గద్దర్ సినీ అవార్డుల ఫంక్షన్ లో పెద్దలెక్కడ?

  • కనిపించని చిరంజీవి, నాగార్జున, వెంకటేష్
  • రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు దూరం
  • ‘మా’ అధ్యక్షుడు విష్ణు ఎక్కడున్నారు?
  • రాష్ట్ర ప్రభుత్వ అవార్డులంటే లెక్క లేదా?
  • ఇక్కడ రాయితీలు అనుభవిస్తూ నిర్లక్ష్యమా?
  • ప్రభుత్వం అందించే గౌరవాన్ని తిరస్కరించడమే!
  • సీరియస్ గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం
  • ‘వాళ్లకు గద్దర్ సినీ అవార్డు ఇస్తే మేం చప్పట్లు కొట్టాలా?’
  • ఒక హీరో వ్యాఖ్య… సంకుచితత్వానికి నిదర్శనం

సహనం వందే, హైదరాబాద్:
సినిమా పరిశ్రమకు తామే పెద్దలమని చెప్పుకుంటారు. కళామతల్లి బిడ్డలమని డబ్బా కొట్టుకుంటారు. పొద్దున్న లేస్తే నీతి కబుర్లు చెబుతుంటారు. పైనుంచి దిగివచ్చిన దేవదూతలుగా భావిస్తుంటారు. అలాంటి పెద్దలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గద్దర్ సినీ అవార్డుల ఫంక్షన్ కు హాజరు కాకపోవడంపై రాష్ట్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాదులో ఉంటూ… ఇక్కడి భూములపై రాయితీలు అనుభవిస్తూ… సినిమా టిక్కెట్లకు ధరలు పెంచుకుంటూ వందల వేల కోట్లకు పడగలెత్తిన మన కళామతల్లులు ఎక్కడికి వెళ్ళిపోయారు? తెలంగాణ అంటే ఇష్టం లేదా? గద్దర్ పేరున ఇచ్చే అవార్డు అంటే చులకనా? అన్న అంశాలపై ప్రజల్లో, సినీ అభిమానుల్లో తీవ్రమైన చర్చ జరుగుతుంది. సినీ ప్రముఖులు హాజరు కాకపోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇలాగైతే తాను ఏమాత్రం సహకరించనని తేల్చి చెప్పినట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి.

నటీనటుల తీరుపై దిల్ రాజు అసంతృప్తి…
గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకకు చాలా మంది నటీనటులు గైర్హాజరు కావడంపై ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వేడుకకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు, నటులు అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, నందమూరి బాలకృష్ణ, దర్శకుడు రాజమౌళి వంటి ప్రముఖులు హాజరయ్యారు. 2014 నుంచి 2023 వరకు ఉత్తమ చిత్రాలకు, 2024లో వివిధ కేటగిరీలలో అవార్డులు ప్రకటించారు. అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రానికి ఉత్తమ నటుడిగా, నివేదా థామస్ ’35: ఇది చిన్న కథ కాదు’ చిత్రానికి ఉత్తమ నటిగా అవార్డులు అందుకున్నారు. కొందరు నటీనటులు హాజరు కాకపోవడంపై దిల్ రాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ప్రభుత్వం అవార్డులు ఇస్తుందంటే వచ్చి స్వీకరించాలి. షూటింగ్స్‌లో బిజీగా ఉన్నా అందరూ హాజరు కావాలి. ఇది మన బాధ్యత’ అని ఆయన స్పష్టం చేశారు. ‘భవిష్యత్తులో ప్రభుత్వ అవార్డులు ఇచ్చినప్పుడు డైరీలో డేట్ నోట్ చేసుకోండ’ని కఠినంగానే ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఆరు నెలల పాటు కష్టపడి ఈ అవార్డులను నిర్వహించినప్పటికీ, కొందరు గ్రహీతలు హాజరు కాకపోవడం వేడుకల స్ఫూర్తిని దెబ్బతీసిందని దిల్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు.

‘వాళ్లకు అవార్డు ఇస్తే మేం చప్పట్లు కొట్టాలా?’
తెలంగాణ ప్రభుత్వం గద్దర్ పేరిట ఈ అవార్డులను ప్రవేశపెట్టడం ద్వారా సినీ పరిశ్రమను గౌరవించే ప్రయత్నం చేసింది. అయితే సినీ ఇండస్ట్రీలో అత్యంత ప్రముఖులైన మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, ప్రభాస్, శ్రీలీల, రష్మిక, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు వంటి వారు రాకపోవడంపై తెలంగాణ ప్రజలు మండిపడుతున్నారు. బాలకృష్ణకు ఎన్టీఆర్ జాతీయ అవార్డు ఇవ్వడం పట్ల కొందరు పెద్దలు విముఖతతో ఉన్నట్టు తెలిసింది. అలాగే అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడిగా అవార్డు ఇవ్వడంతో మెగా ఫ్యామిలీ దూరంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. వీళ్ళకు అవార్డులు ఇస్తుంటే తాము చప్పట్లు కొట్టాలా అని ఒక ప్రముఖ హీరో వ్యాఖ్యానించినట్లు తెలుస్తుంది. ఈ అవార్డులను గౌరవంగా భావించకపోవడం వల్ల సినీ పరిశ్రమ, ప్రభుత్వం మధ్య సహకారం బలహీనపడే ప్రమాదం ఉంది. ఇది కేవలం ఒక వేడుకకు హాజరు కాకపోవడం కాదు, ప్రభుత్వం అందించే గౌరవాన్ని తిరస్కరించినట్లని ఒక సినీ విమర్శకుడు అభిప్రాయపడ్డారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *