- ఆయన చేతుల్లో నాలుగు కీలక విభాగాలు
- ఫైనాన్స్, కన్జ్యూమర్, బల్క్ మార్కెటింగ్, ఓపీఎస్ ల్లో పాగా
- అలాగే జొన్న సత్యనారాయణ చేతుల్లోనూ రెండు కీలక విభాగాలు
- ఈ ఇద్దరి వద్దే అధికార కేంద్రీకరణ… సంస్థకు తీరని హాని
- అనేకమంది అర్హులను పక్కనపెట్టి వీరిద్దరికే పెద్ద పీట వేయడంపై సందేహాలు
సహనం వందే, హైదరాబాద్:
ఆయిల్ ఫెడ్ ఇద్దరి కబంధహస్తాల్లో చిక్కుకుపోయింది. వారిద్దరే ఆ సంస్థను తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. ఆయిల్ ఫెడ్ లోని కీలక విభాగాల్లో పాగా వేశారు. దీంతో వారు ఆడింది ఆట… పాడింది పాటగా మారింది. వారు ఏం చెప్తే అది జరుగుతుంది. వారిద్దరి సేవలో ఆయిల్ ఫెడ్ సంస్థ పునీతమవుతుంది. వారే తిరుమలేశ్వర్ రెడ్డి… జొన్న సత్యనారాయణ. తిరుమలేశ్వర్ రెడ్డి ఫైనాన్స్, కన్జ్యూమర్ మార్కెటింగ్, బల్క్ మార్కెటింగ్, ఓపీఎస్ వంటి విభాగాలకు మేనేజర్ గా ఉన్నారు. ఆయన ‘నాలుగు చేతులా’ పని భారం మోస్తున్నారని ఉద్యోగులు అంటున్నారు. ఇక జొన్న సత్యనారాయణ చేతిలో హెచ్ఆర్, ప్లాంట్స్ అండ్ ప్రాజెక్ట్స్ విభాగాలు ఉన్నాయి. వారిద్దరికీ కీలక వ్యక్తుల అండదండలు… ఆశీర్వాదాలు ఉన్నట్లు ఉద్యోగులు చెప్తున్నారు.
కేంద్రీకరణతో సంస్థకు నష్టం…
వ్యవసాయశాఖ కార్పొరేషన్లలో అత్యంత లాభదాయకమైన సంస్థ ఆయిల్ ఫెడ్. వందల కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతుంటాయి. ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణాన్ని పెంచాలన్న ప్రభుత్వ లక్ష్యం నేపథ్యంలో ఈ సంస్థ ప్రాధాన్యం పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగును పెంచే దిశగా కసరత్తు జరుగుతుంది. అందుకు అనుగుణంగా అవసరమైన చోట ఫ్యాక్టరీలు నిర్మిస్తున్నారు. ఇంతటి కీలకమైనటువంటి సమయంలో ఇద్దరు వ్యక్తులకు ముఖ్యమైన విభాగాలు అప్పగించడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తిరుమలేశ్వర్ రెడ్డి దగ్గర ఫైనాన్స్ వంటి కీలక విభాగం ఉంది. ఈ విభాగం ద్వారానే ఆ సంస్థ చేపడుతున్న వందలాది కోట్ల రూపాయల పనులకు క్లియరెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత అతని మీదే ఉంటుంది. టెండర్ల ప్రక్రియ, ఆర్థిక లావాదేవీల్లో ఆయన పాత్ర ముఖ్యమైనది. ఇటువంటి పరిస్థితుల్లో దళారులు, అక్రమార్కులు ప్రవేశించి ప్రలోభపరిచే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలి. ఒకరే అన్ని బాధ్యతలు తీసుకోవడం వల్ల సంస్థకు నష్టం జరిగే అవకాశం ఉందని పలువురు ఉద్యోగులు అంటున్నారు.
ఆయిల్ ఫెడ్ వీరి సొంత సంస్థానమా?
