- గుజరాతీయులారా ఖబడ్దార్
- భాష, సంస్కృతిని కించపరిస్తే సహించం
- గుజరాతీలకు ఎంఎన్ఎస్ వార్నింగ్
- మాంసం తిన్న మరాఠీలపై గుజరాతీయుల అవహేళన
- మహారాష్ట్రలో మరోసారి ప్రాంతీయ చిచ్చు!
సహనం వందే, ముంబై:
‘ముంబై మరాఠీల అడ్డా. ఇక్కడ ఉంటూ మమ్మల్ని అవమానిస్తే సహించం’ అని మహారాష్ట్ర నవనిర్మాణ సేన హెచ్చరించింది. ముంబైలో మరాఠీలపై గుజరాతీల ఆగడాలపై మండిపడింది. మహారాష్ట్రలో మరోసారి ప్రాంతీయ వివాదం తలెత్తింది. ఘాట్కోపర్లోని శ్రీ సంభవ్ దర్శన్ సొసైటీలో మాంసాహారం తినే మరాఠీ కుటుంబాలను శుక్రవారం గుజరాతీలు దూషించడం తీవ్ర వివాదానికి దారితీసింది. మరాఠీలను అవమానించడంపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) గుజరాతీలకు గట్టి హెచ్చరిక జారీ చేసింది. ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది.
ఘాట్కోపర్లో గుజరాతీల దౌర్జన్యం..
ఘాట్కోపర్లోని శ్రీ సంభవ్ దర్శన్ సొసైటీలో నివసిస్తున్న నాలుగు మరాఠీ కుటుంబాలు చేపలు, మాంసం తినడాన్ని గుజరాతీ నివాసి తీవ్రంగా దూషించాడు. మురికి వాళ్లు అని పిలుస్తూ మరాఠీలను అవమానించాడు. ముంబై గడ్డపైనే మరాఠీలనే కించపరిచే ఈ దుర్మార్గాన్ని ఎంఎన్ఎస్ సహించలేదు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే ఎంఎన్ఎస్ కార్యకర్తలు ఇక్కడకు చేరుకుని గుజరాతీల దురహంకారాన్ని ప్రశ్నించారు.
మరాఠీలను తక్కువ చేస్తే ఊరుకోం…
ఎంఎన్ఎస్ స్థానిక నాయకుడు రాజ్ పర్తే గుజరాతీలకు స్పష్టమైన సందేశం ఇచ్చాడు. ‘ముంబై మరాఠీల సొంతం. ఇక్కడ ఉంటూ మమ్మల్ని అవమానిస్తే సహించం. ఎవరి ఆహారం వారిది, దానిపై మీరెందుకు గొడవ చేస్తార’ని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ వాగ్వాదం వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారి, మరాఠీల ఆవేదనను బహిర్గతం చేసింది. వివాదం రగులుకున్న నేపథ్యంలో ఘాట్కోపర్ పోలీసులు రంగంలోకి దిగారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ‘మరాఠీ కుటుంబాలను అవమానించడం మానుకోండి. లేకపోతే కఠిన చర్యలు తప్పవ’ని గుజరాతీ నివాసితులను హెచ్చరించారు. అయినప్పటికీ, ఈ ఘటనపై ఇప్పటివరకు అధికారిక ఫిర్యాదు నమోదు కాలేదు. మహారాష్ట్ర మంత్రి అశిష్ షెలార్ ఈ అవమానాన్ని తీవ్రంగా ఖండించారు. ‘మరాఠీ భాష, సంస్కృతిని కించపరిచే చర్యలు సహించేది లేదు. ఇలాంటి వివక్షను ప్రభుత్వం ఉపేక్షించద’ని హెచ్చరించారు. అయితే, కాంగ్రెస్ నాయకుడు విజయ్ వడేట్టీవార్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ‘గుజరాతీలు మరాఠీలను వేధిస్తున్నా ప్రభుత్వం మౌనంగా ఉంద’ని నిలదీశారు. మరాఠీలను అవమానించిన గుజరాతీలపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఆహారం వ్యక్తిగత విషయం. మరాఠీలను దూషించే హక్కు ఎవరికీ లేద’ని ఒకరు ఎక్స్ పోస్ట్లో పేర్కొన్నారు.