- అమెరికా సైనిక వ్యూహాల సీక్రెట్ సేల్
- యుద్ధ బీభత్సంలో జూదగాళ్ల పండగ
- ముందస్తు సమాచారంతో 4,443 కోట్ల దందా
- టెకీలు… బడా ఇన్వెస్టర్లే సూత్రధారులు
- దేశాల సార్వభౌమత్వానికి ముప్పు
సహనం వందే, హైదరాబాద్:
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణం అంతర్జాతీయ రాజకీయాలను కుదిపేస్తోంది. కానీ ఈ విషాదం వెనుక ఒక చీకటి వ్యాపారం కోట్లలో లాభాలను గడించింది. యుద్ధ క్షేత్రంలో బాంబులు పడకముందే బెట్టింగ్ మార్కెట్లలో కాసుల వర్షం కురిసింది. ఇది కేవలం అంచనా మాత్రమేనా లేక ముందస్తుగా అమ్ముడుపోయిన సైనిక రహస్యమా అనే అనుమానాలు ఇప్పుడు ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తున్నాయి.

పాలిమార్కెట్ మాయాజాలం
పాలిమార్కెట్ అనేది క్రిప్టో ఆధారిత వికేంద్రీకృత ప్రిడిక్షన్ ప్లాట్ఫారమ్. ఇక్కడ రాజకీయాలు, ప్రపంచ పరిణామాలపై బెట్టింగ్ జరుగుతుంది. ప్రధానంగా టెక్ నిపుణులు, బడా ఇన్వెస్టర్లు ఇందులో పందాలు కాస్తారు. దీని వెనుక అమెరికాలోని వాల్ స్ట్రీట్ దిగ్గజాలు, సిలికాన్ వ్యాలీ పెట్టుబడిదారులు ఉంటారు. ఇరాన్ దాడుల సమయం వంటి అత్యంత రహస్య సమాచారం సైనిక వర్గాల నుంచో లేదా ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నుంచో లీక్ అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి లీకేజీల వెనుక సమాచారాన్ని సొమ్ము చేసుకునే అదృశ్య హస్తాలు ఉంటాయి.
చావుతో చదరంగం
పాలిమార్కెట్ వేదికగా జరిగిన ఈ జూదం మానవ నైతికతను ప్రశ్నిస్తోంది. ఇరాన్ మీద దాడులు ఎప్పుడు జరుగుతాయనే అంశంపై సుమారు 4,443.6 కోట్ల రూపాయలు పందాలుగా మారాయి. అలీ ఖమేనీ పదవి నుంచి తప్పుకోవడం లేదా చనిపోవడంపై మరో 1,260 కోట్ల రూపాయలు చేతులు మారాయి. శనివారం జరిగిన ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ చనిపోవడానికి కొద్ది గంటల ముందే కొందరు అక్రమంగా లాభపడ్డారు. ఇది ఒక వ్యవస్థీకృత నేరంగా కనిపిస్తోంది.
ఇన్సైడర్ ట్రేడింగ్ గుట్టు
బబుల్ మ్యాప్స్ సంస్థ బయటపెట్టిన గణాంకాలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. కేవలం 6 ఖాతాలు దాడులకు ముందు 10 కోట్ల రూపాయలకు పైగా లాభాన్ని మూటగట్టుకున్నాయి. జనవరి మధ్యలోనే ఏ మాత్రం లావాదేవీల చరిత్ర లేని కొత్త వాలెట్లు ఇరాన్ కాంట్రాక్టులపై పందాలు కాయడం గమనార్హం. మార్చి చివరికల్లా ఖమేనీ తప్పుకుంటాడని వీరు పందెం కాశారు. అంటే దాడుల ప్రణాళిక ముందే వీరికి తెలుసా అనే ప్రశ్న ఉదయిస్తోంది.
కల్షీ నైతిక డొల్లతనం
కల్షీ అనేది అమెరికాలో మరో ప్రముఖ ప్రిడిక్షన్ మార్కెట్. ఇది పాలిమార్కెట్కు ప్రధాన ప్రత్యర్థి. వివాదం ముదరడంతో కల్షీ సంస్థ తన యూజర్లకు ఫీజులను తిరిగి ఇస్తామని ప్రకటించింది. మరణం ద్వారా వచ్చే లాభాలను తాము ప్రోత్సహించబోమని ఆ సంస్థ సీఈఓ తారెక్ మన్సూర్ చెప్పుకొచ్చారు. గతంలో వెనిజులా అధ్యక్షుడు మదురో విషయంలో కూడా 3.4 కోట్ల రూపాయలు ఒక వ్యక్తికి అందాయి. ఇవన్నీ చూస్తుంటే ఈ మార్కెట్లు యుద్ధాలను వ్యాపార వస్తువులుగా మార్చాయని స్పష్టమవుతోంది.
చట్టం కళ్ళు కప్పి
అమెరికా చట్టాల ప్రకారం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమైన పందాలు నిషేధం. ఆరుగురు డెమొక్రాట్ సెనేటర్లు ఇప్పటికే ఈ అంశంపై ఫిర్యాదు చేశారు. సెనేటర్ క్రిస్ మర్ఫీ ఇది అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించారు. ఇలాంటి బెట్టింగ్లను వెంటనే నిషేధించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అయితే నియంత్రణ సంస్థల కళ్ళు కప్పి ఈ మార్కెట్లు గ్లోబల్ ట్రేడింగ్ వాల్యూమ్ను రూ. 3.94 లక్షల కోట్ల రూపాయలకు పెంచేయడం ఆశ్చర్యకరం.
లోతైన విచారణకు డిమాండ్
అంతర్జాతీయ సమాజం ఇప్పుడు ఈ డేటా లీకేజీపై నిఘా పెంచింది. ఇలాంటి బెట్టింగ్ మాఫియాపై అత్యంత లోతైన, సమగ్రమైన దర్యాప్తు అవసరమని విశ్లేషకులు భావిస్తున్నారు. న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ మాతృ సంస్థ ఐసీఈ పాలిమార్కెట్లో 16,800 కోట్ల రూపాయల భారీ పెట్టుబడి పెట్టింది. సైనిక వ్యూహాలు పందెం రాయుళ్ల చేతుల్లోకి వెళ్లడం దేశాల సార్వభౌమత్వానికి ముప్పు. ఇరాన్ దాడుల సమయాన్ని ముందే కొనుగోలు చేసిన ఈ అదృశ్య హస్తాలెవరివో తేలాల్సి ఉంది.