- వేధింపులు, ద్వేషపూరిత ప్రసంగ వీడియోలు
- డిజిటల్ ప్రపంచంలో భారీ కుట్రలు
- లాభాల కోసం విషపూరిత కంటెంట్
- వినియోగదారుల భద్రత గాలికి
సహనం వందే, హైదరాబాద్:
డిజిటల్ ప్రపంచంలో మనం చూసే ప్రతి సోషల్ మీడియా వీడియో వెనుక ఒక భారీ కుట్ర దాగి ఉంది. మీ కళ్ళ ముందు కదలాడే ప్రతి దృశ్యం లాభాల కోసం అల్లిన ఒక విషపు వల. టెక్ దిగ్గజాలు మన భావోద్వేగాలను వాడుకుంటూ మనల్ని కీలుబొమ్మలను చేస్తున్నాయి. ఈ యంత్రాల వెనుక ఉన్న చేదు నిజాలు ఇప్పుడు బయటపడుతున్నాయి.

అల్గారిథమ్స్ సృష్టించే మాయాజాలం
సోషల్ మీడియా దిగ్గజాలు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ కంపెనీలు తమ అల్గారిథమ్లతో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నాయి. వినియోగదారుల దృష్టిని ఆకర్షించడానికి వారికి కించపరిచే కంటెంట్ను కావాలని చూపిస్తున్నాయి. కంపెనీల అంతర్గత పరిశోధనలే ఈ విషయాన్ని బయటపెట్టాయి. ఆవేశం, ద్వేషం ఉన్న కంటెంట్ను చూపడం ద్వారానే ఎక్కువ మందిని ప్లాట్ఫామ్లపై ఉంచుకోవచ్చని ఈ సంస్థలు భావిస్తున్నాయి.
లాభం కోసమే ప్రమాదకర నిర్ణయాలు
మెటాకు చెందిన ఒక ఇంజనీర్ సంచలన విషయాన్ని వెల్లడించారు. మెటా షేర్ ధరలు తగ్గడంతో టిక్టాక్తో పోటీ పడటానికి అసభ్యకర కంటెంట్ను ఫీడ్లలో అనుమతించాలని సీనియర్ యాజమాన్యం ఆదేశించింది. మిసోజిని, కుట్ర సిద్ధాంతాల వంటి ప్రమాదకర కంటెంట్ను ప్రోత్సహించడానికి వారు వెనుకాడలేదు. అల్గారిథమ్స్ ద్వారా వచ్చే ఆదాయమే లక్ష్యంగా ఇవి పనిచేస్తున్నాయి.
రాజకీయ నాయకులకు ప్రాధాన్యత
టిక్టాక్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. రాజకీయ నాయకులకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలను పరిష్కరించడానికి కంపెనీ అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. కానీ చిన్నారులకు సంబంధించిన భద్రతా పరమైన సమస్యలను మాత్రం పక్కన పెడుతోంది. ఫ్రాన్స్లో ఒక 17 ఏళ్ల అమ్మాయి వేధింపుల ఫిర్యాదు, ఇరాక్లో ఒక 16 ఏళ్ల అమ్మాయి అశ్లీల చిత్రాల ఫిర్యాదు వంటివి టిక్టాక్ దృష్టిలో తక్కువ ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. రాజకీయ నాయకులతో మంచి సంబంధాలు ఉంటేనే రెగ్యులేషన్ల నుంచి తప్పించుకోవచ్చని కంపెనీ భావిస్తోంది.
రక్షక కవచం లేని ఇన్స్టాగ్రామ్ రీల్స్
2020లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ ప్రారంభమైనప్పుడు తగినంత భద్రతా చర్యలు లేవని సీనియర్ పరిశోధకుడు మ్యాట్ మోటల్ చెప్పారు. రీల్స్ ప్రారంభానికి 700 మంది సిబ్బందిని నియమించిన మెటా… భద్రతా విభాగంలో మాత్రం కనీసం ఇద్దరిని కూడా నియమించలేదు. ఫలితంగా రీల్స్లో వేధింపులు, ద్వేషపూరిత ప్రసంగాలు, హింసాత్మక కంటెంట్ పెరిగిపోయాయని అంతర్గత నివేదికలు నిరూపిస్తున్నాయి. సాధారణ ఇన్స్టాగ్రామ్ ఫీడ్ కంటే రీల్స్లో బుల్లీయింగ్ 75 శాతం, ద్వేషపూరిత ప్రసంగాలు 19 శాతం, హింస 7 శాతం ఎక్కువగా ఉన్నాయి.
అల్గారిథమ్ బాధితుడిగా కలుమ్
అల్గారిథమ్స్ వల్ల కలుమ్ అనే 19 ఏళ్ల యువకుడు 14 ఏళ్ల వయస్సులోనే తీవ్రవాద భావజాలానికి లోనయ్యాడు. ఆ అల్గారిథమ్ అతనికి కోపం తెప్పించే కంటెంట్ను పదేపదే చూపి చివరకు అతన్ని ఒక జాతి వివక్ష, స్త్రీ ద్వేషం కలిగిన వ్యక్తిగా మార్చింది. ఇది అతని అంతర్గత ఆవేదనను మరింతగా పెంచింది. బ్రిటన్కు చెందిన కౌంటర్ టెర్రర్ పోలీస్ నిపుణులు కూడా సామాజిక మాధ్యమాల్లో హింసాత్మక కంటెంట్ పెరిగిపోవడాన్ని గుర్తించారు.
డెలీట్ చేయడమే పరిష్కారం
టిక్టాక్ భద్రతా విభాగంలో పనిచేసిన నిక్ అనే ఉద్యోగి షాకింగ్ విషయాలు చెప్పారు. తీవ్రవాదం, లైంగిక వేధింపులు, ట్రాఫికింగ్ వంటి కంటెంట్ పెరిగినా కంపెనీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. పిల్లల భద్రత కంటే రాజకీయ సంబంధాలకే కంపెనీ ప్రాముఖ్యత ఇస్తోంది. దీని వల్ల పిల్లలకు కలిగే ముప్పును గమనించి తల్లిదండ్రులు టిక్టాక్ యాప్ను వెంటనే ఫోన్లలోంచి తొలగించడం మంచిదని నిక్ హెచ్చరిస్తున్నారు.