మెడికోలను బెదిరిస్తున్న యాజమాన్యాలు…

  • ధర్నాలు చేస్తే డాక్టర్ డిగ్రీ రాదని వార్నింగ్
  • స్టైఫెండ్ కోసం మహావీర్ విద్యార్థుల ధర్నా
  • ఏం చేసుకుంటారో చేసుకోండని అసహనం

సహనం వందే, హైదరాబాద్:
జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నిబంధనల ప్రకారం స్టైఫండ్ ఇవ్వాలని కోరుతూ ధర్నా చేస్తున్న మెడికోలను ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాలు బెదిరిస్తున్నాయి. ఇలా ధర్నాలు చేస్తే మీ డాక్టర్ డిగ్రీ ఎలా వస్తుందో చూడండని వార్నింగ్ ఇస్తున్నాయి. సోమవారం వికారాబాద్ లోని మహావీర్ మెడికల్ కాలేజీకి చెందిన ఎంబీబీఎస్ హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థులు ధర్నా చేపట్టారు. తమకు స్టైఫెండ్ ఇవ్వాలని కోరారు. దీంతో కాలేజీ యాజమాన్యం చెందిన ప్రతినిధి ఒకరు వారి వద్దకు వచ్చి మీకు డిగ్రీలు కావాలంటే ఇలా ధర్నాలు చేయవద్దని హెచ్చరించి వెళ్లిపోయారు. అయినప్పటికీ విద్యార్థులు ఏమాత్రం భయపడకుండా తమ ధర్నా కొనసాగించారు. ఏం చేసుకుంటారో చేసుకోండి అని యాజమాన్యం అసహనం వ్యక్తం చేయడం పరాకాష్ట.

ఒక్క పైసా ఇవ్వని దుస్థితి…
మహావీర్ మెడికల్ కాలేజీ శాఖ రాష్ట్రంలోని అనేక ప్రైవేట్ యాజమాన్యాలు విద్యార్థులకు స్టైఫెండ్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. జాతీయ వైద్య కమిషన్ నిబంధనల ప్రకారం ప్రభుత్వ సంస్థలతో సమానంగా యాజమాన్యం విద్యార్థులకు స్టైఫండ్ చెల్లించాలి. ఆ ప్రకారం ఎంబీబీఎస్ హౌస్ సర్జన్లకు రూ. 25 వేలకు పైబడి ఇవ్వాలి. పీజీ విద్యార్థులకు రూ. 50 వేలకు పైబడి ఇవ్వాలి. వారు రోగులకు చేస్తున్నటువంటి వైద్య సేవలను దృష్టిలో పెట్టుకొని ఈ స్టైఫండ్ ఇవ్వాల్సిన బాధ్యత యాజమాన్యాలదే. అదేమీ వారి దయాదాక్షిణ్యాల మీద ఇచ్చేది కాదు. విద్యార్థులు చెల్లించిన ఫీజుల నుంచి స్టైఫెండ్ ఇవ్వాలనేది ఎన్ఎంసీ నిబంధన. కానీ యాజమాన్యాలు మాత్రం ఇవేవీ పట్టించుకోవడంలేదని విద్యార్థులు మండిపడుతున్నారు. తమతో గొడ్డు చాకిరీ చేయిస్తూ పైసా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *