సహనం వందే, విశాఖపట్నం:
భారతదేశంలోనే అతి పొడవైన గాజు ఆకాశ వంతెన (గ్లాస్ స్కైవాక్) ఇప్పుడు సాగర తీరం విశాఖపట్నంలో అందుబాటులోకి వచ్చింది. కైలాసగిరి పర్వత శిఖరంపై రెండు కొండల మధ్య నిర్మించిన ఈ వంతెన పర్యాటక ప్రియులను మంత్రముగ్ధులను చేస్తోంది. సుమారు 120 మీటర్ల పొడవున్న ఈ గాజు వంతెన కింద నీలి సముద్రం కనిపిస్తుంటే సందర్శకులకు ఆకాశంలో తేలియాడుతున్న అనుభూతి కలుగుతోంది. సాహసాలను, అద్భుతమైన దృశ్యాలను కోరుకునే యువతకు ఇది ఓ కొత్త గమ్యస్థానం.

రెండు కొండలను కలిపిన అద్భుత కళాఖండం
కైలాసగిరిలోని రెండు ప్రధాన శిఖరాలను కలుపుతూ నిర్మించిన ఈ వంతెన ఇంజనీరింగ్ అద్భుతం. ఒకేసారి 150 మంది వరకు దీనిపై నడవగలిగే సామర్థ్యం ఉంది. వంతెన అడుగున కనిపించే లోయ, దూరం నుండి పలకరించే బంగాళాఖాతం, కెరటాల దృశ్యం… ఇలాంటి పనోరమిక్ వ్యూ భారతదేశంలో ఎక్కడా లభించడం లేదని పర్యాటక అధికారులు సగర్వంగా చెబుతున్నారు. ఈ కొత్త హంగు విశాఖ టూరిజం రంగానికి కొత్త కళను తీసుకొచ్చింది.
45 టన్నుల బరువు మోయగలదు…
ఈ గాజు వంతెన నిర్మాణం విషయంలో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. మూడు పొరల టఫెన్డ్ గ్లాస్తో దీనిని తయారు చేశారు. ఇది దాదాపు 45 టన్నుల బరువును మోయగలుగుతుంది. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో గాలి వీచినా కూడా వంతెన స్థిరంగా ఉంటుంది. రాత్రిపూట ప్రత్యేకంగా అమర్చిన ఎల్ఈడీ లైట్లతో ఈ వంతెన మెరిసిపోతూ అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఇది తెరిచి ఉంటుంది.
పెద్దలకు 100 రూపాయల టికెట్…
విశాఖ వచ్చే పర్యాటకులకు ఈ గాజు వంతెన మరో ఆకర్షణగా మారింది. కైలాసగిరి రోప్వే టికెట్తోపాటు గాజు వంతెన మీద నడవడానికి పెద్దలకు 100 రూపాయలు, పిల్లలకు 50 రూపాయలు మాత్రమే అదనంగా చెల్లించాలి. వారాంతాల్లో భారీ రద్దీ ఉండే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. కాబట్టి లైన్లలో నిరీక్షించకుండా ఉండాలంటే ఆన్లైన్లో ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవడం మంచిది. ఇప్పటివరకు ఆర్కే బీచ్, సింహాచలం, సబ్ మెరైన్ మ్యూజియం వంటి వాటితో సరిపెట్టుకున్న పర్యాటకులకు ఇప్పుడు ఈ గాజు వంతెన కొత్త అనుభూతిగా మారింది. విశాఖకు వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పకుండా ఆకాశంలో నడవాల్సిన సమయం ఇది!