- ఇండిగో ప్రయాణికులు ఇక్కట్లు పడుతుంటే రామ్మోహన్ నెట్ ప్రాక్టీస్ చేస్తున్నాడా?
- రిపబ్లిక్ టీవీ ప్రజెంటర్ అర్నాబ్ గోస్వామి ప్రశ్నల వర్షం
- నారా లోకేష్ పర్యవేక్షిస్తున్నాడని టీడీపీ నాయకుల వింత సమాధానం
- కేంద్ర ప్రభుత్వ సమస్య పరిష్కారంలో లోకేష్ కు ఏం సంబంధం?
సహనం వందే, అమరావతి:
దేశంలో ఇండిగో విమానయాన సంస్థ సృష్టించిన సంక్షోభంపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వైఖరి తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇంత పెద్ద సమస్య ఏర్పడి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నా, కేంద్ర మంత్రి మాత్రం కనీసం స్పందించడం లేదని, బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని జాతీయ మీడియా దుమ్మెత్తిపోస్తోంది. అసలు మంత్రి ఏం చేస్తున్నారంటూ… నెట్ ప్రాక్టీస్లో మునిగితేలుతున్నారా? లేక రీల్స్, నెట్ ఫ్లిక్స్ చూస్తున్నాడా? అంటూ రిపబ్లిక్ టీవీ ప్రజెంటర్ అర్నాబ్ గోస్వామి ప్రశ్నల వర్షం కురిపించారు.
అర్నాబ్ ప్రశ్నలకు… టీడీపీ ఆపసోపాలు
జాతీయ మీడియాలో ముఖ్యంగా రిపబ్లిక్ టీవీలో అర్నాబ్ గోస్వామి లేవనెత్తుతున్న సూటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక టీడీపీ ప్రతినిధులు నానా ఇబ్బందులు పడుతున్నారు. మొదట చర్చలో పాల్గొన్న దీపక్రెడ్డి, ‘ఈ పరిస్థితిని నారా లోకేశ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు… ఇందుకోసం వార్ రూమ్ని కూడా ఏర్పాటుచేశారు’ అని చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో టీడీపీని అభాసుపాలు చేశాయి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని విమానయాన సంస్థకు సంబంధించి లోకేష్ కు సంబంధం ఏంటని పలువురు నిలదీస్తున్నారు.
అర్నాబ్ సవాళ్లు… నీళ్లు నమిలిన పట్టాభిరాం
ఆదివారం మరో ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాంను చర్చకు పంపిస్తే… అది పార్టీకి రెండింతలు పరాభవం మిగిల్చింది. అర్నాబ్ గోస్వామి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పట్టాభి నీళ్లు నమిలారు. ‘మీ తెలుగుదేశం పార్టీకి చెందిన రామ్మోహన్ నాయుడు విమానయాన శాఖ నిర్వహిస్తున్నారు. ఆయన ఏం చేస్తున్నారు? నెట్ ప్రాక్టీస్ చేస్తున్నారా?’ అని పట్టాభిని సూటిగా అర్నాబ్ ప్రశ్నించారు. సమస్యను తెలుసుకోవడానికి తాను మంత్రికి ఫోన్ చేస్తే, ఆయన ‘హలో హలో’ అంటూ ఫోన్ పెట్టేశారని అర్నాబ్ మండిపడ్డారు.
ధైర్యముంటే చర్చకు రండి…
‘ధైర్యం ఉంటే ఈరోజు చర్చలో మంత్రి పాల్గొనాలి’ అంటూ అర్నాబ్ పట్టాభికి సవాల్ విసిరారు. ఈరోజు తన చర్చలో ప్రజలకు సమాధానం చెప్పాల్సిందేనంటూ రెట్టించి అడిగారు. మంత్రి సమస్యను పరిష్కరించడానికి కృషిచేస్తున్నారని పట్టాభి అనగానే, ‘సమస్య పరిష్కారమంటే కూర్చుని నెట్ ప్రాక్టీస్ చేస్తున్నాడా?’ అంటూ అర్నాబ్ నిలదీశారు. పరిస్థితి అదుపులో ఉంది అని పట్టాభి చెప్పినా, ‘అయితే మీ మంత్రిని నా కాల్ లిఫ్ట్ చేయమనండి’ అంటూ అర్నాబ్ సవాల్ను మరింత పెంచారు. ఇంతమంది ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, తెలుసుకోవడానికి ఫోన్ చేస్తే మంత్రి ఫోన్ పెట్టేస్తారా అంటూ అర్నాబ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తలలు పట్టుకుంటున్న తెలుగుదేశం నేతలు
కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వ్యవహార శైలి కారణంగా వరుసగా రెండ్రోజులు జాతీయస్థాయిలో తెలుగుదేశం పార్టీ అప్రతిష్టపాలు కావడంతో పాటు సామాజిక మాధ్యమాల్లోనూ పరువు పోయింది. దీంతో ఆ పార్టీ నేతలు తమ అధినాయకత్వం వైఖరిపై తలలు పట్టుకుంటున్నారు. ప్రజల కష్టాలను పట్టించుకోకుండా కేంద్రమంత్రి ఇంత బాధ్యతారహితంగా ఉండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.