సామాన్యులు గృహ ‘హీనులు’ – కుబేరులే లక్ష్యంగా ఖరీదైన ఇళ్ళ నిర్మాణాలు

Luxury Houses
  • విలాసవంతమైన కోటల నిర్మాణానికి పెద్దపీట
  • పేదవాడి గూడు దూరం… పట్టించుకోని బిల్డర్లు
  • లాభాల వేటలో పడి సామాన్యుడి బలి
  • హైదరాబాద్, ఢిల్లీలో చుక్కల్లో ఇంటి ధరలు
  • వడ్డీ రేట్ల పిడుగుతో బతుకు ఛిద్రం

సహనం వందే, హైదరాబాద్:

రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు కేవలం ధనికులను లక్ష్యంగా చేసుకుని విలాసవంతమైన భవనాలనే నిర్మిస్తోంది. సామాన్యులకు అవసరమైన తక్కువ ధర ఇళ్ల నిర్మాణంపై ఏ ఒక్కరూ దృష్టి పెట్టడం లేదు. లాభాల వేటలో పడి పేద ప్రజల కనీస అవసరాలను పాలకులు, బిల్డర్లు పూర్తిగా విస్మరిస్తున్నారు. దీనివల్ల నగరాల్లో మురికివాడలు పెరిగిపోతున్నాయి. ఆదాయ అసమానతలు పెరగడానికి ఈ గృహ సంక్షోభమే ప్రధాన కారణమని నిపుణులు అంటున్నారు.

హైదరాబాద్, ఢిల్లీలలో దారుణ పరిస్థితులు
భారతదేశ రాజధాని ఢిల్లీ, దక్షిణాదికి గేట్ వే లాంటి హైదరాబాదులో గృహాల లభ్యత అత్యంత సంక్లిష్టంగా మారింది. ఇక్కడ ఒక సాధారణ ఇంటి ధర సగటు వార్షిక ఆదాయం కంటే 10 రెట్లు ఎక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా 4.7 కోట్ల ఇళ్ల కొరత వేధిస్తున్నా రియల్ ఎస్టేట్ సంస్థలు కేవలం లగ్జరీ అపార్ట్‌మెంట్లపైనే మక్కువ చూపుతున్నాయి. ఢిల్లీ, హైదరాబాద్ వంటి నగరాల్లో భూమిని కేవలం వ్యాపార వస్తువుగా మార్చడం వల్ల మధ్యతరగతి ప్రజలు అద్దె ఇళ్లలోనే మగ్గిపోవాల్సి వస్తోంది. ఇది సామాజిక అసమతుల్యతకు దారితీస్తోంది.

Common Man Houses Vs Real Estate

ఆసియాలో ముదురుతున్న సంక్షోభం
ప్రపంచంలోనే అత్యంత భారమైన గృహ మార్కెట్లు హాంకాంగ్ లేదా లండన్ వంటి సంపన్న నగరాల్లో ఉన్నాయని అనుకుంటే పొరపాటే. ఆసియాలోని మనీలా, కొలంబో, ఢిల్లీ, హైదరాబాద్ వంటి నగరాల్లోనే ఇల్లు కొనడం అత్యంత అసాధ్యంగా మారింది. ఆసియాలోని 51 ప్రధాన నగరాలను పరిశీలిస్తే కేవలం 7 నగరాల్లో మాత్రమే ఇళ్లు సామాన్యుడికి అందుబాటులో ఉన్నాయి.

వడ్డీ రేట్ల భారం
బ్యాంకు వడ్డీ రేట్లు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. 2021 సంవత్సరంలో కేవలం 3 శాతంగా ఉన్న తనఖా వడ్డీ రేట్లు 2023 నాటికి 7 శాతానికి పెరిగాయి. దీనివల్ల మధ్యతరగతి ప్రజలు ఇళ్లు కొనాలనే ఆలోచననే విరమించుకుంటున్నారు. అమెరికాలో కూడా గృహాల లభ్యత గత 50 ఏళ్లలో లేనంత కనిష్టానికి పడిపోయింది. ఆస్ట్రేలియాలో వడ్డీ రేట్లు తగ్గించినా గృహాల ధరలు మాత్రం తగ్గకపోవడం గమనార్హం. ఇది అంతర్జాతీయంగా ఉన్న లోపభూయిష్ట విధానాలకు నిదర్శనం.

మార్పు రావాల్సిన సమయం
ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్లు తెరవాలి. భూ వినియోగ నిబంధనలను సడలించి సామాన్యులకు ఇళ్లు నిర్మించేలా ప్రైవేట్ సంస్థలపై ఒత్తిడి తేవాలి. ఢిల్లీ, హైదరాబాద్ వంటి నగరాల్లో పట్టణీకరణ వేగంగా జరుగుతున్నా దానికి తగ్గట్టుగా తక్కువ ధర ఇళ్ల నిర్మాణం జరగడం లేదు. ఈ దిశగా సమూల మార్పులు రాకపోతే భవిష్యత్తులో గృహ సంక్షోభం మరింత ముదిరి సామాజిక విస్ఫోటనానికి దారితీస్తుంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *