- తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా వేడుకలు
- సీఎం రేవంత్ చేతుల మీదుగా ప్రారంభం
సహనం వందే, హైదరాబాద్:
హైదరాబాద్ మహానగరంలో మిస్ వరల్డ్ 2025 పోటీలు కన్నుల పండుగగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. తెలంగాణ సంప్రదాయ సాంస్కృతిక కళలు, పోటీదారుల పాశ్చాత్య కళా ప్రదర్శనల మధ్య ఈ పోటీలు ప్రారంభమైనట్లు ముఖ్యమంత్రి, మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లీ కరతాళ ధ్వనుల మధ్య ప్రకటించారు.
110 దేశాల ప్రతినిధుల ప్రదర్శన
తెలంగాణ సంప్రదాయ కళలు, పోటీదారుల పాశ్చాత్య కళల మేళవింపుతో మిస్ వరల్డ్ వేడుకలు ప్రారంభమయ్యాయి. 110 దేశాలకు చెందిన ప్రతినిధులు ర్యాంప్ పై ప్రదర్శనగా వచ్చి అలరించారు. చివరలో మిస్ ఇండియా నందిని గుప్తా త్రివర్ణ పతాకంతో కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దేశ సరిహద్దుల్లో పోరాడుతున్న సైనికులకు మద్దతుగా, వారి ధైర్యసాహసాలకు నిర్వాహకులు సెల్యూట్ ప్రకటించారు.
లంబాడా కళాకారుల ప్రదర్శన…
తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా లంబాడా కళాకారులు డప్పు, నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. ప్రపంచంలోనే పురాతన కళగా నిర్వాహకులు దీనిని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారులు, కార్పొరేషన్ చైర్మన్లు, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.