జయత్రి గ్రూప్స్ పేరుతో మోసం
సహనం వందే, హైదరాబాద్:
రియల్ ఎస్టేట్ రంగంలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. జయత్రి గ్రూప్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ పేరుతో సుమారు రూ.300 కోట్ల స్కామ్కు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. 2023 జనవరిలో పోలీసులు సంబంధిత డైరెక్టర్ ను అరెస్టు చేసినప్పటికీ, బెయిల్పై విడుదలైన తర్వాత మళ్లీ పరారీలో ఉన్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన మధ్యతరగతి కుటుంబాలను, రిటైర్డ్ ఉద్యోగులను ఆర్థికంగా నిలువునా దోచుకున్న సంఘటనగా నిలిచింది.
ప్రీ-లాంచ్ ఆఫర్ల పేరుతో పచ్చి మోసం
జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో హైదరాబాద్లోని గోపన్పల్లి, కూకట్పల్లి వంటి ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను ప్రారంభించారు. వెస్టిన్ గెలాక్సీ వంటి ప్రాజెక్టులతో పాటు, మెట్రో స్టేషన్ స్టాల్స్, ఫార్మ్ల్యాండ్లు, రిసార్ట్ ప్లాట్ల వంటి ఆకర్షణీయమైన ప్రీ-లాంచ్ ఆఫర్లతో ఆకర్షించారు. అయితే ఈ ప్రాజెక్టులు కేవలం కాగితాలపైనే ఉన్నాయని, భూములు కంపెనీ పేరుపై రిజిస్టర్ కానీ వాస్తవంగా ఉనికిలో లేవని బాధితులు కన్నీటి పర్యంతమవుతున్నారు. 20కి పైగా కంపెనీల ద్వారా 50 మంది వ్యక్తులను డైరెక్టర్లు, సీఈఓలు, మేనేజర్లుగా నియమించి, వారి ద్వారా మోసాలను కొనసాగించారని పోలీసులు తెలిపారు. ఈ కంపెనీలు కేవలం రియల్ ఎస్టేట్తోనే కాకుండా, గ్రానైట్ వ్యాపారం, సూపర్మార్కెట్లు, ఎలక్ట్రిక్ టూ-వీలర్ వ్యాపారాలు, జయ ఫౌండేషన్ పేరుతో పన్ను ఎగవేత వంటి అనేక రంగాల్లో మోసాలకు పాల్పడినట్లు వెల్లడైంది.
బాధితుల ఆవేదన…
ఈ స్కామ్లో బాధితులైన వారిలో ఎక్కువగా మధ్యతరగతి కుటుంబాలు, రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారు. ఒక బాధితుడు మాట్లాడుతూ, “రిటైర్మెంట్ తర్వాత వచ్చిన డబ్బులను జయత్రి గ్రూప్స్లో ఇన్వెస్ట్ చేశాను. కానీ ఇప్పుడు ఏమీ లేకుండా పోయింది. న్యాయం కోసం ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు” అని ఆవేదన వ్యక్తం చేశారు. మరో బాధితుడు అరుణ్ సంతోష్ (మార్చిన పేరు) తన అనుభవాన్ని వెల్లడిస్తూ, “2021లో వెస్టిన్ గెలాక్సీ ప్రాజెక్టులో రూ.11.25 లక్షలు ఇన్వెస్ట్ చేశాను. ఒక రియల్టర్ స్నేహితుడి సిఫార్సుతో ఈ ప్రాజెక్టులో చేరాను. కానీ, ప్రాజెక్టు పూర్తి కాకపోగా, నిందితుడు జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా నిర్మాణం కొనసాగలేదు” అని చెప్పారు.
రెరా జోక్యం… బాధితులకు నిరాశ
ఈ స్కామ్ బాధితులు తమ డబ్బులను తిరిగి పొందేందుకు తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీజీ రెరా)ను ఆశ్రయించారు. 2023 సెప్టెంబర్లో రెరా, సంబంధిత డైరెక్టర్ కు రూ. 50 లక్షల జరిమానా విధించి, బాధితులకు 10 శాతం వడ్డీతో పెట్టుబడి మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ఆదేశించింది. రెరా బాధితులకు సొంతంగా నిధులు సేకరించి ప్రాజెక్టును పూర్తి చేయాలని సూచించింది. రెరా ఇంజనీరింగ్ బృందం నిర్మాణాన్ని పరిశీలించి, 66 శాతం పనులు పూర్తయినట్లు, మిగిలిన నిర్మాణానికి రూ.7.2 కోట్లు అవసరమని నివేదించింది.
మాఫియా తరహా నేరాలు…
నిందితుడు గతంలో విశాఖపట్నం, ఏలూరు, ద్వారకా తిరుమల, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా ఇలాంటి మోసాలకు పాల్పడిన చరిత్ర ఉందని రియల్ ఎస్టేట్ గురు వెబ్సైట్ నివేదికలు వెల్లడించాయి. 2016లో జైలుకు వెళ్లిన తర్వాత హైదరాబాద్కు వచ్చి కొత్త కంపెనీని స్థాపించి మోసాలను కొనసాగించాడని తెలుస్తోంది. అతడి సహచరులు కూడా సమాంతరంగా రియల్ ఎస్టేట్ రంగంలో మోసాలకు పాల్పడుతున్నారని, ఈ కుంభకోణం మాఫియా తరహాలో నడుస్తోందని పోలీసులు గుర్తించారు.