గుడ్డు గోల్‌మాల్‌ – మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖలో డ్రామా

  • పాత కాంట్రాక్టర్లకే అధికారుల రెడ్ కార్పెట్
  • రైతుల ఉసురు పోసుకుంటున్న వైనం

సహనం వందే, హైదరాబాద్:
మహిళా శిశు సంక్షేమ శాఖలో జరుగుతున్న గుడ్డు గోల్‌మాల్‌ షాక్‌కు గురిచేస్తోంది. పాత కాంట్రాక్టర్లకే గుడ్ల సరఫరా కట్టబెడుతూ, కొత్త టెండర్ల ఎంపికలో జాప్యం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 35,700 అంగన్‌వాడీ కేంద్రాలకు 36 కోట్లకు పైగా కోడిగుడ్ల సరఫరా కోసం ఏటా టెండర్లు జారీ చేయాలి. కానీ ఈ ఏడాది మార్చిలో జారీ చేసిన టెండర్లు పాత కాంట్రాక్టర్ల కోసమే అన్నట్లుగా నిబంధనలు వచ్చాయి. దీనిపై పౌల్ట్రీ రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినా, టెండర్ గడువును మూడుసార్లు పొడిగించినా నిబంధనల్లో మార్పులు లేవు. ఈ కుట్రపూరిత జాప్యం వెనుక అధికారుల అలసత్వం, అవినీతి, పాత కాంట్రాక్టర్లతో కుమ్మక్కు అని స్పష్టమవుతోంది. టెండర్లు తెరవాల్సిన జూన్ 17 తేదీపైనా సందిగ్ధత నెలకొంది. ఇది ప్రజా ధనాన్ని దోచుకోవడానికి పన్నిన కుట్ర అన్న విమర్శలు వస్తున్నాయి.

పాత కాంట్రాక్టర్లకే పెద్ద పీట…
కాంట్రాక్టు గడువు ముగిసి రెండు నెలలు దాటినా పాత కాంట్రాక్టర్లనే జూన్ నెలాఖరు వరకు కొనసాగించాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేయడం అరాచకానికి పరాకాష్ఠ. అలాగే బహిరంగ మార్కెట్ ధరలకు సమానంగా కోడిగుడ్డు ధరను రూ. 6కు పెంచుతూ తీసుకున్న నిర్ణయం పాత కాంట్రాక్టర్ల జేబులు నింపడానికే తప్ప, రైతులకు మేలు చేయడానికి కాదు. కొత్త రైతులకు అవకాశం ఇవ్వకుండా, దొడ్డిదారిన పాత వారికే కాంట్రాక్టులు కట్టబెడుతూ, ఈ శాఖ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని పౌల్ట్రీ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్య లక్ష్మి పథకం కింద చిన్నారులు, గర్భిణులకు పోషకాహారం అందించాల్సిన శాఖ, అవినీతికి వేదికగా మారడంపై విమర్శలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి సూచనలతో టెండర్ గడువు పొడిగించినా, నిబంధనల్లో మార్పులు లేకపోవడం దేనికి సంకేతమని అంటున్నారు.

చేతులు దులుపుకునే ఆలోచనలో ఉన్నారా?
జూన్ 17న టెండర్లు తెరిచి కొత్త కాంట్రాక్టర్లను ఎంపిక చేస్తారా లేక మరోసారి గడువు పొడిగించి చేతులు దులుపుకుంటారా అనే సందేహాలు ఉన్నాయి. పాత కాంట్రాక్టర్లకే అనుకూలంగా నిబంధనలు ఉండటం, గడువు పొడిగింపులతో జాప్యం చేయడం వెనుక అధికారులు, కొందరు రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో పారదర్శకత లోపించడం, రైతుల ఆందోళనలను పట్టించుకోకపోవడం ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగిస్తోంది. టెండర్ నిబంధనలను సవరించి, అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని పౌల్ట్రీ రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *