- రాష్ట్రంలో 1.14 లక్షల టన్నుల కొరత
- పరిస్థితిని చక్కదిద్దడంలో ఘోర వైఫల్యం
- సీఎం రేవంత్ అప్రమత్తం చేసినా మారని తీరు
- వ్యవసాయమంత్రి తుమ్మల తూతూ సమీక్ష
- ముందే తెప్పించుకోవడంలో తీవ్ర నిర్లక్ష్యం
- కేంద్రానికి విజ్ఞప్తుల పేరుతో హడావుడి
- కొరత వల్ల బ్లాక్ మార్కెట్ లోకి యూరియా?
- దళారులతో కొందరు అధికారుల కుమ్మక్కు
- ముందస్తు హెచ్చరికలు చేయని మార్క్ ఫెడ్
సహనం వందే, హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడింది. సకాలంలో తెప్పించడంలో వ్యవసాయశాఖ విఫలమైంది. దాహం వేసినప్పుడు బావిని తవ్వినట్లుగా… ఇప్పుడు యూరియా కావాలంటూ హడావుడి చేస్తున్నారు. ముందుగానే కేంద్రం వద్దకు వెళ్లి ప్రయత్నించాల్సింది పోయి… ఇప్పుడు తమ తప్పును ఇతరులపై నెట్టే విధంగా కేంద్రం వద్ద పంచాయతీకి సిద్ధమయ్యారు. సీజన్ కి ముందు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడంలో ఎందుకు వైఫల్యం చెందినట్లు? సీజన్ జోరు మీద ఉన్న సమయంలో ఇప్పుడు హడావుడి చేస్తే వచ్చే ప్రయోజనం ఏంటి?
1.14 లక్షల టన్నుల యూరియా కోత…
ఈ వానాకాలం పంటల సాగుకు రాష్ట్రానికి 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్ర ప్రభుత్వం కేటాయించి, నెలవారీ సరఫరా ప్రణాళికను రాష్ట్రానికి పంపించింది. రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం మాదిరిగానే ఈ ఏదాది కూడా సీజన్ ఆరంభానికి ముందే 5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను నిల్వ ఉంచుకొని, పంటకాలంలో డిమాండ్ కు తగ్గట్లుగా సరఫరాకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు వ్యవసాయశాఖ వెల్లడించింది. అందుకోసం మార్క్ ఫెడ్ ను నోడల్ ఏజెన్సీగా నియమించింది. అయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిన యూరియాలో ఏప్రిల్ నెలకు సంబంధించి 48 వేల మెట్రిక్ టన్నులు, మే నెలకు 66 వేల మెట్రిక్ టన్నుల యూరియాను తక్కువగా సరఫరా చేసింది. మే వరకు కేటాయించిన 3.30 లక్షల మెట్రిక్ టన్నులకుగాను కేవలం 2.16 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేసింది. మిగతా 1.14 లక్షల మెట్రిక్ టన్నులకు కోత పెట్టింది. ఈ కోత వల్ల రైతులకు భారీగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ప్రస్తుత నెలకు 1.70 లక్షల మెట్రిక్ టన్నులు రావాల్సి ఉంది. కానీ ఏ మేరకు వస్తుందోనన్న అనుమానాలు వ్యవసాయ శాఖ వర్గాలను వేధిస్తున్నాయి.
ముందే ఢిల్లీకి ఎందుకు వెళ్లలేదు?
కేంద్ర ప్రభుత్వం వద్ద మన అవసరాలకు తగ్గట్టు యూరియాను తెప్పించుకునేందుకు ఏర్పాటు చేయడంలో వ్యవసాయ శాఖ ఉన్నత స్థాయి వర్గాలు వైఫల్యం చెందుతున్నాయి. సీజన్ కు ముందు ఢిల్లీలో కూర్చుని యూరియాను కేటాయించుకునేలా ప్రయత్నించడంలో యంత్రాంగం వైఫల్యం కనిపిస్తుంది. మార్చి నెలలోనే వ్యవసాయ కీలక అధికారులు ఢిల్లీకి వెళ్లి ఎందుకు ప్రయత్నం చేయలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. మన ప్రయత్నం చేయకుండా కేంద్రం కేటాయించలేదని చెప్పుకోవడం వల్ల రాజకీయ ప్రయోజనం తప్ప రైతులకు ఒరిగేది ఏమీ ఉండదని అంటున్నారు. కేంద్ర వ్యవసాయశాఖ వద్దకు వెళ్లి ప్రయత్నిస్తే చాలా పనులు జరుగుతాయి. కానీ హైదరాబాదు నుంచి కాలు బయట పెట్టకుండా యూరియా కొరత అంటూ గగ్గోలు పెడితే వచ్చే ప్రయోజనం ఏముంటుంది? ఇప్పుడు తాపీగా వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపిని ఢిల్లీకి పంపించాలని నిర్ణయించడం గమనార్హం.
వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తూతూ మంత్రపు సమీక్షలు చేసి వదిలేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలను అమలు చేయడంలో మంత్రి సహా ఆ శాఖ అధికారులు విఫలం అయ్యారన్న ఆరోపణలు వస్తున్నాయి. వ్యవసాయ సీజన్ లో అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవాలని రేవంత్ రెడ్డి హెచ్చరించినా నిర్లక్ష్యం చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి కిందిస్థాయిలో పరిస్థితిని సమీక్షించడంలో విజయవంతం కావడంలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయన ముఖ్యమైన విషయాలపై ఆయన మీడియా సమావేశాలు కూడా పెట్టడం లేదు. మార్క్ ఫెడ్ అధికారులు కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు ఉన్నత స్థాయి వర్గాలకు వివరించడంలో వైఫల్యం చెందుతున్నారు. యూరియా కొరతే లేదని చెప్పుకుంటూ కాలయాపన చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.