో 262 కోట్లు ఇస్తుంటే, భారత్‌లో అజాగ్రత్తగా నడిపే ప్రభుత్వ బస్సులు, వాహనాల వల్ల ప్రాణాలు కోల్పోయిన పేద కుటుంబాలకు అందేది నామమాత్రపు సొమ్ము మాత్రమే. ఇక్కడ చట్టం బాధితుల వైపు కాకుండా ఇన్సూరెన్స్ కంపెనీల వైపు మొగ్గు చూపుతోంది.

వేగం వెనుక పోలీసు నేరం…
ప్రమాదానికి కారణమైన పోలీసు అధికారి కెవిన్ డేవ్ తన వాహనాన్ని గంటకు 119 కిలోమీటర్ల వేగంతో నడిపాడు. అత్యవసర కాల్‌కు స్పందిస్తున్నాననే సాకుతో జనావాసాల్లో ఇంత వేగంగా వెళ్లడం ముమ్మాటికీ నేరమే. పాదచారుల మార్గం దాటుతున్న 23 ఏళ్ల జాహ్నవిని ఆ వాహనం బలంగా ఢీకొట్టింది. పోలీసుల శిక్షణలో ఉన్న లోపాలను, నిబంధనల ఉల్లంఘనను ఈ ఉదంతం ఎండగట్టింది. భారత్‌లో ‘అత్యవసర వాహనం’ అనే ముసుగులో నిబంధనల ఉల్లంఘన నిత్యకృత్యం. ఇక్కడ అధికారిక వాహనాలు ఢీకొంటే బాధ్యులపై చర్యలు తీసుకోవడం కంటే కేసులను నీరుగార్చడమే ఎక్కువగా కనిపిస్తుంటుంది.

అధికార గర్వానికి భారీ మూల్యం
ప్రమాదం జరిగిన తర్వాత మరో పోలీసు అధికారి డానియల్ ఆడెరర్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం కలిగించాయి. జాహ్నవి ప్రాణానికి విలువ లేదని… ఆమె కేవలం ఒక సాధారణ వ్యక్తి అని అతను ఎగతాళి చేశాడు. కొంత పరిహారం చెల్లించి సరిపెట్టవచ్చని బాడీ కెమెరా సాక్షిగా నవ్వుతూ మాట్లాడాడు. ఈ అమానవీయ వ్యాఖ్యలే పరిహారం కోసం జరిగిన పోరాటంలో కీలక మలుపుగా మారాయి. మన దేశంలోనూ బాధితుల పట్ల పోలీసులు ప్రదర్శించే ఇలాంటి అమానవీయ ప్రవర్తనకు భారీ జరిమానాలు విధించాల్సిన అవసరం ఉంది. పాలకుల నిర్లక్ష్యం వల్లే ప్రభుత్వం ఇలాంటి భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది.

జవాబుదారీతనం లేని భారతీయ న్యాయం
సియాటెల్ తీర్పు భారత్‌లోని రోడ్డు ప్రమాదాల పరిహార వ్యవస్థకు ఒక కనువిప్పు. చట్టాల ముందు అందరూ సమానమేనని అమెరికా కోర్టు నిరూపించింది. మన దేశంలో పోలీసు లేదా ప్రభుత్వ వాహనాలు ఢీకొంటే న్యాయం జరగడం గగనమవుతోంది. బాధ్యుడైన పోలీసు అధికారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవడంలో జాప్యం జరగడంపై ఇప్పటికీ విమర్శలు ఉన్నాయి. డాలర్లలో కొలిచే అమెరికా న్యాయం రూపాయిల కోసం పోరాడే భారతీయ సామాన్యుడికి ఒక పాఠం కావాలి.

రికార్డు స్థాయి సెటిల్మెంట్ సారాంశం
సియాటెల్ నగరం చెల్లిస్తున్న 262 కోట్ల రూపాయల పరిహారం ఆ నగర చరిత్రలోనే అతిపెద్ద సెటిల్మెంట్లలో ఒకటి. జాహ్నవి చదువుకున్న నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ ఆమెకు గౌరవ డిగ్రీని కూడా ప్రకటించింది. ఒక మేధావిని, దేశ భవిష్యత్తును అధికార మదం ఎలా నాశనం చేస్తుందో ఈ అంకెలు చెబుతున్నాయి. పరిహారం విషయంలో జరిగిన చర్చల్లో ప్రతి పైసా ఆమె కుటుంబం పడుతున్న వేదనకు సాక్ష్యంగా నిలిచింది. ఈ భారీ మొత్తం ఆమె కుటుంబానికి కొంత ఉపశమనం కలిగించినా వ్యవస్థ చేసిన తప్పును ఎప్పటికీ తుడిచివేయలేదు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *