- ఉదయం టిఫిన్… మధ్యాహ్నం బిర్యానీ
- రాత్రి ఉండే వారికి మందు… ప్రత్యేక విందు
- నకిలీ కేసు షీట్లు కూడా తయారు చేశారు
- ఎన్ఎంసీ తనిఖీలకు సిద్ధమైన కాలేజీ
- ‘సహనం వందే, ఆర్టికల్ టుడే’ కథనాలతో తనిఖీలకు బ్రేక్
- ముందస్తు లీకులపై ప్రత్యేక స్టోరీ రావడంతో వెనక్కు తగ్గిన ఎన్ఎంసీ
సహనం వందే, హైదరాబాద్:
వికారాబాద్ లోని మహావీర్ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సోమవారం ప్రారంభం కావాల్సిన నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) తనిఖీలకు బ్రేక్ పడింది. సహనం వందే, ఆర్టికల్ టుడే డిజిటల్ పేపర్లలో వచ్చిన కథనాలతో ఎన్ఎంసీ అధికారులు వెనక్కి తగ్గారు. ముందస్తు సమాచారం ఇచ్చి మహావీర్ మెడికల్ కాలేజీకి తనిఖీలకు వస్తున్నారని సహనం వందే, ఆర్టికల్ టుడే లు (sahanamvande.com & articletoday.in) ప్రచురించడం సంచలనం అయ్యింది. ఈ విషయం ఎన్ఎంసీ చైర్మన్ దృష్టికి కూడా వెళ్లడంతో సంబంధిత అధికారులపై ఆయన సీరియస్ అయినట్లు సమాచారం. కాగా ముందస్తు సమాచారం తీసుకున్న మహావీర్ మెడికల్ కాలేజ్ యాజమాన్యం… నకిలీ రోగులను సిద్ధం చేసుకుంది.
దాదాపు 80 మందిని వివిధ ప్రాంతాల నుంచి లారీలలో తీసుకువచ్చింది. రోజుకు ఒక్కొక్కరికి 2 వేల రూపాయలు చొప్పున ఇవ్వడం, ఉదయం టిఫిన్, మధ్యాహ్నం బిర్యాని... తాగేవారికి రాత్రిపూట మందు బాటిల్ ఇచ్చేలా మాట్లాడుకున్నారు. వాళ్ల పేర్ల మీద నకిలీ కేస్ షీట్లు కూడా తయారు చేశారు. ఆ కేస్ షీట్ల మీద ఏదైతే జబ్బు ఉందో ఆ జబ్బు వివరాలకు తగినట్లు నకిలీ రోగులు ఎంఎంసీ బృందానికి చెప్పాలని ప్రత్యేక ట్రైనింగ్ కూడా ఇచ్చారు. సినిమా షూటింగ్లో రెడీ… యాక్షన్ అన్నట్లు అందరినీ సిద్ధం చేశారు. అలాగే ఆగమేఘాల మీద ఎక్కడెక్కడో ఉన్న హెచ్ఓడీలను రప్పించుకున్నారు. ఒక రకంగా మహావీర్ మెడికల్ కాలేజీ సినిమా సెట్టింగ్ లో ఉన్నట్లు తయారు చేశారు. కొద్దిమంది మినహా అక్కడ ఉన్న వారిలో చాలామంది యాక్షన్ కు రెడీ అయి వచ్చినవారే.
అదనపు సీట్ల కోసం ప్రయత్నాలు...
మహావీర్ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ప్రస్తుతం ఉన్న ఎంబీబీఎస్ సీట్లను పెంచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. అందుకోసం ఎన్ఎంసీకి దరఖాస్తు చేసినట్టు సమాచారం. అందులో భాగంగా… అలాగే పీజీ కోర్సుల ప్రారంభం కారణంగా ఎన్ఎంసీ తనిఖీలు చేపడుతుంది. అయితే ఆ మేరకు అవసరమైన సదుపాయాలు కల్పించడంలో యాజమాన్యం విఫలం చెందిందన్న విమర్శలు ఉన్నాయి. దీంతో ఎన్ఎంసీకి చెందిన కొంతమంది అధికారులను యాజమాన్యం మేనేజ్ చేసిందన్న విమర్శలు ఉన్నాయి. ముందస్తుగా సమాచారం ఇచ్చి తనిఖీలు చేసి అంతా సవ్యంగా ఉందని ఒప్పించేలా చేసేందుకు కొందరు ఎన్ఎంసి అధికారులకు దాదాపు రూ. రెండు కోట్లు ఇచ్చేందుకు డీల్ మాట్లాడినట్లు సమాచారం. మొత్తం పని అయ్యాక మరో రెండు కోట్లు ఇచ్చేలా అంగీకారం కుదిరినట్లు ఢిల్లీలోని ఎన్ఎంసీ కార్యాలయ ఉద్యోగి ఒకరు వెల్లడించారు.
ఇదిలా ఉండగా మూడేళ్ల క్రితం తనిఖీల సందర్భంగా అనేక లోపాలు గుర్తించడంతో ఆ కాలేజీకి ఆ ఏడాది అనుమతి రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయినా యాజమాన్యం తన తీరును మార్చుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎన్ఎంసీ అధికారులు ఆ కాలేజీ వ్యవహారం తెలిసి కూడా ముందస్తు సమాచారం ఇవ్వడంలో మతలబు ఏంటని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం కూడా ఎన్ఎంసీ అధికారులు వచ్చే అవకాశం ఉందని… కాబట్టి నకిలీ రోగులు మెడికల్ కాలేజీలోనే ఉండాలని యాజమాన్యం ఆదేశించినట్లు తెలిసింది.