- అన్నదాతలకు అరసవెల్లి ఆశీర్వాదాలు
- గత పాలకుల అరాచకంపై విజయం
సహనం వందే, అమరావతి:
అమరావతి రాజధాని కోసం రైతులు చేసిన సుదీర్ఘ పోరాటం నేడు చారిత్రక ఘట్టానికి చేరింది. వైసీపీ ప్రభుత్వ అరాచకాలను ఎదురించి ప్రాణాలను పణంగా పెట్టిన రైతుల కృషి ఫలించింది. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఈ విజయోత్సవంలో రైతులతో కలిసి పంచుకున్న భావోద్వేగ క్షణాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి.
అరసవిల్లి మొక్కు తీరింది…
రాజధాని చట్టబద్ధత కోసం నాడు రైతులు అమరావతి నుండి అరసవిల్లి వరకు పాదయాత్ర చేశారు. ఆ సమయంలో ఎంపీ కలిశెట్టి రైతులతో కలిసి నడిచారు. రాజధాని దక్కాలని శ్రీ సూర్యనారాయణ స్వామిని వేడుకున్నారు. నేడు రాజధాని సాధన తర్వాత అరసవిల్లి తీర్థప్రసాదాలతో ఆయన నేరుగా తుళ్లూరు చేరుకున్నారు.
త్యాగాల గడ్డపై సంబరాలు…
తుళ్లూరు ప్రాంతంలో మంగళవారం పండుగ వాతావరణం నెలకొంది. 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష నెరవేరిన తరుణంలో ఎంపీ కలిశెట్టి రైతులకు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. రైతులతో కలిసి ఆయన ఈ చట్టబద్ధ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఇది కేవలం ప్రాంతీయ విజయం కాదు… తెలుగు ప్రజల కల అని ఆయన పేర్కొన్నారు.
వైసీపీ అరాచకాలపై గెలుపు…
గత వైసీపీ పాలకుల కాలంలో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులు వర్ణనాతీతం. పోలీసుల లాఠీలు, కేసులకు భయపడకుండా రైతులు నిలబడ్డారు. నాటి చీకటి రోజుల్లో రైతులకు కలిశెట్టి అండగా నిలిచారు. ఆ ధైర్యమే నేడు రాజధాని మళ్ళీ ఊపిరి పోసుకోవడానికి ప్రధాన కారణమైంది.
రైతుల ఘన సన్మానం…
తమ కష్టాల్లో తోడున్న ఎంపీని రైతులు గౌరవించుకున్నారు. రాజధాని రైతులు కలిశెట్టికి దుస్సాలువ కప్పి సత్కరించారు. బట్టలు పెట్టి తమ కృతజ్ఞతలు చాటుకున్నారు. ఒక ఎంపీ కంటే ఒక సోదరుడిగా తమ వెన్నంటే ఉన్నందుకు రైతులు ఉద్వేగానికి లోనయ్యారు.
చరిత్రలో నిలిచే ఘట్టం…
రైతుల పోరాటం భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిస్తుందని ఎంపీ కొనియాడారు. భూములను త్యాగం చేసిన రైతుల పేరు అమరావతి చరిత్రలో శాశ్వతంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ పోరాట ప్రతిమ ఒక చారిత్రాత్మక ఘట్టమని ఆయన ప్రశంసించారు.
విజయనగరం వెన్నుదన్ను
విజయనగరం ఎంపీగా కలిశెట్టి అమరావతి కోసం చూపిన నిబద్ధత అందరినీ ఆశ్చర్యపరిచింది. ఉత్తరాంధ్ర నుండి వచ్చి రాజధాని రైతులకు వెన్నుదన్నుగా నిలవడం రాజకీయాల్లో కొత్త ఒరవడికి దారితీసింది. పాలకుల అరాచకానికి వ్యతిరేకంగా సాగిన ఈ ధర్మపోరాటం నేడు సాకారం కావడం శుభసూచకం.