- 8 గంటల తిండి... సడన్ హార్ట్ ఎటాక్ స్టోరీ
- 16 గంటల ఉపవాసంతో తీవ్ర అనారోగ్యం
- అమెరికా హార్ట్ అసోసియేషన్ షాకింగ్ నిజం
- తిండి మానేయడం గుండెపై అదనపు భారం
సహనం వందే, అమెరికా:
ఆరోగ్యం కోసం చేసే ఉపవాసం కాస్తా చివరకు ప్రాణాల మీదకు తెస్తోంది. బరువు తగ్గాలని భావించే వారు చేసే అతిపెద్ద పొరపాటు గుండెను బలహీనపరుస్తోంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వెల్లడించిన కొత్త గణాంకాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పేరుతో చేసే ప్రయోగాలు ప్రాణాంతకమని తేలింది.

8 గంటలతో మృత్యువుకు దగ్గరకు
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసేవారు రోజులో కేవలం 8 గంటల లోపే ఆహారం తీసుకుంటారు. మిగిలిన 16 గంటలు ఖాళీ కడుపుతో ఉంటారు. ఇలా చేయడం వల్ల గుండె జబ్బులతో చనిపోయే ముప్పు 91 శాతం పెరుగుతోంది. అమెరికాలో 20 వేల మందిపై చేసిన పరిశోధనలో ఈ షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. ఆహారం తినే సమయం తగ్గించుకుంటే ఆయుష్షు పెరుగుతుందని అనుకోవడం కేవలం అపోహ మాత్రమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తప్పుదోవ పట్టించే డైట్ ప్లాన్
బరువు తగ్గడానికి చాలామంది 16:8 పద్ధతిని పాటిస్తున్నారు. అంటే ఏదైనా 8 గంటల మధ్యలోనే తిని మిగిలిన 16 గంటలు ఉపవాసం ఉండటం అన్నమాట. దీనివల్ల శరీరంలోని కొవ్వు కరుగుతుందని నమ్ముతారు. కానీ శాస్త్రవేత్తల డేటా అధ్యయనంలో మాత్రం ఇది గుండె పనితీరును దెబ్బతీస్తోంది. ఈ డైట్ వల్ల కండరాల సాంద్రత తగ్గిపోతోంది. ముఖ్యంగా గుండె కండరాలు బలహీనపడటం వల్ల అకస్మాత్తుగా మరణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శరీరానికి అవసరమైన పోషకాలు నిర్ణీత సమయంలో అందకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఆహారం తీసుకునే విరామ సమయం పెరగడం వల్ల రక్తపోటులో మార్పులు వస్తున్నాయి. ఇలాంటి ప్రయోగాలు చేయడం ఆత్మహత్యతో సమానమని పరిశోధకులు చెబుతున్నారు.
గణాంకాలు చెబుతున్న కఠిన వాస్తవం
శాస్త్రవేత్తలు దాదాపు 15 ఏళ్ల పాటు ప్రజల ఆహారపు అలవాట్లను గమనించారు. రోజుకు 12 నుంచి 16 గంటల పాటు ఆహారం తీసుకునేవారితో పోలిస్తే తక్కువ సమయం తినేవారిలో మరణాల రేటు ఎక్కువగా ఉంది. అంటే 8 నుంచి 10 గంటల మధ్య తినే వారిలో మరణాల రేటు ఎక్కువగా ఉందని తేలింది. కేవలం బరువు తగ్గడమే లక్ష్యంగా పెట్టుకోవడం వల్ల ప్రాథమిక ఆరోగ్యం దెబ్బతింటోంది. రక్తంలోని చక్కెర స్థాయిలు పడిపోవడం… హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతోంది. ఈ విశ్లేషణలో పాల్గొన్న వాలంటీర్లలో ఎక్కువమంది మధ్యవయస్కులే ఉండటం గమనార్హం.
వ్యక్తిగత ఆరోగ్యంపై నిర్లక్ష్యం
ప్రతి శరీరం ఒకేలా స్పందించదు. సెలబ్రిటీలు చేస్తున్నారని లేదా ఇంటర్నెట్లో చూసి డైట్ మార్చుకోవడం ప్రమాదం. పరిశోధకులు ఈ వివరాలను క్రోడీకరించారు. కేలరీల నియంత్రణ కంటే ఆహారం తీసుకునే సమయంపై దృష్టి పెట్టడం వల్ల ప్రయోజనం శూన్యం. సరైన పోషకాహారం తీసుకోకుండా ఉపవాసాలు ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి కూడా క్షీణిస్తోంది. శరీరం తనను తాను రక్షించుకునే సామర్థ్యాన్ని కోల్పోతోంది.
డైట్ పేరుతో శరీరాన్ని హింసించడం…
డైట్ పేరుతో శరీరాన్ని హింసించడం మానుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. సమతుల్య ఆహారం… క్రమబద్ధమైన వ్యాయామమే సరైన మార్గం. ఒక్కసారిగా ఆహారం మానేయడం వల్ల గుండెపై అదనపు భారం పడుతోంది. ప్రాణం పోయిన తర్వాత బరువు తగ్గి ప్రయోజనం లేదని గుర్తించాలి. ఈ కొత్త పరిశోధన ఫలితాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డైట్ నిపుణులను పునరాలోచనలో పడేశాయి. ఆరోగ్య సూత్రాలను పాటించేటప్పుడు శాస్త్రీయ ఆధారాలను మాత్రమే నమ్మాలి.