- సాధించిన తొలి భారతీయ శస్త్రవైద్యుడు
- రొమ్ము క్యాన్సర్పై రఘురామ్ ముద్ర
సహనం వందే, హైదరాబాద్:
దేశ వైద్య రంగానికి దక్కిన చారిత్రక గౌరవం ఇది. 425 ఏళ్ల చరిత్ర కలిగిన, ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ అండ్ సర్జన్స్ ఆఫ్ గ్లాస్గో గవర్నింగ్ కౌన్సిల్కు భారతదేశం నుంచి ఎన్నికైన తొలి శస్త్రవైద్యుడిగా డాక్టర్ రఘురామ్ ఘనత సాధించారు. కిమ్స్ – ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్ వ్యవస్థాపక డైరెక్టర్గా ఆయన రొమ్ము క్యాన్సర్ నివారణ, చికిత్సలో అద్భుతమైన సేవలు అందించారు. డాక్టర్ రఘురామ్ ఇప్పుడు యునైటెడ్ కింగ్డమ్ బయట దేశాలకు ఈ కౌన్సిల్లో ప్రాతినిధ్యం వహించనున్నారు. యూకే రాయల్ కాలేజీల చరిత్రలోనే అత్యంత కఠినమైన ఎన్నికల్లో ఈ విజయం దక్కడం భారత వైద్య చరిత్రలో ఒక మైలురాయి.
రొమ్ము క్యాన్సర్ బాధితులకు అంకితం!
గ్లాస్గో కౌన్సిల్లో యూకే బయటి దేశాల శస్త్ర చికిత్స వైద్యులకు కేవలం ఒకే ఒక్క సీటు ఉంది. ఆ ఒకే ఒక్క సీటు కోసం ప్రపంచం నలుమూలల నుంచి 26 మంది ప్రముఖ వైద్యులు పోటీ పడ్డారు. అత్యంత కఠినమైన పోటీ మధ్య జరిగిన ఈ ఎన్నికల్లో డాక్టర్ రఘురామ్ ఏకైక విజేతగా నిలిచారు. 2025-2028 కాలానికి కౌన్సిల్ సభ్యుడిగా ఆయన కొనసాగుతారు. ఈ గౌరవాన్ని తన గురువులు, చికిత్స పొందిన, ప్రస్తుతం పొందుతున్న రొమ్ము క్యాన్సర్ బాధితులు, తన మాతృభూమికి అంకితం చేస్తున్నట్లు డాక్టర్ రఘురామ్ ప్రకటించడం ఆయన నిబద్ధతకు నిదర్శనం. ఇప్పటికే పద్మశ్రీ, డాక్టర్ బీసీ రాయ్ జాతీయ అవార్డు వంటి ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్న ఆయన… ఇప్పుడు ప్రపంచ స్థాయి వేదికపై భారతదేశ వైద్య రంగానికి కొత్త శకానికి నాంది పలికారు.