- ప్రభుత్వాల అణిచివేతపై ఆగ్రహం
- ‘ప్రజాస్వామ్యం- పత్రికాస్వేచ్ఛ’ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం
సహనం వందే, హైదరాబాద్:
పత్రికా స్వేచ్ఛ ప్రమాదంలో పడిందని సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో శనివారం ‘ప్రజాస్వామ్యం- పత్రికాస్వేచ్ఛ’ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీనియర్ జర్నలిస్టు ఆర్.దిలీప్ రెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ధనుంజయ రెడ్డి మాట్లాడుతూ, గతంలో ప్రభుత్వాలు వ్యతిరేక వార్తల పట్ల కొంత అసంతృప్తి చూపేవి కానీ ఇప్పుడు అసహనం నుంచి కక్ష సాధింపు వరకు వచ్చాయని ఆరోపించారు. ప్రభుత్వాలు పూర్తిగా అనుకూల వార్తలు కోరుకుంటున్నాయని, అన్ని పత్రికలు ఇదే తీరును అనుసరించాలని భావిస్తున్నాయని తెలిపారు. కించిత్తు వ్యతిరేకంగా ఉన్న హెడ్డింగ్ను కూడా జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. లిక్కర్ కేసుతో సంబంధం లేకపోయినా, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తన ఇంటికి వచ్చి పోలీసులు సోదాలు చేశారని గుర్తు చేశారు. ఇలాంటి ఘటనలు పత్రికలకు, ప్రజలకు ఏ మాత్రం మంచిది కాదని, పొలిటికల్ బాసులకు తలొగ్గి పోలీసులు, అధికారులు కూడా నిబంధనలు పాటించకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టే తప్పు అంటే, అరెస్టు చేయడమేకాకుండా ‘సాక్షి’ కార్యాలయాలపై దాడులు చేయడం, బోర్డులను పెకిలించేయడం, గేట్లు దూకి రావడం, నిప్పు పెట్టడం లాంటి చర్యలు తీవ్ర గర్హనీయమని ఆయన తీవ్రంగా ఖండించారు.