మార్క్ ఫెడ్ లో జాగీర్దార్లు

  • కీలకమైన పోస్టుల్లో అనేక ఏళ్లుగా తిష్ట
  • ఎవరూ రాకుండా అడ్డుకునే యత్నం
  • ఆరేళ్లుగా జీఎంగా విష్ణువర్ధన్ రావు కంటిన్యూ
  • ఆయనను తొలగించాలన్న బోర్డు నిర్ణయంపై డోంట్ కేర్
  • ప్రమోషన్లు ఇవ్వకపోవడంతో జీఎం పోస్టు అందుకోలేని రేఖ

మార్క్ ఫెడ్ లో కొందరు ఏళ్లుగా ఒకేచోట పాతుకుపోయారు. దీంతో ఆయా విభాగాల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఆ విభాగాలను తమ సొంత జాగీరులా భావిస్తున్నట్లు తోటి ఉద్యోగులే మండిపడుతున్నారు. వారి పోస్టుల్లోకి ఇతరులను తీసుకురావాలన్న ప్రయత్నాలకు అడ్డుపడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. పై స్థాయి అధికారులను మాయ చేసి తమ విభాగాలను సామంత రాజ్యాలుగా మార్చుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో వారిని కదపడానికి ఎవరూ సాహసించడం లేదు.

ఐదారేళ్లుగా తిష్ట వేసిన జీఎం…
మార్క్ ఫెడ్ జీఎం విష్ణువర్ధన్ రావు సహకార శాఖ నుంచి వచ్చారు. దాదాపు ఐదారేళ్లుగా ఆయన ఇక్కడ పనిచేస్తున్నారు. ఏడాదిన్నర క్రితం ఆయనను తొలగించాలని మార్క్ ఫెడ్ బోర్డే తీర్మానం చేసింది. తమకు వద్దని బోర్డు సభ్యులు కరాఖండిగా చెప్పేశారు. కానీ ఆ నిర్ణయాన్ని కూడా తోసిపుచ్చడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇంత జరిగినా ఆయనను కొనసాగించాల్సిన అవసరం ఏంటని సభ్యులు నిలదీశారు. కానీ వ్యవసాయ ఉన్నతాధికారి అండదండలతో ఆయన కొనసాగుతున్నారు. ప్రజా ప్రతినిధులతో కూడిన బోర్డు తీర్మానాన్ని కూడా ఆ ఉన్నతాధికారి లెక్క చేయకపోవడం నియంతృత్వానికి పరాకాష్టగా ఉద్యోగులు మండిపడుతున్నారు. ఇలాగైతే బోర్డుకు విలువ ఏముంటుందని అంటున్నారు. అంతేకాదు విష్ణువర్ధన్ రావు సేవలపై కూడా ఉద్యోగుల్లో అసంతృప్తి నెలకొంది. తమ ప్రమోషన్లకు అడ్డుపడ్డారని కూడా కొందరు ఆరోపిస్తున్నారు. మార్క్ ఫెడ్ పాలకమండలి సమావేశాలను నిర్వహించడంలో కూడా ఆయన విఫలం అయ్యారని అప్పటి సభ్యులు తప్పుపట్టారు. ఈ అంశం కోర్టు వరకు కూడా వెళ్ళింది. అందువల్ల ఆయన వల్ల తమకు పెద్దగా ప్రయోజనం లేదని ఉద్యోగులు అంటున్నారు. మరోవైపు మార్క్ ఫెడ్ లో సీనియర్ మేనేజర్ గా రేఖకు ఇవ్వాల్సిన జీఎం ప్రమోషన్ ను కూడా ఆపేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకోసం ఆమె చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. ఆమె జీఎం కాకుండా అనేక అడ్డు పుల్లలు వేశారన్న విమర్శలు ఉన్నాయి. అంతే కాదు మేనేజర్లుగా పదోన్నతి పొందాల్సిన డిప్యూటీ మేనేజర్లు ఆయన వల్లనే అక్కడే ఉండి పోవాల్సి వచ్చిందని వాళ్లు విమర్శిస్తున్నారు.

పాతుకుపోయిన చంద్రశేఖర్, రేఖ…
ఆ సంస్థలో కీలకమైన ఎరువుల సరఫరా, పంటల కొనుగోలు, హెచ్ఆర్ డిపార్ట్మెంట్లలో వాటిని నిర్వహిస్తున్న వారు ఏళ్లుగా ఒకేచోట ఉండిపోయారు. ఎరువుల విభాగంలో దాదాపు ఏడెనిమిది సంవత్సరాలుగా సీనియర్ మేనేజర్ రేఖ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమెకు ప్రమోషన్లు ఇచ్చి అక్కడే మరో విభాగానికి పంపించవచ్చు. కానీ అక్కడి నుంచి కదిపించకపోవడంలో ఆంతర్యం అంతుపట్టడం లేదు. ఇక అనేక విమర్శలకు కేంద్రబిందువైన పంటల కొనుగోలు విభాగం అధికారి, డిప్యూటీ మేనేజర్ చంద్రశేఖర్ కూడా దాదాపు 5 ఏళ్లకు పైగా అక్కడే ఉన్నారు. ఆయన హయాంలోనే మొక్కజొన్న విక్రయంలో దాదాపు 1000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఏది ఏమైనా కీలకమైన ఈ రెండు విభాగాలను వారిద్దరికీ ఇన్నేళ్లుగా అప్పగించడం పట్ల అనేకమంది ఇతర సహచరులు, సీనియర్లు మండిపడుతున్నారు. తాము జిల్లాల్లో ఉంటే వీళ్ళు ఇక్కడ పని చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటివరకు చైర్మన్ గా పనిచేసిన మార గంగారెడ్డి వీరిని తప్పించేందుకు ప్రయత్నం చేసినా సఫలం కాలేకపోయారు. కనీసం వాళ్లను అటు ఇటు లేదా మరో విభాగానికి మార్చినా బాగుండేదని అంటున్నారు. ఒక అధికారి ఒకే చోట తిష్ట వేయడం వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయని అందరికీ తెలిసిందే.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *