మార్క్ ఫెడ్ లో ఆ ఒక్కడు!

  • జొన్నల అమ్మకాలకు సంబంధించి కమీషన్ల వ్యవహారంలో కీలకపాత్ర
  • వ్యాపారులతో లాబీయింగ్ చేసి రూ. 93 కోట్ల నష్టాలకు విక్రయించిన వైనం
  • కింది నుంచి పైస్థాయి వరకు ముడుపుల వ్యవహారం
  • వ్యాపారులు, అధికారుల మధ్య సయోధ్య చేసింది అతనే
  • ఒక్కొక్కరికి రూ. 50 లక్షల నుంచి రూ. కోటి వరకు కమీషన్లు?

మార్క్ ఫెడ్ సంస్థలో రైతులకు చేస్తున్న సాయం కంటే కొందరు అధికారులు మేయడమే ఎక్కువగా ఉందన్న విమర్శలు ఉన్నాయి. సంస్థ నష్టాల ఊబిలో కూరుకుపోయినా పర్వాలేదు… కానీ తమ జేబులు నింపుకునేలా కొందరు అధికారులు పావులు కదుపుతుంటారు. మార్క్ ఫెడ్ సంస్థను తమ సొంత జాగీరులా భావిస్తూ కోట్లు గడిస్తున్నారు. ఈ సంస్థలో సాధారణ కింది స్థాయి అధికారి కూడా ఐఏఎస్, ఐపీఎస్ వంటి అధికారులకు ఏమాత్రం తగ్గకుండా మెయింటైన్ చేస్తుంటారు. ఒక కింది స్థాయి అధికారి జీతం చూస్తే చాలా తక్కువగా ఉంటుంది. వారు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కొనడం కూడా కష్టమైన పని. అలాంటి ఒక ఉద్యోగి విల్లా, ఫ్లాట్, తన సొంతూరులో భూములు కొంటున్నాడు. మార్క్ ఫెడ్ ను బంగారు బాతు గుడ్డుగా భావిస్తూ దోచేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.

జొన్నల అమ్మకాలలో కోట్ల కమీషన్లు…
గత ఏడాది రైతుల నుంచి కొనుగోలు చేసిన జొన్నలను వ్యాపారులకు అమ్మడం ద్వారా మార్క్ ఫెడ్ కు ఏకంగా రూ. 93 కోట్లు నష్టం జరిగింది. ఒకవేళ బహిరంగ మార్కెట్ ధరల ప్రకారం చూసినప్పటికీ ఏకంగా రూ. 60 కోట్ల పైబడి నష్టం జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. తక్కువలో తక్కువగా అమ్మినప్పటికీ 40-50 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లినట్లు చెప్పుకోవచ్చు. ఈ విషయంలో వ్యాపారులకు లాభాలు చేకూర్చేందుకు మార్క్ ఫెడ్ ను ఫణంగా పెట్టారన్న విమర్శలున్నాయి. వ్యాపారులకు, కొందరు అధికారులకు జరిగిన లావాదేవీల్లో రూ. 10 కోట్ల వరకు కమీషన్ల రూపంలో అంగీకారం కుదిరినట్లు ఆ సంస్థ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. అందులో రూ. 50 లక్షల నుంచి రూ.‌ కోటి వరకు వారి స్థాయులను బట్టి పంపకాలకు ఏర్పాట్లు జరిగినట్టు అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. వీటన్నిటికీ మధ్యవర్తిగా అందులో పని చేసే ఒక సీనియర్ అధికారి కీలక వ్యక్తిగా ఉన్నట్లు చెప్తున్నారు. అతను రూ. కోటిన్నర వరకు తీసుకునేలా ప్లాన్ జరిగినట్లు సమాచారం. అలాంటి అగ్రిమెంట్లు చేసుకున్న తర్వాతే టెండర్లు ఖరారు అయ్యాయని అందులోని ఉద్యోగులు చెప్తున్నారు.

వారి ఆస్తులే అందుకు నిదర్శనం…
ఈ విషయంపై ఒక అధికారిని ప్రశ్నించగా అంతా సవ్యంగానే జరుగుతుందని… ఎలాంటి కమీషన్ల వ్యవహారం చోటు చేసుకోలేదని అంటున్నారు. అయితే వారికి ఉన్న ఆస్తిపాస్తులు, జీవనశైలిని బట్టి ఏ స్థాయిలో దోచుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చని కొందరు ఉద్యోగులే కామెంట్ చేస్తున్నారు. గతంలో అక్కడ పనిచేసిన ఒక కీలక అధికారి తన ఇంట్లో శుభకార్యానికి ఏకంగా రెండు కోట్ల రూపాయలు కమీషన్ల రూపంలో అందుకున్నట్లు సమాచారం. అలాగే ప్రస్తుతం కీలక స్థాయిలో ఉన్న అధికారి ఏళ్లుగా అక్కడ తిష్ట వేశారు. అతను మార్క్ ఫెడ్ లో జరిగే అన్ని టెండర్లలో కమీషన్లు అందుకుంటాడు. అతను వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రూ. 15 కోట్లకు పైగా కమీషన్ల రూపంలో తీసుకున్నట్లు ఉద్యోగుల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. వివిధ రూపాల్లో ఈ సొమ్ము ఆయన జేబుల్లోకి వెళ్ళింది. తమ సొంత సంస్థ అని చెప్పుకొంటూ దానికే వెన్నుపోటు పొడుస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ విషయంలో పై స్థాయి నుంచి కిందిస్థాయి అధికారుల వరకు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. విచిత్రమేంటంటే మార్క్ ఫెడ్ తమ ప్రైవేట్ కంపెనీ అని… అందులో ఎంతైనా దోచుకునే అధికారం తమకే ఉందని… ఇతరులు ఎవరు జోక్యం చేసుకోకూడదని వారి ఫీలింగ్. రైతులు ఎవరైనా వచ్చి సమాచారం అడిగినా… ఇటువంటి విషయాలపై నిలదీసినా ఏమాత్రం సహించరు. కొందరు అధికారుల తీరు అయితే తమ వద్దకు ఎవరూ రాకూడదని హుకూం జారీ చేస్తారు.


Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *