- రూ. 5 కోట్లు వసూలు చేసిన మోసగాడు
- పూర్వ జన్మలో తోబుట్టువని మాయమాటలు
- కొత్త మందు కొనుక్కుని వరల్డ్ సెలబ్రిటీవి అవుతావనీ…
- అందుకు నోబెల్ బహుమతి కూడా వస్తుందని పొగడ్తలు
- దీంతో వైద్యుడి కుటుంబం మొత్తం సరెండర్
- యజ్ఞయాగాల పేరుతో అందినకాడికి దోపిడీ
- ఆవేదన వ్యక్తం చేస్తున్న బంధువులు
సహనం వందే, హైదరాబాద్:
ఆయన ఒక డాక్టర్… హైదరాబాదు నగరంలో మంచి ప్రైవేట్ ప్రాక్టీస్ ఉంది. కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారు. ఆయన ఆస్తులపై ఉప్పల్ ప్రాంతానికి చెందిన శివస్వామి అనే చేతబడి చేసే వ్యక్తి కన్నేశాడు. ఇంకేం రంగంలోకి దిగాడు. ‘నువ్వు నాకు గత జన్మలో సొంత అన్నవి. మనిద్దరం ఒక దేశానికి రాజులం. నాకున్న అతీంద్రియ శక్తులతో ఈ విషయాన్ని గుర్తించాను’ అంటూ మాయ మాటలు చెప్పాడు. ఇంకా ఏమన్నాడంటే, ‘నువ్వు మామూలు డాక్టర్ వి కాదు. భవిష్యత్తులో ఈ ప్రపంచాన్ని పట్టిపీడించే రోగాలన్నింటినీ నయం చేసే మందు కనుక్కుంటావు. ఆ ఒక్క మందుతో సర్వరోగాలను నయం చేయవచ్చు. కరోనా వంటి వైరస్ లను జయించవచ్చు. ఆ మందుతో నువ్వు వేల కోట్ల ఆస్తులకు అధిపతివి అవుతావు. అలా కనుక్కున్న మందుతో నీకు నోబెల్ బహుమతి కూడా వస్తుంది. ప్రపంచంలోనే పెద్ద సెలబ్రిటీవి అవుతావు’ అని చెప్పడంతో ఆ డాక్టర్ నమ్మాడు. గత జన్మలో సొంత అన్నవి అని స్వామీజీ చెప్పడంతో డాక్టర్ ఎమోషనల్ గా ఫీలయ్యాడు. ఆయనతో రక్త సంబంధం ఉందన్న భావనలోకి వెళ్ళిపోయాడు. ఇంకేం శివ స్వామి చేతిలో బందీ అయిపోయాడు.
యజ్ఞయాగాల పేరుతో దోపిడీ…
డాక్టరుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ డాక్టర్ కు ఒక సొంత తమ్ముడు ఉన్నాడు. ఆయన కూడా హైదరాబాదులో పేరొందిన కార్పొరేట్ ఆసుపత్రిలో ప్రముఖ డాక్టర్ గా పనిచేస్తున్నారు. అలాగే సొంత ఆసుపత్రి నడుపుతున్నారు. ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఆ డాక్టర్ కుటుంబాన్ని స్వామి పూర్తి నియంత్రణలోకి తీసుకున్నాడు. కుటుంబ సభ్యులు అంతా ఆయన మాయలో పడిపోయారు. ఏం చెప్తే అది చేస్తున్నారు. యజ్ఞయాగాల పేరుతో ఇప్పటివరకు 5 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు బంధువులు వెల్లడించారు. తన అన్నను స్వామి పూర్తిగా లోబరుచుకున్నారని అతని సోదరుడు వెల్లడించారు. ఆస్తుల పత్రాలు తీసుకోవడం, యజ్ఞాల పేరుతో లక్షలకు లక్షలు వసూలు చేయడం జరుగుతుందని వాపోయాడు. కొన్ని సందర్భాల్లో డబ్బుల కోసం తన అన్న ఆస్తులు అమ్మాడని ఆయన వెల్లడించారు. తమ కుటుంబ ఫంక్షన్లకు కూడా శివ స్వామి వస్తుంటాడని… బంధువులను ఏవో దోషాలు చెబుతూ బెదిరిస్తుంటాడని బాధితుడి అన్న విచారం వ్యక్తం చేశారు. తాము స్వామీని ఎదిరించాలని అనుకున్నప్పటికీ అన్న అడ్డుకుంటున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా ఆ మోసగాడు తమను బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో ఈ విషయం బయటకు వస్తే పరువు పోతుందని భావించి ఏమీ చేయలేకపోతున్నామని అంటున్నారు.
అలాగే లెక్చరర్ ని మోసగించిన స్వామీ…
ఇంటి దిష్టి పోగొడతానంటూ అధ్యాపకురాలిని నమ్మించి మోగించాడు ఈ స్వామీ. భర్త చనిపోవడం, కుటుంబ పరిస్థితి సక్రమంగా లేకపోవడంతో ఒక జూనియర్ కళాశాలలో పనిచేసే ఆమె శివస్వామిని ఆశ్రయించింది. అనంతరం ఆమె ఇంటికి వచ్చిన అతడు… ఇంటి దోషం కారణంగా భర్త చనిపోయాడని, అందుకు పూజలు చేయాలంటూ రూ.1.70 లక్షలు, కనకదుర్గ ఆలయంలో పూజల కోసం 20 తులాల ఆభరణాలు తీసుకున్నాడు. పూజలు చేస్తున్న క్రమంలో ఆలయ అర్చకుడు చనిపోయాడంటూ భయ పెట్టి ఇంటిపత్రాలను కాజేశాడు. ఇలా లక్షలకు లక్షలు కాజేశాడు.