- మలేషియా ఎయిర్లైన్స్ మిస్టరీ
- వెతికేందుకు రూ. 1,600 కోట్లు ఖర్చు
- అయినా ఫలితం శూన్యం…
- వైమానిక చరిత్రలో అంతుబట్టని రహస్యం
సహనం వందే, హైదరాబాద్:
2014 మార్చి 8న మలేషియా రాజధాని కౌలాలంపూర్… సరిగ్గా అర్ధరాత్రి 12:41 గంటలకు బోయింగ్ 777-200 మలేషియా ఎయిర్లైన్స్ విమానం చైనా రాజధాని బీజింగ్ వైపునకు బయలుదేరింది. అందులో 239 మంది ప్రయాణిస్తున్నారు. బయలుదేరిన గంట తర్వాత విమానం అకస్మాత్తుగా రాడార్లో కనిపించకుండా పోయింది. చివరిసారి ‘గుడ్ నైట్ మలేషియన్ త్రీ సెవెన్ జీరో’ అని విమాన సిబ్బంది ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణ కేంద్రానికి సమాచారం ఇచ్చిన తర్వాత గల్లంతైంది. ఆ తర్వాత విమానం తన నిర్ణీత మార్గాన్ని వదిలి దక్షిణ భారత మహాసముద్రం వైపు మళ్లినట్లు భావిస్తున్నారు. అయితే ఎందుకు మార్గాన్ని మార్చుకుంది? ఎవరు మళ్లించారు? అనే ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం లేదు.
అంతు చిక్కని రహస్యం…
దశాబ్దం గడిచినా ఆ విమానం ఆచూకీ దొరకక లేదు. దానికోసం మలేషియా, ఆస్ట్రేలియా, చైనాలు సంయుక్తంగా చేపట్టిన శోధన ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా నిలిచింది. ఈ వెతుకులాట కోసం దాదాపు రూ. 1,600 కోట్లు ఖర్చు చేశారు. 1,20,000 చ. కిలోమీటర్ల విస్తీర్ణంలో సముద్ర ప్రాంతాన్ని గాలించారు. నాలుగు సంవత్సరాలపాటు శోధించారు. అయితే ఫలితం మాత్రం నిరాశే. మరోసారి 2018లో మలేషియా ప్రభుత్వం అమెరికాకు చెందిన ఓషన్ ఇన్ఫినిటీ అనే ప్రైవేటు సంస్థతో వెతుకులాట మొదలుపెట్టింది. దొరికితేనే డబ్బు ఇస్తామనే ఒప్పందంతో వారు ప్రయత్నించారు. అయినా విమానం కనబడలేదు.
అదృశ్యంపై అనేక అనుమానాలు…
ఈ విమానం అదృశ్యంపై అనేక ఊహాగానాలు, కుట్ర సిద్ధాంతాలు ప్రచారంలో ఉన్నాయి. పైలట్ ఉద్దేశపూర్వకంగా విమాన దిశను మార్చి ఉండొచ్చని కొందరి నమ్మకం. తీవ్రమైన సాంకేతిక లోపం వచ్చి ఉండొచ్చని మరికొందరి అభిప్రాయం. విమానం బలవంతంగా హైజాక్ అయిందని అనుమానం. అయితే ఇవేవీ నిర్ధారణ కాలేదు. అందులో ప్రయాణించినవారి కుటుంబాలు తమ ఆత్మీయుల ఆచూకీ కోసం ఇప్పటికీ ఎదురు చూస్తుండటం విశేషం.