- కొందరు సినీ పెద్దలే అడ్డుకుంటున్నట్లు ప్రచారం
- దీంతో తెలుగుకు నోచుకోని దేశభక్తి సినిమా
- థియేటర్లలో దుమ్ములేపుతున్న ధురంధర్
- మ్యూజిక్, పాటలతో దద్దరిల్లుతున్న హాళ్లు
- పాక్ గడ్డపై భారత స్పై పోరాటం అద్భుతం
సహనం వందే, హైదరాబాద్:
భారతీయ సినీ యవనికపై ఇప్పుడు ఎక్కడ చూసినా ధురంధర్ నామజపమే వినిపిస్తోంది. దేశభక్తి సెగను వెండితెరపై ఆవిష్కరిస్తూ ఆదిత్య ధర్ అద్భుత దృశ్యకావ్యాన్ని ఆవిష్కరించారు. రణవీర్ సింగ్ తన నటనతో థియేటర్లలో పూనకాలు తెప్పిస్తున్నారు. అయితే ఉత్తరాదిని ఊపేస్తున్న ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు దూరం చేయడం వెనుక గూడుపుఠాణి జరుగుతోందన్న చర్చ మొదలైంది.

బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ…
రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ సినిమా వసూళ్లలో దూసుకుపోతోంది. సినిమా నిడివి అంత పెద్దగా ఉన్నప్పటికీ ప్రేక్షకులు ఉత్కంఠతో చూస్తూనే ఉన్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 900 కోట్లు రాబట్టి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. 2025లో అత్యంత వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న తొలి భారతీయ సినిమాగా ఇది నిలిచింది. మరికొద్ది రోజుల్లోనే వెయ్యి కోట్ల క్లబ్ లో ఈ చిత్రం చేరడం ఖాయం. హిందీ వెర్షన్ కు వస్తున్న ఆదరణ చూస్తుంటే రికార్డులన్నీ తిరగరాసేలా ఉంది.
తెలుగు గడ్డపై డబ్బింగ్ కష్టాలు
ఇంతటి భారీ విజయం సాధించిన చిత్రాన్ని తెలుగులో విడుదల చేయకపోవడం వెనుక పెద్ద కుట్ర ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి. టాలీవుడ్ లోని కొందరు బడా నిర్మాతలు, పంపిణీదారులు కావాలనే అడ్డుకుంటున్నట్లు సమాచారం. ఇతర భాషా సినిమాలు ఇక్కడ ఆడితే తమ వ్యాపారం దెబ్బతింటుందన్న భయమే దీనికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. మంచి సినిమాను తెలుగు వాళ్లకు దూరం చేయడంపై సోషల్ మీడియాలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవంగా ఈ సినిమాను ఈ నెల 19వ తేదీనే విడుదల చేస్తారని ప్రచారం జరిగింది. కానీ కుట్రలతో అది ఆగిపోయింది.
దేశభక్తి కథకు అడ్డుంకులు ఎందుకు
పాకిస్థాన్ గడ్డపై భారత గూఢచారి సాహసాలను ఈ సినిమాలో చాలా గొప్పగా చూపించారు. దేశం కోసం ప్రాణాలొడ్డి పోరాడే యోధుల కథను అడ్డుకోవడం దేశద్రోహం కిందికే వస్తుందని దేశాభిమానులు మండిపడుతున్నారు. జాతీయ ప్రయోజనాలు, ఆర్మీ గొప్పతనాన్ని చాటిచెప్పే సినిమాను ఏ భాషా బేధం లేకుండా చూడాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కుట్రపూరిత రాజకీయాల వల్ల అద్భుతమైన సినిమాను తెలుగు ప్రజలు కోల్పోతున్నారు.
గూఢచారి సాహసాల సమాహారం
దర్శకుడు ఆదిత్య ధర్ 2000 కాలంలో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా ఈ కథను రూపొందించారు. శత్రువుల గుండెల్లోకి వెళ్లి భారతీయుడు సాధించిన విజయాన్ని కళ్లకు కట్టారు. అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ వంటి దిగ్గజ నటుల రాకతో సినిమా స్థాయి పెరిగింది. ప్రతీ సన్నివేశం ఉత్కంఠభరితంగా సాగుతూ ప్రేక్షకులను కుర్చీ అంచున కూర్చోబెడుతోంది. అందుకే ఈ సినిమాను అన్ని భాషల ప్రజలు చూడాలని కోరుకుంటున్నారు.