తమన్నాకు కన్నడిగుల షాక్

మైసూర్ శాండల్ సబ్బుకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడంపై ఫైర్

ప్రఖ్యాత మైసూర్ శాండల్ సబ్బుకు కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్, టాలీవుడ్ నటి తమన్నా భాటియాను నియమించడం కర్ణాటకలో పెను దుమారం రేపుతోంది. రెండేళ్ల కాలానికి ఏకంగా రూ. 6.2 కోట్ల భారీ మొత్తంతో కుదిరిన ఈ ఒప్పందంపై కన్నడిగులు మండిపడుతున్నారు. స్థానిక నటులను పక్కనపెట్టి, బయటివారిని ఎంపిక చేయడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం ఒక వ్యాపార నిర్ణయం కాదని, కన్నడ సంస్కృతిని, కన్నడ ప్రజల మనోభావాలను అవమానించడమే అని మండిపడుతున్నారు.

కేఎస్ డీఎల్ లక్ష్యంపై నీలినీడలు!
కర్ణాటక ప్రభుత్వ ఆధ్వర్యంలోని కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ (కేఎస్ డీఎల్), 2028 నాటికి రూ. 5000 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని చేరుకోవాలని చెబుతోంది. తమన్నా భాటియాకు 28.2 మిలియన్ల ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు ఉన్నారని, ఆమె పాన్-ఇండియా ఆదరణతో బ్రాండ్‌ను కర్ణాటక సరిహద్దులు దాటి విస్తరించవచ్చని కేఎస్ డీఎల్ భావిస్తోంది. కేఎస్ డీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రశాంత్ పీకేఎం మాట్లాడుతూ, తమ కమిటీ తమన్నానే ఉత్తమ ఎంపిక అని భావించిందని తెలిపారు. అయితే, ఈ మాటలను కన్నడిగులు నమ్మడం లేదు. అంత పెద్ద మొత్తాన్ని ఒక బయటి నటికి ఎందుకు చెల్లిస్తున్నారు? కర్ణాటకలో దీపికా పదుకొణె, రష్మిక మందన్న వంటి ఎంతోమంది ప్రఖ్యాత నటీమణులు ఉన్నప్పటికీ, వారిని కాదని తమన్నాను ఎంపిక చేయడం వెనుక ఏదో కుట్ర దాగి ఉందని కొందరు అనుమానిస్తున్నారు. ఇది కేవలం వ్యాపార నిర్ణయం కాదని, రాజకీయ జోక్యం కూడా ఉండవచ్చునని విమర్శలు వినిపిస్తున్నాయి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *