- అమెరికా తర్వాత భారతే టాప్
- టాటా గ్రూప్తో భారీ పొత్తు
- డేటా సెంటర్లపై భారీ గురి
- ఉచితం నుంచి లాభాల వేట
సహనం వందే, హైదరాబాద్:
భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద కృత్రిమ మేధస్సు (ఏఐ) మార్కెట్గా అవతరించింది. కేవలం చాట్ జీపీటీ ఒక్కటే వారానికి 10 కోట్ల మంది వినియోగదారులను కలిగి ఉంది. అయితే ఈ భారీ వినియోగం కంపెనీకి ఆదాయాన్ని తెచ్చిపెడుతుందా అన్నదే ఇప్పుడు అసలైన ప్రశ్న. కేవలం ఏడాది కాలంలోనే ఇక్కడి వినియోగదారులు 4 రెట్లు పెరగడం విశేషం.
ఖజానా నింపే కొత్త వ్యూహం
ఓపెన్ ఏఐ సంస్థ ఇప్పుడు తన దృష్టిని కేవలం వాడుకందారుల సంఖ్య మీద కాకుండా గల్లా పెట్టె నింపడంపై పెట్టింది. ఇందుకోసం 4 అంచెల వ్యూహాన్ని అమలు చేస్తోంది. ధరల విషయంలో భారతీయులు చాలా సున్నితంగా ఉంటారు. అందుకే తక్కువ ధరకే లభించే చాట్ జీపీటీ గో వంటి ప్లాన్లను ఇక్కడ పరీక్షిస్తోంది. కేవలం డిజిటల్ వినియోగం పెరిగితే సరిపోదని ఆదాయం కూడా రావాలని సంస్థ భావిస్తోంది.
కార్పొరేట్ దిగ్గజాలతో చేతులు కలిపి
అసలైన లాభాలు కార్పొరేట్ వ్యాపారాల నుంచే వస్తాయని ఓపెన్ ఏఐ నమ్ముతోంది. అందుకే టాటా గ్రూప్, టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థలతో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇప్పటికే ఏపీఐలు, ఎంటర్ ప్రైజ్ సొల్యూషన్ల ద్వారా భారత్లో ఆదాయం రావడం మొదలైంది. వ్యాపార రంగంలో ఏఐ వినియోగాన్ని పెంచడం ద్వారా స్థిరమైన లాభాలను ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
డేటా నిధులపై ఓపెన్ ఏఐ కన్ను
ప్రపంచవ్యాప్త డేటాలో 20 శాతం భారత్ నుంచే పుడుతోంది. కానీ మన దేశంలో డేటా సెంటర్ల సామర్థ్యం కేవలం 3 శాతం మాత్రమే ఉంది. ఈ లోటును పూడ్చేందుకు ఓపెన్ ఏఐ ఇక్కడ స్థానిక డేటా సెంటర్లను నిర్మించే యోచనలో ఉంది. స్థానిక డేటా అవసరాలను తీరుస్తూనే పనితీరును మెరుగుపరచడం దీని ప్రధాన ఉద్దేశం. మౌలిక సదుపాయాల కల్పన ద్వారా మార్కెట్పై పట్టు సాధించాలని చూస్తోంది.

విలువ ఉంటేనే రూపాయి రాలుతుంది
భారతీయులు కేవలం తక్కువ ధరనే కాదు ఇచ్చే ధరకు తగ్గ విలువను కూడా ఆశిస్తారు. ఏఐ వాడకం వల్ల తమ వ్యాపారాల్లో స్పష్టమైన ఫలితాలు కనిపిస్తేనే కంపెనీలు డబ్బులు చెల్లిస్తాయి. ఇది ఏఐ కంపెనీలకు అతిపెద్ద సవాలుగా మారింది. కేవలం సాంకేతికత అందుబాటులో ఉంటే సరిపోదు అది వాస్తవ ఫలితాలను ఇవ్వాలి. అప్పుడే భారత్ లాంటి దేశాల్లో ఏఐ వ్యాపారం విజయం సాధిస్తుంది.
నిపుణుల లోతైన విశ్లేషణ
భారత్లో ఉచిత సేవలు అందించడం వల్ల ఏఐ కంపెనీలకు భారీగా డేటా, వినియోగదారుల ఉద్దేశాలు తెలుస్తాయి. ఇది ప్రత్యర్థులపై పైచేయి సాధించేందుకు వీలు కల్పిస్తుంది. చైనాలో ఏఐ కంపెనీలు వాడుకందారులకు డబ్బులు ఇచ్చి మరీ తమ చాట్బాట్లను వాడిస్తున్నాయి. కానీ భారత్లో ఓపెన్ ఏఐ నేరుగా వినియోగదారుల నుంచి ఆదాయం పిండుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.
భవిష్యత్తు తరమే అసలైన పెట్టుబడి
డెవలపర్లు, విద్యా రంగంలో ముందుగానే పాగా వేయడం ద్వారా ఓపెన్ ఏఐ తన భవిష్యత్తు యూజర్లను సిద్ధం చేసుకుంటోంది. విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఏఐకి అలవాటు పడితే అది దీర్ఘకాలంలో కంపెనీకి లాభదాయకం అవుతుంది. భారత్లో సామ్ ఆల్ట్మాన్ పర్యటన తర్వాత ఈ కార్యకలాపాలు మరింత వేగవంతం అయ్యాయి. ఏఐ యుద్ధంలో భారత్ ఇప్పుడు నిర్ణయాత్మక శక్తిగా మారింది.