ఆయిల్ ఫెడ్ సంస్థ ప్రభుత్వ ఆధ్వర్యంలోని కార్పొరేషన్. ఇదేమీ ప్రైవేట్ సంస్థ కాదు. కాబట్టి అందులోని వ్యక్తులు అంతా నిబంధనల ప్రకారం పని చేయాల్సిందే. అది ఎవరి జాగీరూ కాదు. జవాబుదారీతనం తప్పనిసరిగా పాటించాల్సిందే. ఇటువంటి సంస్థలో ఇద్దరు వ్యక్తులే అతి ముఖ్యమైన పోస్టుల్లో అదనపు బాధ్యతల్లో ఉండాల్సిన అవసరం ఏంటని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఈ బాధ్యతలకు అర్హులైనటువంటి మహమ్మద్ మోయిన్, జి.సునీత కుమారి, శశికళ, స్వర్ణలత ఉన్నారు. వారికి బాధ్యత అప్పగించకుండా ఇద్దరు ఆరు విభాగాలకు మేనేజర్లుగా ఉంచాల్సిన అవసరం ఏంటని నిలదీస్తున్నారు.
పాతాళంలోకి విజయ నూనె...
మార్కెటింగ్ లో కీలకమైన విజయ నూనెల విక్రయం ఎంతో ఛాలెంజింగ్ తో కూడి ఉన్నది. మార్కెట్లో అనేక ప్రైవేటు కంపెనీలు దూసుకుపోతుంటే, విజయ నూనెల వాటా అనుకున్నంత స్థాయిలో లేదు. సిద్దిపేట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ టెండర్ల విషయంలోనూ… దానికి 300 కోట్ల రూపాయలు కేటాయించడంలోనూ విమర్శలు ఉన్నాయి. వీటన్నింటినీ సరిగా చూసుకొని ఫైనాన్స్ క్లియరెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత తిరుమలేశ్వర్ రెడ్డిదేనని అంటున్నారు. హైదరాబాదులోని శివరాంపల్లిలో ఉన్న ఓపీఎస్ ఫ్యాక్టరీ కూడా ఆయనకే అప్పగించారు. ఆరేడు నెలల క్రితం అక్కడ వెంకటేశ్వర్ రెడ్డి మేనేజర్ గా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. దాన్ని మరొకరికి ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ తిరుమలేశ్వర్ రెడ్డే దాని బాధ్యతలు తీసుకోవడంపై విమర్శలు ఉన్నాయి. పూర్తిస్థాయి మేనేజర్ గా మరొకరికి బాధ్యతలు ఇవ్వకపోవడంపై పలువురు మండిపడుతున్నారు.
వీళ్ళేమి టెక్నికల్ కాదు…
ఆ సంస్థలో టెక్నికల్, నాన్ టెక్నికల్ తో సంబంధం లేకుండా బాధ్యతలు నిర్వహించడం పట్ల కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదాహరణకు తిరుమలేశ్వర్ రెడ్డి సైన్స్ బ్యాక్ గ్రౌండ్ నుంచి రాగా… సంబంధం లేని ఫైనాన్స్, మార్కెటింగ్ వ్యవహారాలు చూస్తున్నారు. జొన్న సత్యనారాయణ బీటెక్ చదవగా… ఆయన హెచ్ఆర్ చూస్తున్నారు. అలాగే స్వప్న ఎంబీఏ చదవగా... టెక్నికల్ పోస్ట్ అయిన ఆయిల్ పామ్ మేనేజర్ గా ఉన్నారు. ఏమాత్రం తమ అర్హతకు సంబంధం లేని వాటిల్లో కూడా ఆ ఇద్దరు ఆరు విభాగాలు చూడడంలో ఆంతర్యం ఏంటని ఒక సీనియర్ అధికారి నిలదీశారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జోక్యం చేసుకొని పరిస్థితిని చక్కదిద్దాలని ఆ అధికారి విజ్ఞప్తి చేస్తున్నారు.