- సొంత గడ్డపైనే విదేశీ విద్యకు అవకాశం
- ఇండియాలో గ్లోబల్ యూనివర్సిటీల క్యూ
- వేల కోట్లు ఆదా… వీసా కష్టాలకు చెక్
సహనం వందే, హైదరాబాద్:
దశాబ్దాలుగా భారతీయ విద్యార్థులు విదేశీ చదువుల కోసం దేశం దాటి వెళ్లారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. విదేశీ విశ్వవిద్యాలయాలే భారత్కు తరలివస్తున్నాయి. వీసా ఆంక్షలు, నిధుల కొరతతో అగ్రరాజ్యాల వర్సిటీలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. మన దేశంలోని భారీ జనాభా, కొత్త విద్యా విధానం ఇప్పుడు ప్రపంచానికి ఆకర్షణీయంగా మారాయి.

తిరగబడ్డ విద్యా చరిత్ర…
భారతదేశం ఒకప్పుడు ప్రపంచానికి విద్యార్థులను ఎగుమతి చేసే దేశంగా ఉండేది. అమెరికా, బ్రిటన్ వంటి దేశాలకు లక్షల మంది వెళ్లేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి వేగంగా మారుతోంది. విదేశీ వర్సిటీలే నేరుగా భారత్లో క్యాంపస్లు పెడుతున్నాయి. డెలాయిట్ ఇండియా భాగస్వామి సాహిల్ గుప్తా దీనిని గ్లోబల్ డిస్ట్రప్షన్ అని పిలుస్తున్నారు. కెనడా, ఆస్ట్రేలియాలో మారిన వీసా నిబంధనలే దీనికి ప్రధాన కారణం.
అపరిమితమైన విద్యార్థుల సంఖ్య
భారత్లో 18 నుండి 23 ఏళ్ల మధ్య వయస్సున్న వారు 15.5 కోట్ల మంది ఉన్నారు. ప్రస్తుతం ఉన్నత విద్యలో ప్రవేశాల శాతం కేవలం 34 శాతంగానే ఉంది. దీనిని 50 శాతానికి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అంటే మరో 2.2 కోట్ల నుండి 3.2 కోట్ల మంది విద్యార్థులు ఈ వ్యవస్థలోకి వస్తారు. ఇంతటి భారీ డిమాండ్ను తట్టుకోవడం దేశీయ సంస్థలకు కష్టంగా మారింది. దీనిని ఒక వ్యాపార అవకాశంగా విదేశీ వర్సిటీలు చూస్తున్నాయి.
ప్రవేశ పరీక్షల గండం
దేశంలో ప్రతిభ ఉన్నా సీట్లు దొరకని పరిస్థితి తీవ్రంగా ఉంది. ఏడాదికి 3 లక్షల మంది క్యాట్ పరీక్ష రాస్తే ఐఐఎంలలో కేవలం 6000 సీట్లు మాత్రమే ఉన్నాయి. జేఈఈ పరీక్షలో 54 వేల మంది నెగ్గితే ఐఐటీలలో 18 వేల సీట్లు మాత్రమే ఉన్నాయి. వేల మంది సమర్థులు సీట్లు దొరకక వెనకబడిపోతున్నారు. విదేశీ వర్సిటీలు రావడం వల్ల ఈ లోటు పూడుతుంది. విద్యార్థులు తమ సొంత గడ్డపైనే గ్లోబల్ డిగ్రీలు పొందే అవకాశం కలుగుతుంది.
కొత్త విద్యా విధానం జోరు
జాతీయ విద్యా విధానం-2020 ప్రపంచ దేశాలను ఆకర్షిస్తోంది. ఇది మల్టీ డిసిప్లినరీ లెర్నింగ్కు పెద్దపీట వేస్తోంది. ఇంజనీరింగ్ విద్యార్థులు ఇప్పుడు ఎకనామిక్స్, డిజైన్ థింకింగ్ కూడా చదువుతున్నారు. గిఫ్ట్ సిటీ నిబంధనల ప్రకారం విదేశీ వర్సిటీలు తమ సొంత క్యాంపస్ ప్రమాణాలనే ఇక్కడ పాటించాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి కోర్సుల్లో నాణ్యమైన శిక్షణ అందుతుంది. పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా సిలబస్ మారుతోంది.
నగరాల్లో వెలుస్తున్న క్యాంపస్లు
విదేశీ వర్సిటీలు ఇప్పుడు భారీ భూముల కంటే నగరాల మధ్యలో క్యాంపస్లు పెట్టడానికి మొగ్గు చూపుతున్నాయి. జైపూర్, కొచ్చి వంటి నగరాలకు కూడా ఇవి విస్తరిస్తున్నాయి. సాహిల్ గుప్తా అంచనా ప్రకారం 2040 నాటికి 5.6 లక్షల మంది విద్యార్థులు భారత్లోనే అంతర్జాతీయ డిగ్రీలు పొందుతారు. దీనివల్ల దేశానికి సుమారు 9.5 లక్షల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది.
ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి…
విదేశీ వర్సిటీల రాకతో కేవలం విద్య మాత్రమే కాదు ఆర్థిక వ్యవస్థ కూడా మారుతుంది. ఇది దేశీయ వర్సిటీలకు పోటీ కాదని సహకారం అని నిపుణులు అంటున్నారు. విదేశీ పెట్టుబడులు, అత్యాధునిక సాంకేతికత దేశంలోకి వస్తాయి. విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. భవిష్యత్తులో భారత్ ప్రపంచ విద్యా కేంద్రంగా మారుతుందనడంలో సందేహం లేదు.