- రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక!
- కొత్త వేరియంట్ల ఉధృతి
సహనం వందే, ఢిల్లీ:
అంతరించిపోయిందనుకున్న కరోనా మహమ్మారి మరోసారి పడగ విప్పుతోంది. కొత్త రూపంలో తిరిగొచ్చి దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో కేసులు గణనీయంగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కొత్త వేరియంట్లను గుర్తించిన నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు కోరుతున్నారు.
నిపుణుల హెచ్చరిక…
భారతీయ జీనోమిక్స్ కన్సార్టియం నిపుణులు ఎన్బి.1.8.1, ఎల్ఎఫ్.7 అనే రెండు కొత్త కరోనా వేరియంట్లను గుర్తించినట్లు తెలిపారు. ఇప్పటికే జేఎన్.1 రకం కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త రకాలు మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, ఆసుపత్రులను అన్ని సౌకర్యాలతో సిద్ధం చేసుకోవాలని కేంద్రం అధికారులకు సూచనలు జారీ చేసింది.
రాష్ట్రాల వారీగా ప్రస్తుత స్థితి…
దేశంలో కేరళలో అత్యధికంగా 273, తమిళనాడులో 66, మహారాష్ట్రలో 56, కర్ణాటకలో 36, ఢిల్లీలో 23 కేసులు నమోదయ్యాయి. కోవిడ్ సంబంధిత లక్షణాలతో ఇప్పటివరకు ఐదుగురు మరణించినట్లు పేర్కొంటున్నారు. మహారాష్ట్రలోని థానేలో 21 ఏళ్ల యువకుడు, బెంగళూరులో 84 ఏళ్ల వృద్ధుడు కరోనాతో మరణించినట్లు చెప్తున్నారు. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.
భయం వద్దు…
దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో అన్ని రాష్ట్రాలను కేంద్రం అలెర్ట్ చేసింది. ముందు జాగ్రత్తగా ఆసుపత్రులను సిద్ధం చేయాలని ఆదేశించింది. అయితే ఆయా రాష్ట్రాల్లోని కరోనా బాధితులకు కేవలం స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. బాధితుల్లో ఎక్కువ మంది ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపింది. కాబట్టి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, కానీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. వ్యక్తిగత శుభ్రత, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి కొనసాగించాలని నిపుణులు నొక్కి చెబుతున్నారు.